బాల్య వివాహం ఆమె తెలివి తేటల్ని కట్టడి చేసింది. ‘పెండ్లి.. పిల్లలు.. డిగ్రీ ఫెయిల్… వయసుకు మించిన బాధ్యతలు.. ‘ఏమిటీ జీవితం?’ అనుకుంటున్న రోజుల్లో కాలేజీలో చదువుకొమ్మని భర్త సలహా ఇచ్చాడు. కాలేజీకి దారి చూపాడు. అలా మొదలైన ప్రయాణం ఎంత దూరం సాగిందో,ఎంతెత్తుకు ఎదిగిందో? చెబుతున్నది తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి. హేతువాద భావాలు, సాహిత్యాభిలాషతో కోటి ఆశలు పెంచుకున్న తెలివైన బాల్యానికి వివాహంతో కామా పడ్డట్టయింది. ఆ అగాధం నుంచి న్యాయ శిఖరాలకు సాగిన ఆమె ప్రయాణం నేటి మహిళకు స్ఫూర్తి పాఠం!
చిన్నప్పుడు బాగా చదివేదాన్ని. తెలివైన స్టూడెంట్నని డబుల్ ప్రమోషన్ ఇచ్చారు. రెండో తరగతి చదువలేదు. ఏడో తరగతి తర్వాత మెట్రిక్యులేషన్ చదివించారు. అలా పద్నాలుగేండ్లకే ఇంటర్ పూర్తిచేశాను.
మాది తెనాలి. అక్కడ మా ఇంటిమీద ‘ఎం.ఎన్.రాయ్ భవన్’ అని రాసి ఉంటుంది. మా నాన్న గురిజాల సీతారామయ్య. ఆయన ఎం.ఎన్.రాయ్ ప్రభావంలో ఉండేవారు. మా తమ్ముడికీ అదే పేరు పెట్టారు. నాన్న హేతువాది, మానవతావాది. అమ్మానాన్నలు పెద్దగా చదువుకోలేదు. అమ్మ రాజేశ్వరి గృహిణి. నాన్న చిన్న బడ్డీకొట్టు నుంచి వ్యాపారం మొదలుపెట్టి హోటల్ రంగంలో స్థిరపడ్డారు. నాకు అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మా చుట్టుపక్కల గ్రామాల్లో హేతువాద భావాల ప్రభావం ఉండేది. అప్పుడప్పుడు మా ఇంట్లోనూ హేతువాదులు సమావేశం అయ్యేవాళ్లు.
అభ్యుదయ మార్గంలో వెళ్తున్నాం అనుకునే వాళ్లు కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూనే పోవాలి. ఒకేసారి పూర్తి మార్పును ప్రదర్శించలేరు. కొన్ని విషయాల్లో సాధారణ ప్రజల్లాగే నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వెనుకబడిన కులంలో పుట్టిన అబ్బాయితో నాకు పెండ్లి చేయడమే మా ఇంట్లో ఒక విప్లవం. మంత్రాల పెండ్లికి నాన్న ఒప్పుకోలేదు. త్రిపురనేని రామస్వామి ప్రభావంతో తన పిల్లలకు దండల పెండ్లి చేస్తానని నిర్ణయం తీసుకున్నారు. మాకు దండల వివాహం (సివిల్ మ్యారేజ్) చేశారు. నాన్న నమ్మిన సిద్ధాంతాలు పాటించేవాడు. ‘బిడ్డల పెండ్లికి కట్నం ఇవ్వను,ఆడపిల్లలకు ఆస్తిలో భాగం ఇస్తాను’ అన్నాడు.అలాగే చేశాడు.
మా అమ్మ చేసిన ఒక మంచిపని ఏమిటంటే… ‘పెండ్లి తర్వాత మా అమ్మాయిని డిగ్రీ వరకు చదివించాలి. డిగ్రీ పూర్తయ్యే వరకు మా ఇంట్లోనే ఉంటుంది’ అని వివాహానికి ముందే కండిషన్ పెట్టింది. కాబట్టి చదువు ఆగలేదు. ఫైనల్ ఇయర్లో గర్భవతిని. ప్రాక్టికల్స్ మాత్రం రాయమని మా లెక్చరర్లు చెప్పారు. అలాగే చేశాను. చివరికి సప్లిమెంటరీలో డిగ్రీ పాస్ అయ్యాను.
