రక్షా బంధన్.. ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. అందరికీ పౌర్ణమినాడే రాఖీల పండుగ, తయారీదారులకుమాత్రం ఆరు నెలల ముందు నుంచే సందడి మొదలవుతుంది. పెద్దపల్లిలో అయితే అదో జాతరే.
వన్నెల దారాలు, తీరొక్క ముత్యాలు, కుందన్లు, రుద్రాక్షలు, తులసి పూసలు, రంగు రాళ్లు రాఖీ తయారీలో ప్రధాన ముడిసరుకు. ఓ అడుగు ముందుకేసి.. జరీ, ఫ్యాన్సీ, గోల్డ్ కోటింగ్, సిల్వర్, బ్రేస్లెట్ రాఖీలనూ తయారు చేస్తున్నారు పెద్దపల్లి వ్యాపారులు. సాగర్ రోడ్ సమీపంలోని శ్రీ రాజరాజేశ్వర రాఖీ కేంద్రం(ఎస్ఆర్ఆర్)లో ఆ సందడి మరీ ఎక్కువ. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు ఇక్కడి నుంచే రాఖీలు వెళ్తాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు మూడు వేల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తున్నది. ఏటా ఆరు నెలలపాటు పెద్దపల్లి చుట్టుపక్కల గ్రామాల మహిళలు ఎస్ఆర్ఆర్ ముడిసరుకుతో రాఖీలను అందంగా తీర్చిదిద్దుతారు. రోజూ మూడు వేల మంది మహిళలు ఇక్కడ పనిచేస్తారు. పండగకు రెండు నెలల ముందు నుంచే హోల్సేల్, రిటైల్ పద్ధతిలో విక్రయిస్తారు.
ఇన్స్టాలోనూ.. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కూడా పెద్దపల్లి వ్యాపారులు ప్రచారం నిర్వహిస్తారు. దీంతో ఆన్ లైన్లోనూ విక్రయాలు జరుగుతున్నాయి. ‘ధర తక్కువ. నాణ్యత ఎక్కువ. ఇదే మా రాఖీల ప్రత్యేకత’ అంటారు ఎస్ఆర్ఆర్ రాఖీ కేంద్రం నిర్వాహకులు ఇల్లెందుల కృష్ణమూరి ్త(ఉప్పు). ‘మేం ప్రతీ రాఖీ పౌర్ణమికి సీజనల్ వ్యాపారం చేస్తాం. గతంలో హైదరాబాద్ బేగంబజార్లో కొనుగోలు చేసేవాళ్లం. సోషల్ మీడియాలో చూసి ఇక్కడికి వచ్చాం. బేగంబజార్ కంటే ఇక్కడే చాలా రకాలు ఉన్నాయి’ అంటారు సికింద్రాబాద్కు చెందిన శీలం సాయి- భానురేఖ యాదవ్. ఈ మాట అక్షరాలా నిజం.
…? అంకరి ప్రకాశ్