జీవనశైలి లోపాల కారణంగా ప్రతి పదిమందిలో ఆరుగురిని ఇబ్బంది పెడుతున్న సమస్య.. పైల్స్. ఆ ఆరుగురిలోనూ నలుగురు మహిళలే! ఎంతోమంది స్త్రీలు వ్యాధి తీవ్రతను నిశ్శబ్దంగా భరిస్తున్నారే తప్పించి, వైద్యానికి సిద్ధపడటం లేదు. నవంబర్ 20న వరల్డ్ పైల్స్ డే. ఈ సందర్భంగా మొలల సమస్యకు మూల కారణాలపై అవగాహన పెంచుకుందాం.
వైద్యశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే.. మలద్వారం, పెద్దపేగు చివరి భాగంలో రక్తనాళాల (సిరలు)లో వచ్చే వాపునే మొలలు (పైల్స్) అంటారు. పేగు చివరి భాగంలో అంతర్గతంగా, మలద్వారం చర్మానికి కింది భాగంలో బాహ్యంగా.. మొలలు వృద్ధి చెందుతాయి. గంటల తరబడి కూర్చునే కొలువులు, మసాలాలు గుప్పించిన ఆహారం, చిరుతిండ్లు, జంక్ ఫుడ్, తగినన్ని నీళ్లు తాగక పోవడం.. ఆధునిక కాలంలో మొలల వ్యాధికి ప్రధాన కారణాలు. ఆటలకు దూరం కావడం, తగినంత నిద్రకు నోచుకోకపోవడం, మితిమీరిన గ్యాడ్జెట్ల సహవాసం, వ్యాయామం లేక పోవడం.. తదితర కారణాల వల్ల పిల్లల్లోనూ మొలల వ్యాధి కనిపిస్తున్నది. మలద్వారం దగ్గర నొప్పి, మల విసర్జన సమయంలో రక్తస్రావం.. ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు.
సంకోచం వద్దు
దాదాపు 60 శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు మొలలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని దగ్గరివారితో చెప్పుకొనేందుకు కూడా సంకోచిస్తారు. ఈ బిడియం మహిళల్లో మరింత ఎక్కువ. పైల్స్ సమస్యను గుర్తించిన వెంటనే జనరల్ సర్జన్ను లేదా ప్రాక్టాలజిస్టును సంప్రదించడం ఉత్తమం. నాటువైద్యుల బారినపడితే, సమస్య మరింత పెరుగుతుంది. అన్ని రకాల మొలలకూ శస్త్రచికిత్స అవసరం కాకపోవచ్చు. జీవనశైలి మార్పులు, మందులతోనే 80 శాతం రుగ్మతను నయం చేసుకోవచ్చు. కేవలం 15 నుంచి 20 శాతం మందికి మాత్రమే సర్జరీ చేయాల్సిన అగత్యం ఉంటుంది. మల విసర్జన సమయంలో దీర్ఘ కాలంపాటు రక్తం పడటం అన్నది కొన్నిసార్లు క్యాన్సర్ లక్షణమూ కావచ్చు. కాబట్టి, నిర్లక్ష్యం వద్దు. అందులోనూ.. కుటుంబ బాధ్యతలు, వృత్తి ఉద్యోగాల పరుగులో చాలామంది మహిళలు పోషకాహారం గురించి పట్టించుకోవడం లేదు. తగినన్ని నీళ్లు కూడా తాగడం లేదు. శరీరానికి వ్యాయామం అవసరమనే ప్రాథమిక విషయాన్నీ విస్మరిస్తున్నారు. ఇవన్నీ పైల్స్కు మూల కారణాలే.
– డాక్టర్ శాంతి వర్ధని
సీనియర్ జనరల్ & లాపరోస్కోపిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్