Shobha Rani | ఆడకూతురు పొదుపు పాఠాలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పని లేదు. కష్టనష్టాలు ఎదుర్కొన్న మహిళకు ఆదాయ, వ్యయాలపై ఆర్థికమంత్రికి ఉన్నంత పట్టు ఉంటుంది. దీనికి విద్యాబుద్ధులు తోడైతే.. ఆ ఇంతి నడిచిన దారి వెంట లచ్చిందేవి కదిలి వస్తుంది. ధైర్యం కూడా జతకలిస్తే.. అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన ఉప్పునూతల శోభారాణి జీవితంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. ఆర్థిక సమస్యలతో ఆస్తులు అమ్ముకున్న ఆమె.. ఇప్పుడు ఆర్థికాంశాలపై అనర్గళంగా మాట్లాడుతున్నది. పలు రాష్ట్రాలు పర్యటించి మహిళలకు పొదుపు మంత్రం ఉపదేశిస్తున్నది. ఐఏఎస్ అధికారులకూ క్షేత్రస్థాయి స్థితిగతులపై అవగాహన కల్పిస్తున్నది. అంచెలంచెలుగా ఎదిగి స్త్రీ శక్తిని చాటిచెబుతున్న శోభారాణి విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే..
మాది పూర్తిగా పేద కుటుంబం. గూడురులో నాన్నకు చిన్న కిరాణా దుకాణం ఉండేది. ఆర్థికంగా ఎప్పుడూ సమస్యలే. నేను ఎనిమిదో తరగతిలో ఉండగా బొల్లెపల్లి గ్రామానికి చెందిన వెంకన్నతో పెండ్లి చేశారు. మా ఆయన పదో తరగతి వరకు చదువుకున్నాడు. నన్నూ పది వరకు చదివించాడు. నాకు ఇంకా చదవాలనే కోరిక ఉన్నా.. పరిస్థితులు అందుకు సహకరించలేదు. మా ఆయనకు సైకిల్ రిపేర్ షాప్ ఉండేది. అది సరిగ్గా నడవక.. కుటుంబం గడవడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇల్లు, బంగారం అన్నీ అమ్మి అప్పులు తీర్చేశాం. బతుకుదెరువు కోసం సొంత ఊరు వదిలి వరంగల్ సమీపంలోని జాన్పాకకు వలస వచ్చాం. అక్కడ పత్తి జిన్నింగ్ మిల్లులో మా ఆయన హమాలి పనికి కుదిరాడు. ఊరు మారినా మా రాత మారలేదు. అవే ఆర్థిక సమస్యలు. అవే అప్పులు. పైగా మా అబ్బాయి ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. బంధువులు చులకనగా చూసేవారు. ఏ ఫంక్షన్లకూ పిలిచేవారు కాదు. ఆ సమయంలోనే డ్వాక్రా సంఘాల గురించి నాకు తెలిసింది. మా ఇంటి సమీపంలో నాలుగు సంఘాలు నడుస్తున్నాయి. నేనూ ఒకదాంట్లో చేరాను. సంఘంలో అప్పుగా రూ.20వేలు తీసుకొని ఆటో కొన్నాం. కొన్నాళ్లకు మా జీవితంలో మార్పు మొదలైంది. నా చదువూ మళ్లీ మొదలైంది. కాకతీయ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాను.
స్వయం సహాయక సంఘాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండేదాన్ని. నా పని, మాటతీరు గమనించిన అధికారులు ఎంతో ప్రోత్సహించారు. 2012లో ముస్సోరిలో ఐఏఎస్ల శిక్షణ కేంద్రంలో మాట్లాడే అవకాశం కల్పించారు. ‘పేదరికం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వాటిని ఎదుర్కోవడానికి మహిళగా చేసిన ప్రయత్నాలు, స్వయం సహాయక సంఘాల పనితీరు’ గురించి మాట్లాడాలని చెప్పారు. ఐఏఎస్ శిక్షణలో ఉన్న 185 మంది ముందు మాట్లాడాలి. మొదట ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన ఇద్దరు ముస్లిం మహిళలు మాట్లాడారు. నాకు అవకాశం ఇచ్చిన అధికారులు నేనేం మాట్లాడుతానో అని కంగారుపడ్డారు. మొదట రెండు నిమిషాలు మాట్లాడమన్నారు. కానీ, నేను మొదలుపెట్టాక 45 నిమిషాలు మాట్లాడుతూనే ఉన్నాను. గ్రామీణాభివృద్ధి, మహిళల సాధికారత, స్వయం సహాయక బృందాల నిర్వహణలో మహిళలు సాధించిన విజయాలు.. ఇలా చాలా విషయాలు వాళ్లతో పంచుకున్నా. ప్రసంగం పూర్తయిన తర్వాత అధికారులు, శిక్షణలో ఉన్న ఐఏఎస్లు కరతాళ ధ్వనులతో అభినందించారు. ఆరోజు నేను పొందిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాను. తెలంగాణలో శిక్షణకు వచ్చే ఐఏఎస్ అభ్యర్థులకు రెండు రోజుల సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)లో శిక్షణ ఇచ్చారు. పేదరిక నిర్మూలనపై నా అభిప్రాయాలను వారితో పంచుకున్నాను.
