శ్రీ అంటే సంపద. స్త్రీ ఉంటేనే సంపదకు విలువ. మనిషి మనుగడలో ఆమెదే అసలు పాత్ర. అమ్మగా, అక్కగా, చెల్లిగా, చెలిగా.. అన్నీ ఆవిడే! ఆధునిక సమాజం మహిళకు అవకాశంలో సగం అంటున్నది. కానీ, అన్నిటా ఆమెది పైచేయి కావాలి. స్త్రీ ఈ జగతికి శ్రీరామ రక్ష!
మంగళవారం మహిళా దినోత్సవం
ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యానాం శతం పితా
సహస్రం తు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే॥
(మను, 2:145)
పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, వందమంది ఆచార్యుల కంటే తండ్రి, వెయ్యిమంది తండ్రుల కంటే తల్లి పూజనీయురాలని మనుధర్మశాస్త్రం చెబుతుంది. పురాణేతిహాసాలు పరికించి చూస్తే అతివ అతిబలసంపన్నురాలని అవగతం అవుతుంది. అందుకే ‘మాతృదేవోభవ’ అని ఆది నమస్కారం అమ్మకే చెల్లించారు. ‘స్త్రీని గౌరవించిన చోట దేవతలు పూజలు అందుకుంటారు’ అని మన ధర్మం పేర్కొన్నది. వేదాలు, పురాణాలు, కావ్యాలు, శాస్ర్తాలు, ధర్మాలు… అన్నీ ‘ఆమె’కు బ్రహ్మరథం పట్టాయి. త్రిమూర్తులు సైతం ఆదిపరాశక్తి ఆజ్ఞమేరకు నడుచుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. సీత, సత్యభామ, అనసూయ, సావిత్రి తదితర పురాణ మహిళల గాథలు మహిళలు ఎంతటి మహోన్నతులో చాటిచెబుతాయి.
రామా! మాట వినుమా!
సీతారాములు వనవాసం చేస్తున్న రోజులవి. ఒకరోజు కొందరు మునులు ఆశ్రమానికి వస్తారు. రాక్షసుల అకృత్యాల కారణంగా తమ యజ్ఞయాగాది క్రతువులు సాగటం లేదని రాముడికి విన్నవించుకుంటారు. ‘రాక్షసులను అంతమొందించి మీ ఇబ్బందులను పరిష్కరిస్తాన’ని హామీ ఇస్తాడు రాముడు. విల్లంబులు ధరించి రాక్షసులతో పోరాటానికి వెళ్తున్న రాముడిని సీతమ్మ వారిస్తుంది. ఒకసారి తన మాటలు వినమని చెబుతుంది. ‘పూర్వం ఓ యతీశ్వరుడు కఠోర తపస్సు చేయసాగాడు. ఇంద్రుడు ఆ మునిని పరీక్షించాలనుకున్నాడు. వేటగాడి వేషం ధరించి ముని ఆశ్రమానికి వస్తాడు. మునికి తన ఖడ్గాన్ని ఇస్తాడు. తిరుగు ప్రయాణంలో ఖడ్గం తీసుకుంటానని, అప్పటివరకు దానిని భద్రపరచమని చెబుతాడు. ఆ ఖడ్గాన్ని ముని తన ఆసనం సమీపంలో భద్రపరుస్తాడు. రోజులు గడిచిపోతాయి. వేటగాడి జాడ ఉండదు. వాడకం లేకపోతే ఖడ్గం తుప్పు పట్టిపోతుందని భావిస్తాడు ముని. దానితో తనకు అవసరమైన దర్భలు, ఆకులు కోయడం చేస్తుండేవాడు. ఇంకొన్ని రోజుల తర్వాత ఆశ్రమంలోకి చొరబడిన క్రూరమృగాలను వేటాడటం ప్రారంభించాడు. మరికొన్నాళ్లకు తన తపస్సును మరిచి పూర్తిగా వేటగాడిగా మారిపోతాడు. వనవాసంలో ప్రశాంతంగా ఆశ్రమ జీవనం గడుపుతున్న మనకు కొత్త వైరం ఎందుకు?’ అని ప్రశ్నిస్తుంది సీత.
రాజధర్మం మేరకు రాముడు ఖరదూషణులపై యుద్ధానికి వెళ్లడం, వారిని సంహరించడం, విషయం రావణుడికి తెలియడం, సీతాపహరణం, రామరావణ యుద్ధం, రావణ సంహారం ఇవన్నీ తర్వాత జరిగిన పరిణామాలు. కానీ, రాముడు కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడని భావించి అడుగు వేసేముందు ఆలోచించమని హెచ్చరిస్తూ యతీశ్వరుడి కథ చెప్పింది సీత. కుటుంబానికి ఏది మేలో స్త్రీమూర్తులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే, వారి అభిప్రాయాలను గౌరవించాలి. ఆర్థికంగా అండగా ఉంటున్న నేటి మహిళకు నిర్ణయాధికారం ఇచ్చి చూడండి. సమస్యలు ఆ ఇంటి ఛాయలకు రావు.
సత్యా సమర సఖి..
వరాల గర్వంతో నరకాసురుడు పేట్రేగిపోయాడు. అమాయకులను పీడించసాగాడు. వేలాది మంది అతివలను బంధించాడు. నరకుడిపైకి యుద్ధానికి బయల్దేరాడు కృష్ణుడు. సత్యభామ యుద్ధం చూస్తానంటూ వెంట నడిచింది. భీకర యుద్ధం మొదలైంది. తానూ యుద్ధం చేస్తానంటూ కృష్ణుడి చేతిలోని ధనుర్బాణాలను తీసుకుంది. నరకుడి రాజ్యానికి రక్షగా ఉన్న ఆరు వలయాలనూ నేలమట్టం చేసింది. దివ్యాస్ర్తాన్ని ప్రయోగించి నరకుణ్ని నేలకూల్చింది. అవకాశం ఇస్తే సమరంలోనూ సగం అని నిరూపించిన సత్యభామ స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచింది.
మహిషాసురుణ్ని సంహరించిన దుర్గ, భండాసురుణ్ని తుదముట్టించిన బాలాత్రిపుర సుందరి, కొల్హాసురుణ్ని అంతమొందించిన మహాలక్ష్మి… ఇలా చెడుపై మంచి సాధించిన విజయాల్లో మహిళ పాత్ర కనిపిస్తుంది. ఈ జగత్తుకు స్త్రీమూర్తి శ్రీరామ రక్షగా నిలిచింది.
– విహారి