అందరూ రచనలు చేయడం వేరు. అమ్మ రాయడం వేరు. అమ్మ రాతలో అభిమానం తొంగిచూస్తుంది. అనునయం హత్తుకుంటుంది. ఆవేశమూ అంతే రీతిలో హెచ్చరిస్తుంది. పడిశం పట్టిన సమాజానికి అమ్మ రాత మిరియాల చారు. చక్కటి అనుబంధాలను ఆవిష్కరించేటప్పుడు కమ్మటి పాలబువ్వ. మధురమైన ముచ్చట్లు పంచుకునేటప్పుడు అది తియ్యటి తేనెధార. సమాజం మీద ఆమె రచనల సంతకం పదికాలాలూ పదిలంగా నిలిచి ఉంటుంది. అలా అరవై ఏండ్లుగా రచనా వ్యాసంగాలను నిర్వహిస్తున్న అమ్మల కలాలకు షష్టిపూర్తి మహోత్సవం జరుగుతున్నది. ఆ మహత్తర క్రతువుకు తెలుగు విశ్వవిద్యాలయం వేదిక అవుతున్నది. రెండేండ్లుగా ‘మాతృవందనం’ పేరిట అలరిస్తున్న ఈ కార్యక్రమం.. ఈ నెల 30న మరోసారి జరగనుంది.
సాహితీ సదస్సులు చాలానే జరుగుతుంటాయి. ఉగాది కవి సమ్మేళనాలు ఏటా వినిపిస్తాయి. అయితే అందులో మహిళల ప్రాతినిధ్యం మాత్రం ‘మమ’ అన్నట్టుగానే ఉంటుంది. అక్కడనే కాదు సాహిత్య వేదికలన్నిటా ఇదే పరిస్థితి. అందుకే, ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ రచయితల వేదికను ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా… అన్న ఆలోచన ‘అక్షరయాన్’ పుట్టుకకు కారణమైంది. తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్గా అయిదేండ్ల క్రితం అవతరించిన ఈ సంస్థలో తెలుగు భాష పట్ల అభిమానం ఉన్న పదిహేను వందల మందికిపైగా రచయిత్రులు ఉన్నారు.
రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు రచయిత్రులు ఇందులో భాగమయ్యారు. వీళ్లందరి అక్షరాలకూ కలంలా సహకారం అందిస్తున్నారు ‘అక్షరయాన్’ వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మి. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని చిత్రవాణి విభాగానికి డిప్యూటీ డైరెక్టర్ హోదాలో సేవలు అందిస్తున్నారామె. అక్షరయాన్ ద్వారా శ్రీలక్ష్మి ప్రారంభించిన మాతృవందనం కార్యక్రమం… తెలుగు విశ్వవిద్యాలయం కూడికతో ఆకాశమెత్తుకు ఎదిగింది. రచనా వ్యాసంగం మొదలుపెట్టి అరవై ఏండ్లు దాటిన సాహితీమూర్తులను సత్కరించే ఈ వేడుక… వణికే చేతులతో మళ్లీ వడివడిగా అక్షరాలు రాయిస్తున్నది.
అక్షరయాన్ ఆన్లైన్ వేదికగా మహిళలంతా కలిసి తమ కవితలు, కథల్ని పంచుకోవడమే కాదు… గొప్ప రచయితల్ని సత్కరించే కార్యక్రమాలూ నిర్వహించేవారు. అందులో భాగంగా ఒకసారి ఒక పెద్ద వయసు రచయిత్రికి జరిగిన సన్మాన సభకు, మనుమలతో పాటు మునిమనుమలు కూడా వచ్చారు. ‘బామ్మా… నువ్వింత గ్రేటా… నీకింతమంది ఫ్యాన్స్ ఉన్నారా?!’ అని వాళ్లంతా అంటుంటే, ఆ పెద్దావిడ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఆమె కండ్లలోని కాంతుల్ని అక్షరయాన్ నిర్వాహకులంతా గమనించారు. ‘ఇలా పెద్దవాళ్లను సత్కరించేలా ‘మాతృ వందనం’ పేరిట ఒక కార్యక్రమాన్ని పెట్టుకుందామా..’ అన్న అధ్యక్షురాలి ప్రతిపాదనకు అక్కడి వాళ్లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పెద్ద వయసు రచయిత్రుల్ని ఇండ్లకు వెళ్లి సత్కరించుకున్నారు. అలా ఒక ఏడాది అక్షరయాన్ తరఫున జరిగిన కార్యక్రమం గురించి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి తంగెడ కిషన్రావుతో పంచుకున్నారు శ్రీలక్ష్మి. ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించుకునే సంప్రదాయం తెలుగు విశ్వవిద్యాలయానికి ఉండటంతో, ఈ కార్యక్రమాన్ని మాత్రం ఎందుకు చేయకూడదు అని ఉత్సాహం చూపారాయన.
అలా 2022లో తెలుగు విశ్వవిద్యాలయం తరపున ‘మదర్స్ డే’ నాడు 31 మంది వయోధిక రచయిత్రులకు ‘మాతృవందనం’ సత్కారం అట్టహాసంగా జరిగింది. అప్పుడు 92 ఏండ్ల రచయిత్రి వాసిరెడ్డి కాశీరత్నం… ఇక్కడి వేదిక మీద వెలిగారు.