ఏదో ఒకటి చదవాలని ఎల్.ఎల్.బి చేశాను. మా ఆయన చెరుకూరి లక్ష్మీ నరసింహ గాంధీకి ఏలూరు ఆర్టీవోగా ట్రాన్స్ఫర్ అయింది. అప్పటికే మాకు ఇద్దరు అమ్మాయిలు. చదువు మీద ఆసక్తి పోయింది. ఆయనకేమో నన్ను చదివించాలని ఉండేది. పట్టుబట్టి ఏలూరులో సీఆర్ఆర్ లా కాలేజీలో ఎల్.ఎల్.బిలో చేర్పించారు.
న్యాయవాదిగా నా కెరీర్ అనుకున్నంత సంతృప్తిగా ఏం సాగలేదు. కొన్ని కేసులు జాయింట్ కలెక్టర్ విచారించేవాళ్లు. మా ఆయన గ్రూప్ వన్ ఆఫీసర్. అధికారి భార్య కాబట్టి ఏమైనా ఇన్ఫ్లూయెన్స్ ఉంటుందేమోనని కొన్ని కేసులు ఇచ్చేవాళ్లు! అలాంటి కేసు గెలిచాను. అయితే, ఆ ఆనందం కాసేపు కూడా నిలబడలేదు. ‘ఆఁ.. ఆడపిల్ల కాబట్టి ఇచ్చేశారులే’ అని అపోజిట్ లాయర్ అన్నాడు. మా ప్రతిభతో కేసు గెలిచినా గుర్తించలేదు. వారన్న మాటలు నాకు అవమానంగా అనిపించాయి. ఎంత ప్రతిభ ఉన్నా.. మహిళను తక్కువగా చూడటం ఈ సమాజానికి అలవాటే కదా!
ప్రైవేట్ ప్రాక్టీస్లో రాణించాలంటే ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. న్యాయవాద కుటుంబంలోంచి వచ్చిన వాళ్లయి ఉంటే కేసులు ఇబ్బడిముబ్బడిగా వచ్చేవి. మామూలు లాయర్ అంటే చెట్టు కింద ప్లీడరే! నా మనస్తత్వానికి ఇది వర్కవుట్ కాదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) ఉద్యోగాల కోసం పరీక్ష రాశాను. ఎంపికయ్యాను. ఒకప్పుడు కోర్టుకుపోతే ఒకటో అరో కేసులు దొరికేవి. ఏపీపీ ఉద్యోగంలో రోజూ కేసులు వాదించాల్సి వచ్చేది. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేస్తున్నప్పుడు మీరు నోరు విప్పొద్దని కొంతమంది డబ్బు ఆశ చూపేవాళ్లు. నేను వాటికి దూరమని తెలిసి.. వెనక్కి తగ్గారు. ప్రలోభాలకు గురికాకుండా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం వల్ల మంచి గుర్తింపు, గౌరవం దక్కాయి. తర్వాత 2004లో జూనియర్ సివిల్ జడ్జిగా చేరాను. డిస్ట్రిక్ట్ జడ్జిగా 2008లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యాను. అక్కడినుంచి హైకోర్టుకు వచ్చాను.
శిక్ష విధించడం వల్ల నేరాలు తగ్గుతాయని అనుకోలేం. నేర స్వభావం కలిగిన వాళ్లు సమాజంలో స్వేచ్ఛగా సంచరిస్తే ఇబ్బందే! వాళ్లకు కారాగార శిక్ష విధించి, పరివర్తన తెచ్చిన తర్వాత సమాజంలోకి పంపాలని చట్టం చెబుతుంది. నేరస్తుడికి శిక్ష వేసినంత మాత్రాన వారిలో పరివర్తన వచ్చేస్తుందని చెప్పలేం. చట్టానికి దొరకని నేరస్తులు ఎందరో ఉన్నారు. మరి వారిని మార్చేదెవరు?
