పెద్ద హోదా, మంచి జీతం.. ఇంతే చాలనుకుంటారు. ఇక జీవితంలో స్థిరపడినట్టే అనుకుంటారు. కానీ ఆమెకు మాత్రం పరిధుల్లేవు, పరిమితులూ లేవు. రోజుకో సవాలు స్వీకరిస్తారు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటారు. కాబట్టే, సివిల్ ఇంజినీర్గా కెరీర్ మొదలుపెట్టి .. తెలంగాణ ఐటీశాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం డైరెక్టర్ స్థాయికి ఎదిగారు రమాదేవి లంక. ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే..
మెడిసిన్ చేయాలని నా కోరిక. కానీ ఇంజినీరింగ్లో అవకాశాలు ఎక్కువని మామయ్య ప్రోత్సహించడంతో పాలిటెక్నిక్లో చేరాను. తర్వాత, జేఎన్టీయూలో బీటెక్ చదివాను. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగం వచ్చింది. కొలువు చేస్తూనే ఎంటెక్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్) చదివాను. అంతలోనే, ప్రభుత్వ ఉద్యోగులు అయిదేండ్ల సర్వీస్ పూర్తిచేసుకుని ఉంటే.. సెలవుపెట్టి, కొంతకాలం వేరే ఉద్యోగం చేసుకోవచ్చని జీవో వచ్చింది. మా ఆయన కేంద్ర ప్రభుత్వ సంస్థలో వీఆర్ఎస్ తీసుకుని అమెరికా వెళ్లారు. నాకూ వెళ్లాలని ఉండేది. ఆఫీస్ అయ్యాక ఓ రెండు గంటలు కంప్యూటర్ శిక్షణ తీసుకుని.. ఆ నైపుణ్యంతో యూఎస్లో అవకాశాలు వెతుక్కున్నాను. అక్కడ చాలా స్టార్టప్స్లో పని చేశాను. కంపెనీ మారినప్పుడల్లా కొత్త కోర్సులు చేశాను.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి డిజిటల్ ఇండియా అవార్డు అందుకుంటున్న రమాదేవి
ఫస్ట్ ఇన్నొవేషన్
అయిదేండ్ల తర్వాత అమెరికా నుంచి వెనక్కి వచ్చేశాను. మా ఇంజినీర్-ఇన్-చీఫ్ నా ప్రతిభను గుర్తించారు. పబ్లిక్ హెల్త్ వర్క్స్తో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేయాలని ఆయన కోరిక. ఆ బాధ్యత నాకు అప్పగించారు. నీటి సరఫరాను పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలు గుర్తించడానికి, తక్షణం పరిష్కారాలు కనుగొనడానికి ఆన్లైన్ వాటర్ మానిటరింగ్ విధానాన్ని తీసుకొచ్చాను. మా ‘వాటర్ సైప్లె సిస్టం ఇన్ఫర్మేషన్’ ప్రాజెక్ట్ను కేంద్రం కూడా అభినందించింది. అదే రోజుల్లో ‘ఇ-ప్రొక్యూర్మెంట్’ విధానం మొదలైంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ను అందులో చేర్చే బాధ్యతనూ విజయవంతంగా పూర్తి చేశాను. రెండేండ్ల తర్వాత… సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లో ప్రాజెక్ట్ మేనేజర్గా పని చేయమన్నారు. ఇంటింటి సర్వేలో ఉపయోగపడే ‘ఇందిరమ్మ మానిటరింగ్ టూల్’ రూపొందించాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ (ఎన్ఐఎస్జీ)లో ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రభుత్వ శాఖల అవసరాలకు తగినట్టు ఐటీని ఎలా వాడుకోవాలో, ఏ సాఫ్ట్వేర్లు ఎంచుకోవాలో ప్రతి పాదనలు రూపొందించడం నా బాధ్యత.
ఎన్ఐఎస్జీలో.. ఐఐటీ, ఐఐఎంలో చదివిన వాళ్లు ఉండేవారు. నాకూ ఎంబీయే చేయాలని ఉండేది. నలభై ఏడేండ్ల వయసులో జీ మాట్ రాశాను. ఐఐఎం బెంగుళూరు క్యాంపస్లో సీటొచ్చింది. ఈ విషయం తెలిసి ‘రమా! ఎంబీయే తర్వాత నీకొచ్చే పొజిషన్ ఇప్పుడే ఇస్తా’ అన్నారు మా సీయీవో. అలా జనరల్ మేనేజర్ అయ్యాను.
తెలంగాణ కోసం
పదేండ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వ సర్వీస్లోకి రావాల్సి వచ్చింది. అప్పటికే తెలంగాణ అవతరించింది. ఆటోమేషన్లో ఎన్నో ప్రాజెక్టులు చేశాను. నేను నేర్చుకున్న టెక్నాలజీకి ఇక్కడేం పనుంటుందని బాధపడ్డాను. ఏడాది చూసి వీఆర్ఎస్ తీసుకుందామని భావించాను. కానీ నా అంచనా తలకిందులైంది. తెలంగాణ ప్రభుత్వానికి మీలాంటి వాళ్ల అవసరం చాలా ఉందంటూ ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ గారు ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి చూడమన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్కి డైరెక్టర్గా నియమించారు. ఇది అంత తేలికైన బాధ్యత కాదు. ప్రభుత్వ పాలన, సేవలను కంప్యూటర్ ద్వారా ప్రజలకు చేరువ చేయడంతో మా బాధ్యత పూర్తికాదు.. దాని భద్రత, భవిత గురించి కూడా ఆలోచించాలి. ఆ ప్రయత్నంలో బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్.. తదితర టెక్నాలజీలను విదేశాలు ఎలా ఉపయోగిస్తున్నాయో అధ్యయనం చేశాను. ఆ కృషి ఫలితంగానే ఇప్పుడు.. ల్యాండ్ రికార్డ్స్, సర్టిఫికెట్స్
ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయాన్ని టెక్నాలజీకి అనుసంధానించే ‘స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్’ ప్రాజెక్ట్కు భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా అవార్డ్స్ 2022లో ‘గోల్డ్ ఐకాన్’ ప్రదానం చేసింది.
యాభై రెండేండ్ల వయసులో..
మనమిప్పుడు హెల్త్ కేర్ రంగంలో కృత్రిమ మేధను వాడుతున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్ను వినియోగించుకునే విషయంలో ఓ ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేశాను. ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే.. యాభై రెండేండ్ల వయసులో ఐఐఎం కలకత్తా నుంచి ఎగ్జిక్యూటివ్ ఎంబీయే చదివాను. మా పనితీరును చూసి ‘కేంద్ర ప్రభుత్వం, రాష్ర్టాలు అంగుళం కూడా కదల్లేకపోతున్నాయి. కానీ, తెలంగాణ భలేగా చేస్తోంది’ అని కేంద్ర ఐటీ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. నేను ఎంతో కష్టపడుతున్నానని చాలామంది అనుకుంటారు. నిజానికి, నేను పనిని ఎంజాయ్ చేస్తున్నాను. జయేశ్ రంజన్ గారు, మంత్రి కేటీఆర్ గారు సమర్థతను గుర్తిస్తారు. పనిని గౌరవిస్తారు. మంచిని అభినందిస్తారు. సమర్థ నాయకత్వమే నా విజయానికి కారణం!
– నాగవర్ధన్ రాయల