PM Modi : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర భారత్’ పథకంపై కాంగ్రెస్ పార్టీతోపాటు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. దేశ సంకల్పాన్ని కాంగ్రెస్ నేతలు తక్కువ చేస్తున్నారని మోదీ విమర్శించారు. గుజరాత్లోని సూరత్లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
ఏ దేశమైనా ఇతర దేశాల మీద ఆధారపడితే ఉన్నతస్థాయికి చేరుకోలేదనే విషయాన్ని ఈ నేతలు మర్చిపోయారని ప్రధాని అన్నారు. ‘‘ఎన్డీయే తెచ్చిన ‘ఆత్మనిర్భర భారత్’ కార్యక్రమాన్ని తప్పుబట్టేందుకు కొందరు వరుసగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. వాళ్లు నిరంతరం దేశాన్ని తక్కువ చేస్తున్నారు. వాళ్లు ఎప్పుడూ భారత దేశం ఇతర దేశాలపై ఆధారపడాలని కోరుకుంటారు. అలా ఆధారపడ్డ ఏ దేశమైనా అభివృద్ధిలో ఉన్నతస్థాయికి చేరుకోలేదనే విషయాన్ని మర్చిపోతున్నారు. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ను దూరంగాను ఉంచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు ఆ పాలనపై విసుగుచెందారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లోనే ఇటీవల స్థానిక ఎన్నికలు జరిగాయి.
అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పాలనను అక్కడి ప్రజలు తిరస్కరించారు. హరియాణా, పంజాబ్లో కూడా ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరలించారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు పని చేయడం లేదు” అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. కోవిడ్, చమురు ధరలు, యుద్ధాలు వంటి అనేక సంక్షోభాలు ఎదురైనా దేశంలోని 140 కోట్ల మంది పౌరుల సమష్టి కృషితో వాటిని అధిగమించామని ప్రధాని అన్నారు.