Inspiration | రశ్మి శుక్లా మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలో విస్తీర్ణంలో మూడో అతిపెద్ద రాష్ర్టానికి సూపర్కాప్గా నియమితులైన తొలి మహిళగా రికార్డు సాధించారు. 1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన రశ్మి 2024 జూన్లో పదవీ విరమణ చేస్తారు. అయితే, ఆమె పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఇంతకుముందు రశ్మి పుణె పోలీస్ కమిషనర్, మహారాష్ట్ర ట్రాఫిక్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్, నాగపూర్ ఎస్పీ, సోలాపూర్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.
హైదరాబాద్లో సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్కు అదనపు డైరెక్టర్ జనరల్గా, సశస్త్ర సీమా బల్కు డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. కొత్త బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “మహారాష్ట్రలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయి. మహిళల భద్రత, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నియంత్రణ మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తాను” అని రశ్మి పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడం మీద పోలీసులు మరింత దృష్టి సారించాల్సి ఉందన్నారు. తాను డీజీపీగా ఉన్న సమయంలో ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వనని హామీ ఇస్తున్నారు రశ్మి.