చిన్నప్పటి నుంచీ పుస్తకాలు చదవడం అలవాటు. మాలతీ చందూర్ వ్యాసాలు చదివాక.. ఆ పుస్తకాలను కొనేదాన్ని. చలం, రంగనాయకమ్మ, యండమూరి, మధుబాబు, మల్లాది వెంకటకృష్ణమూర్తి నవలలు చదివేదాన్ని. ఓల్గా రచన ‘స్వేచ్ఛ’, జపాన్ నవల ‘రైలు బడి’, మాలతీ చందూర్ ‘ఆలోచించు’, రంగనాయకమ్మ నవలలు ‘జానకి విముక్తి’, ‘స్వీట్హోమ్’ చాలా ఇష్టమైన పుస్తకాలు.
సినిమాల్లో కోర్టు సీన్లు వింతగా అనిపిస్తాయి. పాత్రలన్నీ పెద్దపెద్ద డైలాగులు చెప్పేస్తుంటాయి. వాస్తవానికి అలాంటి వాతావరణం ఏం ఉండదు. కేసు ఏమవుతుందోనని వారి తరఫు న్యాయవాదులు ముద్దాయిలను కిక్కురుమనకుండా ఉండాలని చెబుతారు. వాళ్లకు మౌనంగా ఉండే హక్కు ఉంటుంది. ఆ మౌనాన్ని ఏ రకంగా అన్వయించుకోవాలో మేం నిర్ణయించుకుంటాం.
లాయర్లకు యాక్సిడెంట్ ఎక్కడైతే అక్కడికి పోయి కేసులు తీసుకునే దుస్థితి ఉంటుంది. ఆడవాళ్లు అలా వెళ్లలేరు. మనదాకా వచ్చి కేసులు ఇవ్వాలంటే గుర్తించేంత స్థాయికి ఎదగాలి. కేసులు రాకుండాఎదిగే అవకాశం లేదు. అందుకనే ఈ ఫీల్డులో సీనియర్ లాయర్ల పిల్లలు, వారి బంధువుల పిల్లలకే అవకాశాలు త్వరగా లభిస్తాయి. కొత్తవాళ్లకు అంత సులభం కాదు. అవకాశం దొరికినా నిలదొక్కుకోవడం కష్టం.
ఊరి నుంచి వచ్చిన జూనియర్ లాయర్ను మనవాడని చేరదీసే సీనియర్ లాయర్ ఉంటేనే కెరీర్లో నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఏ కులం వాళ్లు ఆ కులం లాయర్ దగ్గరికి వెళ్తున్నారు. కులం, మతం, ప్రాంతం ఇవన్నీ అవకాశాలు కల్పిస్తాయి. మొదట్లో కేసులు అలాగే వస్తాయి. మంచి పేరు వచ్చాక క్లయింట్ల సంఖ్య పెరుగుతుంది. ఏదేమైనా ఫస్ట్ జనరేషన్ లాయర్లకు అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఈ వృత్తిలో రాణించాలంటే.. జూనియర్ సివిల్ జడ్జి (క్యాడర్ అపాయింట్మెంట్), పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి పోటీపరీక్షలు రాయడం మంచిది.
మా ఆయన పేరు గాంధీ. వాళ్ల నాన్న హిందీ టీచర్. మాకు ట్యూషన్ చెప్పారు. పెండ్లికి ముందు మా ఆయన డిగ్రీ చదువుతూ మాకు ట్యూషన్ చెప్పారు. తనకు ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో సీటు వచ్చింది. కాలేజ్ ఫీజు కట్టడానికి మా అమ్మ సాయం చేసింది. పీజీ తర్వాత ఆయన గ్రూప్ వన్ (ఆర్టీవో) అధికారిగా ఎంపికయ్యారు. తనకు పెండ్లి సంబంధాలు వస్తున్నాయి. అబ్బాయి గురించి కొందరు ఆడపిల్ల వాళ్లు మా అమ్మానాన్నల్ని వాకబు చేశారు. అప్పుడు అమ్మ ఆలోచించి ‘మనమ్మాయిని ఇస్తే బాగుంటుంది కదా!’ అని నాన్నతో అన్నారు. ఆయన గుణగణాలు తెలిసి నాన్న ‘సరే’ అన్నారు. అలా డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్షల తర్వాత మా పెండ్లయింది. అప్పటికి నా వయసు పదహారేండ్లు!
– నాగవర్ధన్ రాయల
– సి.ఎం. ప్రవీణ్