రాజుగారి పరివారంలోని చాలామంది లేని రాజసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కోటకు కావలి ఉన్న శునకం మొదలుకొని తురగం వరకు ఏదీ తక్కువ కాదు! చొరవ తీసుకొని వాటిని టచ్ చేశామా.. గర్వం సర్వం ఖర్వం కాక తప్పదు. ఇలాంటి సన్నివేశమే లండన్లో చోటుచేసుకుంది. ఓ పర్యాటకురాలి అత్యుత్సాహం గుర్రాన్ని గుర్రుమనేలా చేసింది. యునైటెడ్ కింగ్డమ్ రాజప్రాసాదం చుట్టూ చాలామంది సైనికులు పహారా కాస్తుంటారు. అక్కడక్కడా సిపాయిలు అశ్వాలు అధిరోహించి నిగ్రహంతో విగ్రహాల్లా నిల్చుండి కాపు కాస్తుంటారు.
వెస్ట్మిన్స్టర్ ప్యాలెస్ దగ్గరా ఈ తరహా సైనికులు బారులు తీరి ఉంటారు. అటుగా వచ్చిన ప్రజలు, పర్యాటకులు అశ్వాలను చూసి ముచ్చటపడుతుంటారు. వాటి సమీపంగా నిలబడి ఫొటోలు దిగుతుంటారు! చనువు ఇచ్చింది కదా అని చెయ్యేస్తే మాత్రం కింగ్ హార్స్లు హార్ష్గా ప్రవర్తిస్తాయి. ఫొటో దిగేలోపే.. పారపళ్లతో పర్యాటకుల చేతివేళ్లనో, తలనో నోటకరిచే ప్రయత్నం చేస్తాయి. ఒక్కోసారి కుమ్మేస్తుంటాయి. తాజాగా ఓ పెద్దావిడ వెస్ట్మిన్స్టర్ ప్యాలెస్ పర్యటనకు వచ్చింది. ముచ్చటగా నిల్చున్న గుర్రాన్ని సమీపించింది. నవ్వుతూ ఫొటోకు పోజిచ్చింది. చొరవకొద్దీ దాన్ని చేతితో నిమిరింది. రాజుగారి గుర్రానికి చిర్రెత్తింది. ‘గుర్ర్ర్.్ర.’ అంటూ చటుక్కున ఆ పెద్దామెను కుమ్మేసింది. ఆమె కిందపడ్డంత పనైంది. ఇంకేముంది ఆ సన్నివేశం సోషల్ మీడియాలో లైకులు కుమ్మేస్తున్నది. ‘గుర్రాలను తాకరాదు’ అన్న హెచ్చరికలు మరిచి హెచ్చులకు పోయిన నారీమణి.. సామాజిక మాధ్యమాల్లో తురగ వేగంతో వైరల్ అయింది.