నేను పీజీ చదువుతున్నా. ఇప్పటివరకు నా వ్యక్తిగత చిత్రాలను ఎవరికీ షేర్ చేయలేదు. అయినాసరే, టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లోని కొన్ని గ్రూపుల్లో నా ఫొటోలు తిరుగుతున్నాయని తెలిసింది. మా కాలేజీలో కొంతమంది అబ్బాయిలు నన్ను చూసి హేళన చేస్తున్నారు. ఈ విషయం ఇంట్లోవాళ్లకు తెలియకుండా, చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? నా కారణంగా అమ్మానాన్న సిగ్గుతో తల దించుకోవడం నాకు అసలు ఇష్టం లేదు.
–ఓ సోదరి
జ: పోలీసు శాఖ సైబర్ సెల్కి వెళ్లి ఫిర్యాదు చేయండి. ఒక వ్యక్తికి తెలియకుండా వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు ఆన్లైన్లో విడుదల చేయడం సైబర్ క్రైమ్ సెక్షన్ 66ఎఫ్, 67బి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ ఇండీసెంట్ రిప్రెజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్) కింద శిక్షార్హమైన నేరం. మీరు ధైర్యంగా ఫిర్యాదు ఇవ్వవచ్చు. బాగా నమ్మే స్నేహితురాలు, మేనత్త, మేనమామ, తోబుట్టువు, కాలేజీ లెక్చరర్లలో ఎవరో ఒకరి సాయం తీసుకోవడంలో తప్పులేదు. దీనివల్ల మానసిక ధైర్యం వస్తుంది. తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన తప్పేమీ చేయలేదు మీరు. ఆ ఆకతాయిల ఆట కట్టించండి.
మానసి చౌదరి అడ్వకేట్
www.pinklegal.in