చిరపరిచితులైన ఒకనాటి రచయిత్రులు వస్తున్నారంటే తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియం కిటకిటలాడింది. వాళ్లను చూసేందుకు, వాళ్ల మాటలు వినేందుకు చాలా మంది ఉత్సాహం చూపారు. తాము ఇంకా జనానికి గుర్తున్నామా అన్న సంభ్రమం అక్కడి రచయిత్రుల్లో కనిపించింది. కుటుంబాలలో అయితే వాళ్లకు సెలెబ్రిటీ హోదా వచ్చింది. ఈ ఉత్సాహం మరుసటేడాదీ మాతృవందనం దిశగా అడుగులు వేయించింది. మరో 32 మంది పెద్దవాళ్లను సాదరంగా సత్కరించుకున్నారు.
రెండోసారి ఓ మెట్టు పైనే. 93 ఏండ్ల శాంతమ్మ… సభకు వచ్చారు. ఇక, ఈ ఏడాది మరో 43 మంది చిరపరిచితులు, చిరకాలంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న వాళ్లను గుర్తించి, జాబితా తయారుచేసింది అక్షరయాన్. ప్రతి జిల్లా, రాష్ట్రంలో ఉండే సభ్యులే తమతమ ప్రాంతాల వారి వివరాలు ఇచ్చి, ఈ జాబితా సిద్ధం చేసేందుకు సహకరిస్తున్నారు. మాతృవందనంలోని వందమందినీ సత్కరించడం ఈ సంవత్సరం పూర్తవుతుంది. అంతేకాదు, ఈసారి వందేండ్ల రచయిత్రి తెన్నేటి మాణిక్యాంబ… ఈ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఈ ఏడాది.. బీనాదేవి, ఓల్గా, సత్యవాణి, కేతవరపు శోభారావు, ముదిగొండ సీతారావమ్మ, ఆకెళ్ల విశాలాక్షి… ఇలా సాహితీ ప్రముఖులెందరో తెలుగు సత్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ అతిథులందరినీ పూల జల్లులతో వేదిక మీదికి ఆహ్వానిస్తుంది తెలుగు విశ్వవిద్యాలయం. సారె కార్యక్రమాన్నీ నిర్వహిస్తారు. అంటే చీర, జాకెట్తో పాటు పండ్ల బుట్ట, మొక్క, శాలువాలాంటివి రచయిత్రులకు బహూకరిస్తారు. తర్వాత వాళ్ల రచనల గురించి ప్రసంగం, రచయిత్రుల ప్రసంగం రెండూ ఉంటాయి. కార్యక్రమం పూర్తయ్యాక, పలు దఫాలుగా వీళ్లందరి ఇంటర్వ్యూలనూ, వాళ్ల రచనలకు సంబంధించిన విశేషాలను ఒక గంట నిడివితో వీడియో రూపంలో తీసుకువస్తుంది విశ్వవిద్యాలయం. చాలు… రచయిత మస్తిష్కంలో మరుగున పడి ఉన్న ఆలోచనలెన్నో మళ్లీ అక్షరాల చొక్కా తొడుక్కోవడానికి… అందంగా ముస్తాబై అప్పటి సంగతులను మన ముందుకు మోసుకురావడానికి!
అక్షరయాన్ అంటే, అఆలు. అ…అంటే అవకాశం. ఆ అంటే ఆత్మైస్థెర్యం. మా సంస్థ ద్వారా రచయిత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించేలా రకరకాల వేదికల మీద మాట్లాడే అవకాశాలు కల్పిస్తాం. తెలుగు అక్షరాలను కంప్యూటర్లో టైప్ చేయగలిగేలా డీటీపీ నేర్పిస్తాం. ఎప్పటికప్పుడు ఒక్కో సామాజిక అంశాన్ని ఎంచుకుంటూ దాని మీద కవితలు రాస్తూ పుస్తకాలు వేస్తుంటాం. అందరం కలిసి విహారయాత్రలకూ వెళ్తుంటాం. ఇవన్నీ ఒక ఎత్తయితే, సంస్థ నిర్వహిస్తున్న మాతృవందనం కార్యక్రమం ఒక్కటీ ఒక ఎత్తు. మాది నిజామాబాద్ జిల్లా, బోధన్. నేను మా నాయనమ్మ దగ్గర పెరిగాను. తాను ఓ ధీరోదాత్త నాయకురాలు. నన్ను ఎంతో గారాబం చేసేది. ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉండాలో కూడా నేర్పించేది. ఆమె స్ఫూర్తితోనే నేనీ స్థాయిలో ఉన్నా. అందుకే పెద్దవాళ్లందరిలో ఆమెను చూసుకుంటా. ‘మాతృవందనం’ నాకు ఎంతో సంతృప్తినిస్తుంది.
అయితే, దీనికి ఒక గుర్తింపును, హోదాను తీసుకువచ్చింది మాత్రం తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి తంగెడ కిషన్రావుగారే. సమున్నత లక్ష్యంతో ఈ క్రతువు నిర్వహిస్తున్న కర్తగా ఆయన్ను చెబుతాను. ఆ పని అంతా చక్కగా చూసుకుంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్గారు కార్యక్రమ కర్మగా వ్యవహరిస్తు న్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణగారు ఆర్థిక దన్నునిచ్చి క్రియగా నిలిచారు. కొన్ని ప్రత్యేక కారణాలతో ఈ ఏడాది సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాణి నల్లమోతు సమర్పణలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అప్పుడూ ఇప్పుడూ కార్యక్రమం నిర్వహణ బాధ్యత అంతా అక్షరయాన్ చూసుకుంటుంది. నేటి తరానికి, నాటి తరానికీ మధ్య వారధిగా నిలవడం నిజంగా సంతోషంగా ఉంది.
– అయినంపూడి శ్రీలక్ష్మి
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి
– వీరగోని రజనీకాంత్ గౌడ్