తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. తెలంగాణతోపాటు పలు రాష్ర్టాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టుకు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా, ఔషధంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. దసరా రోజు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. ‘శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అని చదువుతూ జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత జమ్మి ఆకులను ‘బంగారం’ అంటూ బంధుమిత్రులకు ఇచ్చి నమస్కరిస్తారు. కొందరు ఆప్యాయంగా అలయ్ బలయ్ చేసుకుంటారు.
శమీ వృక్షానికి పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి ఉంచుతారు. అది పూర్తయిన తర్వాత శమీ వృక్షానికి పూజ చేసి ఆయుధాలు ధరించి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధిస్తారు. జమ్మిచెట్టును పూజిస్తే శనిదోషాలు తొలగిపోతాయని నమ్మకం. యజ్ఞయాగాది క్రతువుల్లో నిప్పును పుట్టించడానికి జమ్మికొమ్మలను శ్రేష్ఠమైనవిగా పేర్కొంటారు. కనుక దీనిని అగ్నిగర్భ అని కూడా అంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న శమీ వృక్షం అమ్మవారి శక్తికి ప్రతీకగా చెబుతారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. ప్రతి ఆలయంలో ‘జమ్మి’ మొక్కను నాటే బృహత్తర కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగుతున్నది.