శ్రీలంక గాయని, రాపర్ యోహనీ ముంబై నగరంపై మనసు పారేసుకుంది. తక్షణం లంకను వదిలి ఇండియా రావాలనుకుంటున్నది. ఇటీవల ఓ బాలీవుడ్ చిత్రం కోసం ఆమె రీమిక్స్ చేసిన ‘మనికే మగే హితే’ పాట బాగా ట్రెండ్ అవుతున్నది. తన తదుపరి లక్ష్యం బాలీవుడ్ అని ప్రకటించింది యోహనీ.
‘నాకు ముంబై బాగా నచ్చింది. ఇప్పుడిప్పుడే హిందీ నేర్చుకుంటున్నా. కుటుంబంతో ఇక్కడే స్థిరపడాలని ఉంది. ఇలా బాలీవుడ్ చిత్రాలకు పాడతానని అస్సలు ఊహించలేదు. అంతా కలలా అనిపిస్తున్నది. బాల్యం నుంచీ హిందీ పాటలు వింటూ, అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగాను. నిజానికి, హిందీలో పాడటం అంత సులభం కాదు. కాబట్టే, భాష మీద పట్టుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నా. మనం రీక్రియేట్ చేసిన పాట అందరికీ నచ్చాలనేం లేదు. కొందరు విమర్శలు గుప్పిస్తుంటారు. కొందరు అభినందిస్తుంటారు. విమర్శలను స్వీకరిస్తూనే, రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఖండిస్తాను. అన్నట్టు, నేను ఏఆర్ రెహమాన్ వీరాభిమానిని. ఆయనతో కలిసి పాడాలనే కోరిక ఎప్పుడు తీరుతుందో!