నాన్న.. బిడ్డల ఎదుగుదలకోసం తన రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఎన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా కుటుంబ సంక్షేమం కోసం వాటన్నిటినీ పెదవి దాటనియ్యడు. అలాంటి నాన్న నలభై దాటగానే బాధ్యతలు పెరుగుతాయి. ఒక్కొక్కటిగా అనారోగ్య సమస్యలూ పలకరిస్తాయి. నాన్న ఆరోగ్యంగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. అనుకోకుండా ప్రపంచ యోగా దినోత్సవం, ఫాదర్స్ డే రెండూ ఒకేరోజు కలిసొచ్చాయి. నాన్నతో యోగాసనాలు చేయించడానికి ఇంతకన్నా మంచి సందర్భం ఏముంటుంది చెప్పండి. ‘ఐ యామ్ ఫర్ఫెక్ట్లీ ఆల్రైట్’ అని నాన్న అనొచ్చు. అయినా, బతిమాలో,బెదిరించో.. రోజూ మీ నాన్నతో ఈ నాలుగు ఆసనాలు సాధన చేయించండి..
విపరీత కరణి: మానసిక ఒత్తిడి, హైబీపీ తగ్గేందుకు ఈ ఆసనం ఉపయోగపడుతుంది. గోడకు దగ్గరగా పడుకుని, రెండు కాళ్లను నిలువుగా గోడపై ఉంచాలి. చేతులను పకకు రిలాక్స్గా చాచాలి. ఈ ఆసనం వేయడం వల్ల గుండెకు రక్త ప్రసరణ సులభం అవ్వడమే కాకుండా.. బీపీ అదుపులో ఉంటుంది. మానసిక ఒత్తిడి, శారీరక అలసట దూరమవుతాయి.అర్ధ మత్స్యేంద్రాసనం: ఇది షుగర్ లెవల్స్ను అదుపుచేయడానికి సహాపడుతుంది. కింద కూర్చుని ఒక కాలును మడిచి, పకన ఉన్న కాలు మోకాలి అవతలి వైపు ఉంచి, శరీరాన్ని వీలైనంత వరకు వెనక్కి తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల పొట్టలోని క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
శలభాసనం: నడుము నొప్పిని దూరంలో చేయడంలో ఈ ఆసనం ఉపయోగపడుతుంది. బోర్లా పడుకుని, రెండు చేతులనూ తొడల కింద ఉంచి, శ్వాస తీసుకుంటూ మోకాలు వంచకుండా రెండు కాళ్లను పైకి లేపాలి. సయాటికా నరం మీద ఉన్న ఒత్తిడిని తగ్గించి నడుము నుంచి కాలి కింది వరకు వచ్చే తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. నడుము కండరాలనూ బలోపేతం చేస్తుంది.
జాను శీర్షాసనం: మోకాళ్ల సమస్యలతో బాధపడేవారికి ఇది చక్కటి ఆసనం. కూర్చుని ఒక కాలును చాపి, మరో కాలును మడిచి పాదాన్ని చాచిన కాలు తొడకు ఆన్చాలి. ఇప్పుడు నెమ్మదిగా ముందుకు వంగి చాచిన కాలి వేళ్లను అందుకోవడానికి ప్రయత్నించాలి. తొడ వెనుక భాగం, పికల కండరాలను సాగదీయడం వల్ల మోకాళ్ల చుట్టూ ఉన్న గట్టితనం తగ్గి నొప్పి తగ్గుతుంది. మోకాళ్ల నొప్పి ఎకువగా ఉన్నవారు శరీరం సహకరించేంత వరకు మాత్రమే సాగదీయాలి.
నలభై ఏండ్లు దాటడం వల్ల ఏ ఆసనమైనా చాలా నిదానంగా ప్రశాంతమైన శ్వాసతో చేయాలి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది. యోగా సాధన చేసేటప్పుడు సమయం, వాతావరణం విషయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గంటలకొద్దీ చేయకుండా రోజుకు 30 నిమిషాలు చేస్తే చాలు. ప్రతి ఆసనంలో 20 సెకన్లు స్థిరంగా ఉండటం తప్పనిసరి. పైన చెప్పిన ఆసనాలు అయిపోయాక చివరి 5 నిమిషాలు శవాసనంలో పడుకోవాలి. గాలి, వెలుతురు బాగా వచ్చే చోటా, హడావుడి, టీవీ శబ్దాలు లేని ప్రశాంతమైన ప్రదేశంలో మాత్రమే ఈ యోగాసనాలు వేయడం ఉత్తమం. శరీరాన్ని బలవంత పెట్టకుండా, నొప్పి రానంత వరకే నెమ్మదిగా సాధన చేయడం మేలు.