ఆలయాన్ని చేరుకోగానే భక్తులు సాధారణంగా చేసే ప్రక్రియ ప్రదక్షిణ. కేవలం ప్రదక్షిణలు చెయ్యటం కోసమే గుడికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. తమ కోరిక తీరటం కోసం దైవానికి మొక్కుకునే మొక్కుల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. జాతకరీత్యా గ్రహానుకూలం లేకపోయినా, ఏవైనా అరిష్టాలు జరుగుతున్నా కూడా ఆలయాల్లో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఫలానా ఆలయంలో ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయనే ప్రసిద్ధి పొందిన దేవాలయాలు మనదేశంలో చాలా ఉన్నాయి. ఇంతకీ ప్రదక్షిణ పరమార్థం ఏంటి?
భక్తుడు పరిపూర్ణంగా భగవంతుడికి దాసుడయ్యే క్రమంలో వారిద్దరికి మధ్య అనుసంధానంగా నిలిచే వ్యవస్థల్లో ఉన్నతమైంది ‘ప్రదక్షిణ’. ఇదొక రకమైన శరణాగతి. భక్తుడు తనను తాను దైవానికి సమర్పించుకున్నట్టు ప్రకటించే విధానం ఇది. భగవంతుడికి చేసే ఉపచారాల్లో పరిపూర్ణమైన ఉపచారం కూడా ఇదే. గుడికి వచ్చిన భక్తుడి మానసిక స్థితి సాధారణ స్థితికి రావాలంటే అక్కడి దైవికమైన శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలి. వైద్యం నిరూపించిన శాస్త్రం కన్నా ముందుగానే ఆచారం పేరుతో మన సంస్కృతి సాధించిన వైజ్ఞానిక ప్రగతికి నిదర్శనం ఇది.
ప్రదక్షిణ అనే పదానికి ‘తిరగటం’ అనే అర్థం ఉంది. ప్రదక్షిణ క్రియారూపంలో చేసే ప్రణవ (ఓంకారం) జపం అని శివపురాణం చెబుతున్నది. అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు. బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. దేవుడికి చేసే షోడశ ఉపచార పూజలో చివరి అంకం కూడా ఇదే. భగవాన్ రమణ మహర్షి బోధనల ప్రకారం ప్రదక్షిణ అనే పదంలో ‘ప్ర’- సమస్త పాపాల వినాశనాన్ని సూచిస్తుంది. ‘ద’- కోరికలు తీరటానికి సంకేతం. ‘క్షి’- రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. ‘ణ’- అజ్ఞానం నుంచి విముక్తి లభించటం. ఈ కోణంలో ప్రదక్షిణ ప్రక్రియను పరిశీలిస్తే ఈ జన్మలో మన కోరికలు తీర్చటమే కాకుండా జనన మరణ బంధాల నుంచి మనిషిని విముక్తుడిని చేసే సర్వోన్నతమైన ప్రక్రియ అని భావించవచ్చు.
ఆలయానికి చేరుకోగానే భక్తులు అక్కడి ఏర్పాటును అనుసరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. చేతులు జోడించి, ఆలయంలో కొలువైన దైవాన్ని స్మరిస్తూ, ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుంటూ తాము అనుకున్న సంఖ్య ప్రకారం ప్రదక్షిణలు చేస్తారు. మెల్లగా నడవటం, మనసులోకి ఇతరమైన ఆలోచనలు రానివ్వకపోవటం, చేతులు జోడించి నమస్కరించటం ప్రదక్షిణలో ప్రధానమైన అంశాలు. ఇంట్లో నిత్యవిధుల్లో భాగంగా చేసే పూజ పూర్తయిన తర్వాత ఆత్మప్రదక్షిణ తప్పనిసరిగా చెయ్యాలి. ఆలయాల్లో ఆత్మ ప్రదక్షిణ చెయ్యకూడదు. భక్తులు పూజల్లో భాగంగా చేసే ఆత్మప్రదక్షిణ, దైవానికి ఆలయంలో చేసే ప్రదక్షిణ కూడా భూమి తన చుట్టూ తాను తిరగటం, సూర్యుడి చుట్టూ తిరగటం అనే విషయాల్ని ప్రతిబింబిస్తుంది. ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దైవం నుంచి పొందుతాం. ఇది మనసుకు, శరీరానికి కూడా మేలుచేస్తుంది. తద్వారా మనిషికి ప్రశాంతత, జ్ఞానం పెరుగుతాయి.
