మహారాష్ట్రలో సింధుదుర్గ జిల్లా మడ అడవులకు ప్రసిద్ధి. మాండవీ నది అరేబియా సముద్రంలో కలిసే ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం కూడా అధికమే. దీంతో సింధుదుర్గను పర్యాటకుల స్వర్గధామంగా భావించారు ముంబైకి చెందిన రష్మీ సావంత్. పర్యటనలు, మహిళా సాధికారత అంటే ఇష్టం ఉన్న రష్మి 2013లోనే మహిళా సాధికారత దిశగా స్వయం సహాయక బృందాల ఏర్పాటును ప్రోత్సహించడానికి ‘కల్చర్ ఆంగన్’ అనే సంస్థను స్థాపించారు. అదే ఏడాది ఆమె సింధుదుర్గలో ‘మాంగ్రూవ్ ఎకో టూరిజం’ పేరుతో పర్యటన ప్రణాళికను రూపొందించారు. చివరికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) అధికారులను సంప్రదించి తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చారు.
అలా సింధుదుర్గ ప్రాంతంలో ‘మాండవి మాంగ్రూవ్ ఎకోటూరిజం’ పేరిట మహిళల ఆధ్వర్యంలో పడవ ప్రయాణాలను ఏర్పాటుచేశారు. అంతేకాదు పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడం, ఇండ్లలో పచ్చళ్లు, స్కాష్ల తయారీ లాంటివాటిలో శిక్షణ ఇప్పించారు. అలా స్థానిక మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అదనపు ఆదాయ మార్గాలను పరిచయం చేశారు. ఇక మహిళా నావికులు పర్యాటకులను బోట్లలో షికారుకు తీసుకెళ్లి ఆహ్లాదం కలిగించడంతోపాటు… మడ అడవుల ప్రాధాన్యాన్ని వివరిస్తారు. అక్కడి పక్షులు, జంతువుల గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతారు.
మడ అడవుల సందర్శనకు ఒక ట్రిప్కు ఒకరికి 200 రూపాయల రుసుము తీసుకుంటారు. ఈ పర్యావరణ పర్యాటకం నుంచి స్వయం సహాయక బృందాల మహిళలు ఏడాదికి రెండు లక్షల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు. వీరికి మహారాష్ట్ర అటవీ శాఖ అండ కూడా ఉండటం విశేషం. అలా తన చొరవ సింధుదుర్గ మహిళలను సాధికారత, ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడం తనకెంతో గర్వకారణం… అంటారు రష్మీ సావంత్. ఇక ‘కల్చర్ ఆంగన్’ ద్వారా కళలు, సంప్రదాయ వంటకాలకు మళ్లీ జీవం పోయడం లాంటివీ రష్మి నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రతోపాటు ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోనూ గ్రామీణ పర్యాటకం, ఇతర అభివృద్ధి కార్యకలాపాలకు ఊతం ఇస్తున్నారు.