జాతీయ గ్రామీణ అభివృద్ధి (ఎన్ఐఆర్డీ) ద్వారా నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 20 రాష్ర్టాల్లో పర్యటించాను. అక్కడి వారికి శిక్షణ ఇచ్చాను. మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన కార్యక్రమాల్లో భాగంగా 16 రాష్ట్రాలు తిరిగాను. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇలా ఎన్నో రాష్ర్టాలకు పలుమార్లు వెళ్లాను. డ్వాక్రా సంఘాల స్థాపన, వాటి ఆవశ్యకత, నిర్వహణ, రుణాలు పొందే విధానం, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చాను. విదేశీ ప్రతినిధులు ఎవరైనా వచ్చినప్పుడు ట్రాన్స్లేటర్గా వ్యవహరించాను. కేంద్ర మంత్రుల పర్యటనలోనూ మహిళా సంఘాల పనితీరును వివరించాను. ఎన్ఐఆర్డీలో సర్పంచులకు, వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చాను. మన రాష్ర్టానికి వచ్చే సీసీలు, ఏపీఎంలు, డీపీఎంలు, సీఈఓ స్థాయి శిక్షణలోనూ పలు అంశాలను వారికి వివరించాను.
శిక్షకురాలిగా సేవలు అందించాలని చాలా ప్రైవేట్ సంస్థలు అడుగుతున్నాయి. అటువైపు వెళ్తే ఆదాయం పెరుగుతుండొచ్చు. కానీ, నాకు మొదట అవకాశం కల్పించి, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన సెర్ప్, ఎన్ఐఆర్డీతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్లోనూ సమాజ సేవ చేయాలనేది నా కోరిక. మహిళలకు ప్రోత్సాహం కల్పించాలనే ఆశయంతో పనిచేస్తున్నా. ఎవరైనా సాయం చేస్తే వృద్ధాశ్రమం నిర్వహించాలని భావిస్తున్నా.
మా ఆయన వెంకన్న రెండు ట్రాలీ ఆటోలు కొన్నాడు. ఆదాయం ఫర్వాలేదు. మాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ జేఎన్టీయూ హైదరాబాద్లో ఇంజినీరింగ్ చేస్తున్నారు. మా ఊళ్లో రెండు ఎకరాల భూమి కొన్నాం. సొంత ఇల్లు కట్టుకున్నాం. మధ్య తరగతి కుటుంబ స్థాయికి చేరుకున్నాం. ఇందుకు ప్రధాన కారణం మా ఆయనే. మహిళ గడపదాటితే బయటి వ్యక్తులు ఇంట్లోవాళ్లకు లేనిపోని మాటలు చెబుతూ ఉంటారు. అవేవి పట్టించుకోకుండా మా ఆయన, అత్తామామ నా వెన్నుతట్టారు. చదువుకొమ్మని ప్రోత్సహించారు. మా నాన్న పెంపకమే నా ధైర్యానికి కారణం. ఒకప్పుడు నన్ను, నా కుటుంబాన్ని చూసి నవ్వినవారు, అవహేళన చేసినవారు ఇప్పుడు ఎంతో గౌరవిస్తున్నారు.
చిన్నప్పుడు మా కిరాణా దుకాణానికి లంబాడీలు ఎక్కువగా వచ్చేవారు. వారితో మాట్లాడటంతో ఆ భాషపై పట్టు దొరికింది. సంఘంలో చేరాక హిందీ, మరాఠీ భాషలు నేర్చుకున్నా. పలు భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో ఎక్కడికి వెళ్లినా అనర్గళంగా మాట్లాడగలను. మొదటిసారి 2007లో బిహార్లో గయా జిల్లాలో డ్వాక్రా సంఘాలపై శిక్షణ ఇచ్చాను. అదే ఏడాది కమ్యూనిటి రిసోర్స్పర్సన్ (సీఆర్పీ)గా ఎంపికయ్యాను.
…?నెలకుర్తి శ్రీనివాస్రెడ్డి
ఒక్క ఏడాదిలోనే 200 కోట్లు సంపాదించిన 8 ఏండ్ల చిన్నారి”
నాసాలో జాబ్ వదిలేసి.. రైతుల కోసం కష్టపడుతున్నడు”
“Bhavana Lasya | ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు, వీడియోల ద్వారా యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది”
అమెరికాలో జాబ్ వదిలేసొచ్చి.. సొంతూళ్లో లైబ్రరీ స్టార్ట్ చేసిండు”