CEO Ganesha | కైలాసంలో ఒకపెద్ద అంతర్జాతీయ సంస్థ ఉన్నది. దానికి ఒక కార్యనిర్వాహణ అధికారిని (సీఈవో) నియమించాల్సిన అవసరం వచ్చింది. నిర్ణయ కమిటీ ఉద్యోగార్థులను అందరినీ జల్లెడపట్టి వినాయకుడిని, కుమారస్వామిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వీరిలో ఎవరో ఒకరికి పదవి కట్టబెట్టే బాధ్యత బోర్డు అధ్యక్షులుగా ఉన్న శివపార్వతుల పని. ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఈవో ఎవరన్నది తేలలేదు. నియామకం సజావుగా సాగేలా సూచనలు ఇవ్వాల్సిందిగా నారద మహర్షిని సలహాదారుగా నియమించారు. ‘నారం దదాతి ఇతి నారద’ అంటే నారం- జ్ఞానం ఉన్నవాడు నారదుడు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కొనే మార్గం చూపే యుక్తి ఆయన సొంతం.
ప్రస్తుత సమస్యకు పరిష్కారంగా ఒక నియమం పెట్టాడు. ఇద్దరినీ భూమి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి రమ్మన్నాడు. ముందుగా వచ్చినవారికే పదవి దక్కుతుందని చెప్పాడు. కుమారస్వామి తన వాహన వేగం, తన సామర్థ్యాన్ని తలుచుకొని ఈ పరీక్షలో ఎలా నెగ్గాలో ఆలోచించి.. తక్షణం భూ ప్రదక్షిణకు బయల్దేరాడు. వినాయకుడు బాగా ఆలోచించి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి భూమి చుట్టూ తిరిగిన ఫలితాన్ని పొందాడు. భూ ప్రదక్షిణ చేసి కైలాసానికి చేరుకున్న కుమారస్వామి నియమం ప్రకారం ఈ పదవికి తానే అర్హుడనని అన్నాడు. మళ్లీ సమస్య మొదటికొచ్చింది! దీనిని పరిష్కరించాల్సిందిగా మరో సంస్థ అధిపతి విష్ణుమూర్తిని రంగంలోకి దించారు. అంతా విని ‘ఇద్దరూ సమర్థులే.. ఒకరిది కష్టపడే తత్వం (హార్డ్ వర్క్), మరొకరిది సునిశిత ప్రజ్ఞ (స్మార్ట్ వర్క్). సంస్థకు ఇద్దరూ అవసరమే! ఒకరు ప్రపంచ మార్కెట్ను సర్వేచేశారు. మరొకరు దానిని సమర్థంగా నిలిపే సామర్థ్యాన్ని సంతరించుకున్నారు. కాబట్టి వినాయకుడిని ‘గణపతి’- సీఈవో (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గానూ, కుమారస్వామిని సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గానూ నియమించారు. మొత్తంగా వినాయకుడు గణాధ్యక్షుడిగా ఎదిగిన గాథ మన సామర్థ్యాలను సందర్భోచితంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్పుతుంది.
-పాలకుర్తి రామమూర్తి