ఏదైనా రెస్టారెంట్కు వెళ్తే.. ప్రధానంగా అక్కడున్న ఫర్నిచర్ ఆకట్టుకుంటుంది. గోడలకు వేలాడదీసిన పెయింటింగ్స్ మనసును దోచేస్తాయి. ఆ డెకొరేషన్, డైనింగ్ టేబుల్, కుర్చీలు, సోఫాలు, వడ్డించే పాత్రలు.. ప్రతీది అద్భుతంగానే అనిపిస్తుంది. అమ్మితే కనుక ఆ ఫర్నిచర్ను తక్షణం కొనేయాలనే ఆలోచన వస్తుంది. అయితే, మీరు కనుక బంజారాహిల్స్లోని రోడ్నంబర్ 36లో ఉన్న వోయిలా రెస్టారెంట్కు వెళ్తే.. ఎలాంటి అనుమానాలూ పెట్టుకోకుండా బడ్జెట్ను బట్టి, నచ్చిన ఫర్నిచర్ను కొనవచ్చు. అక్కడ సకలం అమ్మకానికి ఉంటాయి. రెస్టారెంట్లోకి అడుగుపెట్టగానే రోమన్ డిజైనింగ్ అడుగడుగునా కట్టిపడేస్తుంది. డైనింగ్ టేబుల్స్ నుంచి ప్లేట్లు, చెంచాల వరకూ ప్రతి వస్తువుకూ ఓ ప్రత్యేకత ఉంది. డబ్బు చెల్లించి వాటిని కొనుక్కోవచ్చు. ఫర్నిచర్ ధర రూ.30వేల నుంచి ప్రారంభం అవుతుంది. తిన్నందుకు కొంత, కొన్నందుకు కొంత.. బిల్లు తడిసి మోపెడు కావడం మాత్రం ఖాయం!