రాధిక ఘయ్ నవతరం ఆంత్రప్రెన్యూర్. ‘షాప్ క్లూస్’తో మొదలైన ఆమె ప్రస్థానం ‘కైండ్ లైఫ్’తో శిఖరానికి చేరుకున్నది. యూనికార్న్ క్లబ్లో చేరిన తొలి భారతీయ మహిళ తనే. దశాబ్దం క్రితం సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ‘షాప్ క్లూస్’ అనే స్టార్టప్ను ప్రారంభించారు రాధిక. అక్కడితో ఆగకుండా గత ఏడాది డిసెంబర్లో ‘కైండ్ లైఫ్’ అనే ‘అహింసా’ కంపెనీని ఏర్పాటుచేశారు. సౌందర్య ఉద్దీపన సాధనాలు, పోషకాలు, నిత్యావసర ఉత్పత్తులను అందిస్తుందీ కైండ్ లైఫ్. ఈ ఉత్పత్తులన్నీ ప్లాంట్ బేస్డ్.. అంటే, మొక్కల ఆధారితమైనవే. రసాయనాల జాడ ఉండదు, పర్యావరణానికి హాని జరగదు. తయారీలో జీవహింసకు చోటులేదు. ఉదాహరణకు ఇక్కడ తయారుచేసే శానిటైజర్లో ఆల్కహాల్ వినియోగించరు. ‘కైండ్ లైఫ్’ ప్లాట్ ఫామ్ను ప్రతినెలా రెండు లక్షలమంది సందర్శిస్తున్నట్టు అంచనా. వచ్చే నాలుగేండ్లలో కైండ్ లైఫ్ కూడా యూనికార్న్ క్లబ్లోకి చేరుతుందని రాధిక ధీమాగా చెబుతున్నారు.