దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయాలని పెద్దలు చెబుతారు. దీనినే అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. ఎనిమిది అంగాలూ నేలను తాకేవిధంగా పూర్తిగా పడుకొని నమస్కరిస్తారు.
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం
కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామోష్టాంగ ఈరితః
ఉరసా-తొడలు, శిరసా- తల, దృష్ట్యా- కండ్లు, మనసా- హృదయం, వచసా- నోరు, పద్భ్యాం- పాదాలు, కరాభ్యాం- చేతులు, కర్ణాభ్యాం- చెవులు.. ఇలా ఎనిమిది అంగాలతో నమస్కారం చేయాలి. సహజంగా మనిషి ఈ ఎనిమిది అంగాలతోనే దోషాలు చేస్తుంటాడు. ఆ పాపాలను తొలగించమని, సద్బుద్ధిని ప్రసాదించమని వేడుకుంటూ నమస్కారం చేయాలని శాస్త్ర వచనం. దేవాలయంలో బోర్లాపడుకొని పైశ్లోకం చదువుతూ నమస్కరించాలి. అయితే దేవాలయాల్లో సాష్టాంగ నమస్కారం దేవుడికి, ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా, ధ్వజస్తంభం వెనుక నుంచి చేయాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మహిళలు పంచాంగ నమస్కారం చేయాలని శాస్త్ర నియమం. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలి.