పేరు ఆయేషా. జగిత్యాల నివాసి. తల్లి షఫీనా గృహిణి. తండ్రి సయ్యద్ సలీం పండ్ల వ్యాపారి. ఆయేషాకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. కుడి కాలు సైతం సరిగా లేదు. పసితనంలో నేలమీద అంబాడలేక బోర్లాపడేది. పాప వైకల్యం చూసి కన్నవారు ఆవేదనకు గురయ్యేవారు. తోటి పిల్లలతో ఆడుకునే అదృష్టం తనకు లేదని తరచూ బాధపడేది ఆయేషా. వైకల్యం వల్ల బిడ్డను స్కూల్కు పంపకూడదని నిర్ణయించుకున్నారు తల్లిదండ్రులు.
తమ్ముడు పలకా బలపం పట్టుకుని వెళ్లడం చూసి, తనూ బడిలో చేరతానని మారాం చేసేది. ‘ఎలా రాస్తావు, పలకా బలపం ఎలా పట్టు కుంటావు?’ అని అడ్డుచెప్పేవారు అమ్మానాన్నలు. అయినా మంకుపట్టు వీడేది కాదు. దీంతో షఫీనా తాతయ్య ఫక్రొద్దీన్ ‘ఏం ఫర్వాలేదు.. పంపండి’ అని ధైర్యం చెప్పారు. అలా ఆ చిన్నారి బడిబాట పట్టింది. బలపాన్ని ఎడమ కాలి బొటన వేలు, ఆ పక్కనున్న వేలు మధ్యన పెట్టుకొని పలకపై అక్షరాలు దిద్దడం ప్రారంభించింది. ఆ అక్షరాలు ముత్యాలే. అంతే పట్టుదలతో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 90 శాతం మార్కులు సాధించింది. ఇంటర్లో ఆంగ ్ల మాధ్యమానికి మారినా 90 శాతానికి తగ్గలేదు. ఇంజినీరింగ్ చదవాలంటే.. జగిత్యాల వదిలి వెళ్లాలి. తన పరిమితుల కారణంగా అది అసాధ్యం కాబట్టి.. అక్కడే డిగ్రీలో చేరింది. బీఎస్సీ పట్టా అందుకుంది. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లిష్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అనిపించుకుంది. ప్రస్తుతం గ్రూప్- 2కు ప్రిపేర్ అవుతున్నది. మంచి ఉద్యోగం సాధించడమే తన తక్షణ లక్ష్యమని చెబుతున్నది ఆయేషా.
-కొత్తూరి మహేశ్