న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా॥
(భగవద్గీత 1-32)
Bhagavad Gita | ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోరుకునేది ఆనందాన్నే. అయితే ఆ ఆనందం అందరూ అనుభవించగలుగుతున్నారా? లేదు అనుకుంటే.. కారణం ఏమిటి? అంటే తాను ‘కోరిన’ ఆనందం వేరు.. తనకు ‘అవసరమైన’ ఆనందం వేరు. ఈ రెండిటి మధ్య భేదాన్ని గుర్తించలేని మానసిక స్థితి కలిగిన మానవుడు.. ఎంత సాధించినా అసంతృప్తితో రగిలిపోతూ కర్తవ్యాన్ని విస్మరిస్తాడు.
ప్రతి వ్యక్తి జీవితానికి ఒక ప్రయోజనం ఉంటుంది.. అలాగే కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. దేనికోసం దేనిని వదులుకోవాలో తెలుసుకోవడమే జ్ఞానం.. అదే విజ్ఞత. అదే మన లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. సాధారణ వ్యక్తికి ఇందులో దేనిని ఆదరించాలనే సమస్య వస్తుంది. సమస్య తనది కాబట్టి తానే పరిష్కారమార్గాన్ని అన్వేషించాలనీ, ఆ పరిష్కారమూ తనయందే ఉన్నదని గ్రహించగలిగిన వారు అన్వేషకులు. వాళ్లే సాధకులు. నిజానికి అదే సమస్యా పరిష్కారానికి మొదటి మెట్టు.
మహాభారత యుద్ధరంగంలో ఉభయ సైన్యాలలో ఉన్న తన చుట్టాలు, గురువులు, మిత్రులను చూడగానే అర్జునునికి జాలి కలిగింది. ఆత్మీయులైన వీరితోనా తాను యుద్ధం చేయాలి. వైరిబలాలలో ఉన్న తన వారిని తాను సంహరించినా.. వైరివర్గం వారు తన పక్షంలోని వారిని సంహరించినా.. తనకు మిగిలేది దుఃఖమే కదా! ఈ స్వజన సంహారంతో లభించే సామ్రాజ్యం తనకు సంతోషాన్ని ఇస్తుందా? భౌతిక సంపదను పొందడానికి చేసే స్వజన సంహారం అన్యాయం కాదా? బంధుమిత్రులను చంపి తాను తినే నెత్తుటికూడు ప్రశాంతతను ఇస్తుందా? పరిణామాలు తెలిసీ హింసాత్మకమైన యుద్ధ మార్గంలో నడవడం కన్నా అడవులలో కందమూలాలు తింటూ.. తపస్సు చేసుకోవడం ఉత్తమ మానవ ధర్మం కాదా? ఇది కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి ఎదురైన సమస్య. దాని పరిష్కారానికి తన సామర్థ్యం సరిపోదని గ్రహించిన అర్జునుడు తాను నమ్మి, నారాయణునిగా భావించిన కృష్ణుడి సాయం కోరాడు.
యుద్ధంలో తనవారు చనిపోతారనే భావన వల్ల కలిగిన జాలి వారిని చిరకాలం బ్రతికిస్తుందా? లేదు! మరి ఆ జాలికి కారణం? మృత్యుభీతి. నిజానికి చేసే పనిలో ఆనందాన్ని పొందని వ్యక్తిలో అనేక సంశయాలు వెలుగుచూస్తాయి. తాను చేస్తున్న పని పవిత్రమైనదనీ, తాను ఆ కార్య నిర్వహణలో ఉపకరణం మాత్రమే తప్ప కర్తను కాననీ, త్రికరణశుద్ధిగా నమ్మి ఆ పనిని ఉపాసనగా భావించి ఆచరించే వ్యక్తి ఆ పనిలో భగవంతుడిని దర్శిస్తాడు. దానినే ‘రసోవైసహ’ అన్నారు పెద్దలు. బాధపడటం వల్ల సమస్య
పరిష్కారం కాదు. బాధ అనేది ఒక ఊగే కుర్చీ లాంటిది. అది నిరంతరం తీరికలేకుండా
చేస్తుందేకాని ఒక అంగుళం కూడా ముందుకు కదిలించదు.
ఆ సమయంలో కృష్ణుడు… ‘అర్జునా! నీవు సమస్యలోని బాహ్యపార్శ్వాన్నే చూస్తున్నావే కాని.. అంతరంగంలోకి చూడటం లేదు. ఆంతర్యాన్ని గ్రహించు నీ సందేహాలు తీరిపోతాయి’ అన్నాడు. నిజానికి అర్జునుడి సందేహం మనందరిది కూడా. భగవంతుడు ఉపదేశించిన గీతలో చూడాల్సింది పదాలను కాదు.. వాటి వెనుక దాగిన రహస్యాన్ని. సమస్యలను ఎదిరించి పరిష్కరించుకోవాలే కాని… పారిపోవడం సమంజసం కాదు. సమస్యల నుంచి సమస్యలను సృష్టించుకోవడం కాదు.. సమస్యలలో సమరసతను చూడటం అలవర్చుకోవాలి. అలా ఆలోచించగలిగిన వారిలో జాత్యంతరీకరణ జరుగుతుంది. వారే విజయ సాధకులుగా నిలుస్తారు. అదే గీతాబోధనకు అంతిమ ఫలితం.
– పాలకుర్తి రామమూర్తి