అదృష్టం గడప వద్దకే వచ్చింది. తోటి మహిళల్లో చైతన్యం నింపే అవకాశం దక్కింది. సంతోషంగా సరేనన్నారు. అంతలోనే అనేక సందేహాలు. ‘మీకు అండగా ఉంటాం. సంఘాలను స్థాపించండి’ అని హిందీలో ఎలా చెప్పాలి? ‘మా వల్ల అవుతుందా దీదీ?’ అని ఏ చిట్టి చెల్లెలో అడిగితే, ఏమని ధైర్యం నూరి పొయ్యాలి? హిందీ తెలియని భాషేం కాదు. అలా అని, అనర్గళంగా మాట్లాడేంత నైపుణ్యమూ లేదు. దీంతో, ఎవరికివారు విద్యార్థులు అయిపోయారు. వంద రోజుల పాటు ‘స్పోకెన్ హిందీ’ క్లాసులకు హాజరయ్యారు. భాష ఇచ్చిన బాసటతో వివిధ రాష్ర్టాల మహిళలతో సంఘాలు ఏర్పాటు చేయించారు నల్లగొండ నారీమణులు.
చైతన్యానికి నిలువెత్తు రూపం.. తెలంగాణ మహిళ. రజాకార్లను ఎదిరించిన తెగువ, కరువును తట్టుకు నిలిచిన ధీరత్వం ఆమె సొంతం. ఇక, నలుగురు మహిళలు చేతులు కలిపితే తిరుగేం ఉంటుందీ? కాబట్టే, సంఘాలుగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. లాభాలు సంపాదిస్తున్నారు. ప్రత్యేకించి, నల్లగొండ జిల్లాలో రెండు దశాబ్దాల కిందట పొదుపు సంఘాల్లో చేరిన
మహిళలు పరిపూర్ణ ఆర్థిక స్వావలంబన సాధించారు. ఈ విజయాల చరిత్రను తమ గడ్డమీదా పునరావృతం చేయమంటూ.. పొరుగు రాష్ర్టాల పాలకులు మన సర్కారును కోరుతున్న సందర్భాలు అనేకం. అలా, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 33 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాల బాధ్యత తీసుకున్నారు. 9 నెలల పాటు గ్రామగ్రామానికి వెళ్లి, మూడు వేల సంఘాలు ఏర్పాటు చేయించారు.
వంద రోజుల్లో…
వివిధ రాష్ర్టాల మహిళలను కలవాలి, పరిచయం చేసుకోవాలి, కష్టసుఖాలు పంచుకోవాలి, సంఘాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి. ఇదంతా జరగాలంటే.. ముందు, స్థానిక భాష తెలియాలి. హిందీ, ఉర్దూ కొంత అర్థమైనా ధారాళంగా మాట్లాడేంత నైపుణ్యం లేదు. అలా అని, వెనకడుగూ వేయలేరు. ‘బాధ్యతల నిర్వహణలో భాష అవరోధం కాకూడదనే ఉద్దేశంతో హిందీ నేర్చుకునేందుకు ఖమ్మం వెళ్లాం. వంద రోజుల్లో పూర్తిగా పట్టు సాధించాం. ఈ వయసులో ఇలా కొత్త భాష నేర్చుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా అక్కడి నేతలతో పోలిస్తే మన ప్రభుత్వాలు గొప్పగా పనిచేస్తున్నాయి. సామాజిక చైతన్యంలో మనం చాలా ముందున్నాం’ అంటూ తన అనుభవాలను పంచుకుంటారు లొడంగి సరోజ. ఈ ప్రాజెక్టు వల్ల మన మహిళలు ఆర్థికంగానూ లాభపడ్డారు. ‘చార్జీలు లేకుండానే రూ.60 వేల వరకు ఇచ్చినరు. సంపాదన ముఖ్యమే అయినా, అంతమందిని చైతన్యవంతులను చేశామనే తృప్తి చాలా గొప్పది’ అని పొంగిపోతారు పగడాల సునీత.
ప్రేమతో పనిచేశాం..
‘నేను ఇరవై రెండేండ్ల నుంచీ సమభావన సంఘంలో సభ్యురాలిని. ప్రస్తుతం సంఘ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. డీఆర్డీఏ అధికారుల సూచన మేరకు ఉత్తరప్రదేశ్లోని లక్నో, ఝాన్సీ, హమీర్పూర్, లలిత్పూర్ లలో 270 రోజులు ఉన్నాను. ఐదుగురు సభ్యులం కలిసి, అక్కడి మహిళలను ఒప్పించి, 21గ్రామాల్లో 138 సంఘాలు ఏర్పాటు చేయించాం. ప్రతి సంఘంలో 10-15 మంది సభ్యులు ఉంటారు. అందరితోనూ బ్యాంకు ఖాతాలు తెరిపించాం. మొదటి నెల పొదుపు డబ్బులు వేయించాం. ప్రతి నెలా ముప్పై రూపాయలు వేసుకొని పొదుపు చేసుకోవాలని సూచించాం’ అంటూ జ్ఞాపకాలను నెమరేసుకుంటారు కేతేపల్లి సమభావనా సంఘానికి చెందిన ఆలుదాసు గీతమ్మ.
‘ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌడి గడ్వాల్ జిల్లాను ఆరుసార్లు సందర్శించాను. 250 రోజులు అక్కడే ఉన్నాను. మొదట్లో గ్రామస్తులు మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. క్రమంగా, మేము పంచిన ప్రేమకు, కురిపించిన అభిమానానికి కరిగిపోయి అక్కున చేర్చుకున్నారు. మొత్తం 142 సంఘాలు ఏర్పాటు చేయించాం’ అని సగర్వంగా చెబుతారు మరో సభ్యురాలు మండల్రెడ్డి విజయలక్ష్మి. లక్ష్యాన్ని పూర్తిచేసుకొని తిరిగొస్తున్న సమయానికి.. ప్రతి మహిళ కండ్లలో ఎనలేని సంతృప్తి. ఇదో గొప్ప అనుభవమనీ, దేశంలోని అన్ని రాష్ర్టాల బాధ్యతలు అప్పగించినా సమర్థంగా పూర్తిచేస్తామనీ ముక్త కంఠంతో ప్రకటిస్తున్నారీ మహిళలు.. అదీ హిందీలో!
నకిరేకంటి శ్రీనివాస్ నల్లగొండ