ఆత్మ ప్రదక్షిణ : తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణ
పాద ప్రదక్షిణ : పాదాలతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణ
దండ ప్రదక్షిణ : అవ్యగ్ర చిత్తంతో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణ
అంగ ప్రదక్షిణ : సాత్వికావయవాలు నేలకు తగిలేటట్టుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణ
గిరి ప్రదక్షిణ : దేవుడు కొలువుండే కొండ చుట్టూ చేసే ప్రదక్షిణ
ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా విధానాలు ఉన్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరకు ధ్వజస్తంభం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడున్న శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. దీనికే సోమసూత్ర ప్రదక్షిణం అనే పేరు కూడా ఉంది. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటకూడదు. (సోమసూత్రం దగ్గర ప్రమథ గణాలు కొలువై ఉంటాయి. అందువల్ల సోమసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదని నియమం).
చాలా కష్టాల్లో ఉన్నప్పుడు భక్తులు తమ ఇష్టదైవం కొలువైన ఆలయంలో అంగ ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకుంటారు. ఈ తరహా ప్రదక్షిణలు చాలా కష్టంతో కూడుకున్న పని. అంగ ప్రదక్షిణం చేయటానికి ఆగమాల ప్రామాణికాలు ఉన్నాయి. అంగ ప్రదక్షిణ చేయాలని అనుకున్న భక్తుడు భూమిపై పడుకుని, చేతులు జాపి నమస్కార ముద్ర ధరించాలి. కర్ర నేల మీద పడినట్టు ఉండాలి. అలాంటి భంగిమలో సిద్ధంగా ఉండి, స్వామికి నమస్కారం చేసి, నేల మీద పడుకుని ఉంటూనే కుడివైపునకు తిరుగుతూ (దొర్లుతూ) ప్రదక్షిణ చెయ్యాలి. దీన్నే అంగ ప్రదక్షిణ అంటారు. ఎక్కడ నుంచి ప్రారంభించామో తిరిగి అక్కడికి చేరుకోవటంతో ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. భక్తుడు తాను మొక్కుకున్న మొక్కును బట్టి అన్ని ప్రదక్షిణలు పూర్తి చెయ్యాలి. ఈ ప్రదక్షిణకు సంబంధించిన వివరాలు అజితాగమంలో ఉన్నాయి.
‘విశ్వమంతా తిరిగి శీఘ్రంగా ప్రదక్షిణ చేసి వచ్చిన వానికే గణాధిపత్యం’ అని పార్వతీపరమేశ్వరులు షరతు విధించినపుడు కుమారస్వామి మయూర వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరాడు. మూషిక వాహనుడైన మహాగణపతి అలా వెళ్లలేకపోయాడు. కానీ, తెలివిగా పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. దాని ఫలితమా అన్నట్టు… సుబ్రహ్మణ్యుడు వెళ్లిన ప్రతిచోటా అంతకుమునుపే గణపతి వచ్చి వెళ్లిన జాడలు కనిపించాయి. ముందుగా విశ్వాన్ని చుట్టి వచ్చినవాడు వినాయకుడేనని నిర్ణయించి- శివుడు, ఇతర దేవతలు అతనికే గణాధిపత్యాన్ని ఇచ్చారు. ప్రదక్షిణ చెయ్యటం వల్ల కలిగే సమున్నతమైన ఫలితానికి గజాననుడు పొందిన గణాధిపత్యమే నిదర్శనం.
ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు. జననం నుంచి మరణం వరకు జరిగే తంతులో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగించుకునేందుకు అవకాశం చిక్కుతుంది. అంతే కాదు… అత్యధిక ప్రదక్షిణలు చేయడం వల్ల రానున్న జన్మల చుట్లను (కర్మ ఫలితాలను) కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే
ప్రదక్షిణలో ప్రధానోద్దేశం.
వేదాంత పరంగా ఆలోచన చేస్తే ప్రదక్షిణ ప్రక్రియలో అద్భుతమైన అంతరార్థం ఉంది. ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మొదటి ప్రదక్షిణలో మనిషి తనలో ఉండే తమోగుణాన్ని త్యజించాలి. రెండో ప్రదక్షిణ చేసేటప్పడు రజోగుణాన్ని వదిలేయాలి. మూడో ప్రదక్షిణలో సత్త్వగుణాన్ని వదిలేయాలి. అంటే మొత్తంగా మూడు ప్రదక్షిణలు పూర్తయ్యే సరికి మనిషి త్రిగుణాలకు అతీతమైన స్థితికి చేరుకోవాలి. ఆవిధంగా త్రిగుణాతీతమైన స్థితికి చేరుకున్న తర్వాత ఆలయంలో ప్రవేశించి అక్కడ కొలువైన త్రిగుణాతీతుడైన దైవాన్ని దర్శించుకోవాలి. ప్రదక్షిణ వెనుక దాగున్న అసలైన అర్థం, పరమార్థం ఇది.
సాధారణంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చెయ్యటం అందరికీ అలవాటు. దీంతోపాటు మరికొన్ని ప్రత్యేక స్థానాలు, అక్కడ చేసే ప్రదక్షిణ ఫలితాలను కూడా అజితాగమం వంటి కొన్ని ఆగమాలు వివరంగా చెబుతున్నాయి. వీటి ప్రకారం అంతర్హారం (రెండవ ప్రాకారం)లో చేసే ప్రదక్షిణకు సాధారణ ప్రదక్షిణ కన్నా రెండు రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. మధ్యహారం (మూడవ ప్రాకారం)లో చేస్తే మూడు రెట్లు, మర్యాది (నాల్గవ ప్రాకారం)లో చేస్తే నాలుగు రెట్లు, మహామర్యాది (ఐదవ ప్రాకారం)లో చేస్తే ఐదురెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. గర్భగుడికి చుట్టూ ఉండే తొలి ప్రాకారంలో ప్రదక్షిణలు చెయ్యటానికి అందరికీ అధికారం లేదు. అర్చకులు, దీక్ష పొందిన వారికి (వీళ్లను దీక్షితులు అంటారు) మాత్రమే ఈ ప్రాకారంలో ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది. వీటితోపాటు క్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వంద రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ ఇందుకు ఉదాహరణ.
నిత్యం ఆలయంలో చేసే ప్రదక్షిణకు, ప్రత్యేక సందర్భాల్లో చేసే ప్రదక్షిణకు ఫలితాల్లో తేడా ఉంటుంది. అష్టమి, చతుర్దశి, పౌర్ణమి, ఆదివారంతో కలిసి వచ్చిన ఆరుద్ర నక్షత్రం, దక్షిణాయన, ఉత్తరాయణ ప్రారంభకాలాలు, సూర్య, చంద్ర గ్రహణ సమయాలు, ఉత్సవాలు మొదలైన సమయాల్లో చేసే ప్రదక్షిణలు ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి. ఈ సమయాల్లో ఆలయాల్లో ఉండే పుష్కరిణిలో స్నానం చేసి, ప్రదక్షిణలు చేస్తే సాధారణ రోజుల్లో చేసే ప్రదక్షిణల కన్నా వందరెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుందని ఆగమ శాస్ర్తాలు చెబుతున్నాయి.