లాక్డౌన్ రూపంలో తనకు దొరికిన సమయాన్ని విలక్షణంగా ఉపయోగించుకుంటున్నది రూర్కెలాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ సాహూ. చిన్నప్పటి నుంచీ తనకు ఇష్టమైన పట్టా చిత్రకళకు సానపడుతూ అందరి మన్ననలూ పొందుతున్నది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల ప్రాచీన కళ పేరే పట్టాచిత్ర. దీన్ని జానపద, ఇతిహాస కళగా చెప్పవచ్చు. వస్త్రమే క్యాన్వాస్గా పెయింటింగ్ చేయడమే దీని ప్రత్యేకత. ఈ కళను భాగ్యశ్రీ వస్త్రంపైనే కాకుండా రాళ్లు మొదలు ఆకులవరకు అన్నిటిపైనా ప్రదర్శిస్తున్నది. వాటిని ఫొటోలు తీసి, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నది. పెయింటింగ్స్లో ఎక్కువగా తనకు ఇష్టమైన జగన్నాథస్వామి చిత్రాలనే వేస్తున్నది. ఆ ఆర్ట్ పీస్లను అమ్మకానికి కూడా పెడుతున్నది. ఆసక్తి గలవాళ్లకు ఆన్లైన్ వర్క్షాపుల ద్వారా ఈ కళను నేర్పిస్తున్నది. జులైలో జరుగనున్న జగన్నాథ రథయాత్ర సందర్భంగా తనలాంటి భక్తులను ఆకట్టుకోవడానికి ప్రస్తుతం చాలావరకు ఆ వేడుకకు సంబంధించిన ఇతివృత్తాలనే ఎంచుకుంటున్నట్లు చెబుతున్నది. ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగ్యశ్రీ ప్రతిభను కొనియాడారు. “ఒడిశాకు చెందిన భాగ్యశ్రీ సాహూను ఉదాహరణకు తీసుకోవాలి. ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ కొన్ని నెలల క్రితమే పట్టాచిత్ర కళను నేర్చుకుని తక్కువ వ్యవధిలోనే అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోస్తున్నది” అని ఆయన మెచ్చుకున్నారు.