ఆ ఆవరణ.. నాలుగు దశాబ్దాల కాలంలో యాభైఅయిదువేలమంది యువతులను పట్టభద్రులను చేసింది. జీవితంలోఎదిగి తీరాలనే పట్టుదలను పెంచింది. ఇక్కడి మైదానం పతకాల కార్ఖానా. ఇక్కడి లైబ్రరీ కొలువుల ఖజానా. పద్నాలుగు మందితో మొదలై.. పదిహేను వందలమందికి నీడనిచ్చే అక్షరాల అమ్మ చెట్టుగా ఎదిగింది కొత్తగూడెంలోని .. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల.
సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల.. బొగ్గు కార్మికుల కుటుంబాలకు సరస్వతీ కటాక్షం! నాలుగు దశాబ్దాలలో ఎంతో మందికి విద్యనిచ్చింది, ఉపాధి చూపింది, వికాస సూత్రాలు బోధించింది. 1975లో ప్రారంభమైన ఈ కాలేజీలో మొదట్లో కేవలం 14 మంది విద్యార్థినులే చేరారు. అప్పట్లో స్త్రీ విద్య పట్ల అవగాహనా తక్కువే. ఆ పరిమితిని అధిగమించడానికి సింగరేణి యాజమాన్యం తన వంతు కృషి చేసింది. హాస్టల్ వసతి కల్పించింది. అధునాతన సౌకర్యాలు సమకూర్చింది. దీంతో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు, ఆ ఆవరణలో దాదాపు పదిహేను వందల మంది వివిధ కోర్సులు చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అందుబాటులో ఉంది.
జీవితంలో ఎదగాలంటే.. పట్టా ఒక్కటే సరిపోదు. పోటీతత్వమూ అవసరమే. తమ విద్యార్థులు నియామక పరీక్షల్లోనూ ముందుండాలనే ఉద్దేశంతో సింగరేణి సంస్థ ఓ ప్రత్యేక గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసింది. లక్షల వ్యయంతో ప్రామాణిక పుస్తకాలను తెప్పించింది. ఇక్కడే హాస్టల్ సౌకర్యం ఉండటంతో ఆటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా సత్తా చాటుతున్నారు సింగరేణి సివంగులు. కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో అన్నివిధాలుగా అగ్రస్థానంలో నిలిచి మరో మైలురాయినీ అధిగమించారు.
ఈ ఆవరణలో చదివిన అనేకమంది విద్యార్థినులు ఉన్నతోద్యోగాలు సాధించుకున్నారు. అందులో ఓ పదమూడు మంది.. పాఠం విన్నచోటే పంతులమ్మలు అయ్యారు. ‘ఇక్కడే చదువుకున్నా. ఇక్కడే ఉద్యోగం వచ్చింది. ఇంగ్లిష్ లెక్చరర్గా పని చేస్తున్నా. చదువుకున్న కళాశాలలో ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నా. సింగరేణి కాలేజీ విద్యార్థులమని మేం గర్వంగా చెప్పుకొంటాం’ అంటారు ఇంగ్లిష్ లెక్చరర్ మంజుల. ‘కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నా. ఎన్సీసీ ఆఫీసర్గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. నేనే కాదు, నా విద్యార్థులు కూడా ఇక్కడ లెక్చరర్లుగా ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఇది నా కోరిక’ అంటూ కాలేజీ రోజులను నెమరేసుకొంటారు శ్రీలత. అటవీశాఖ డీఎఫ్వోగా సుమతి, కేయూ ప్రొఫెసర్గా ఉమామహేశ్వరి, హైకోర్టు అడ్వకేట్గా హేమలలిత, ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్గా సమోజ్వల, లైబ్రేరియన్గా మృదుల, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా పద్మ.. ఇలా ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థినుల జాబితా పెద్దదే. ఏటా జరిగే పూర్వ విద్యార్థినుల సమావేశాలకు అందరూ తప్పక హాజరవుతారు. కాలేజీ జీవితాన్ని గుర్తుచేసుకుంటారు. కమ్మని జ్ఞాపకాలను పంచుకుంటారు. చదువులు నేర్పే బడులు చాలానే ఉంటాయి, కానీ విలువలనూ వికాసాన్నీ రంగరించి బోధించే విద్యాసంస్థలు మాత్రం కొన్నే. సింగరేణి
గనుల్లో మట్టిలోంచి బొగ్గు మాత్రమే తీస్తారు. కానీ, సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో మట్టిలోంచి మాణిక్యాలను తీస్తారు!
42 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ కాలేజీలో ప్రిన్సి పల్గా పనిచేయడం నా అదృష్టం. ఇక్కడ చదువుకొన్నవారిలో చాలా మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 55 వేల మంది డిగ్రీ పట్టాలు అందుకున్నారు. కేయూ ఓవరాల్ చాంపియన్షిప్ను మా పిల్లలు సొంతం చేసుకున్నారు. గెలుపు పతకాలతో మా కాలేజీ అరలు నిండిపోయాయి.
శారద, ప్రిన్సిపల్
సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల
కాగితపు వెంకటేశ్వరరావు