లావణ్య ఆలోచనలు కళాత్మకంగా ఉంటాయి. ఆ విషయాన్ని తొలుత భర్త లక్ష్మణ్ గుర్తించాడు, ప్రోత్సహించాడు. ఇంకేముంది, కులవృత్తికి ప్రవృత్తి తోడైంది. పద్దెనిమిది సంవత్సరాలుగా వెదురుతో కుదురైన కళాకృతులకు జీవం పోస్తున్నది పిల్లి లావణ్య. కలప వ్యర్థాలు, కొబ్బరిపీచు, గవ్వలు, రంగురాళ్లు, పూసలు సాధన సంపత్తిగా.. ఇండ్లు, బంగళాలు, ఆలయాలు, చర్చ్లు, మసీదులు, ఐఫిల్ టవర్లు, ఓడలు, పూలబుట్టలు, విమానాలు, పిట్టగూళ్లు తయారు చేస్తుందామె. ప్లాస్టిక్ భూతాన్ని ఇంట్లోకి రానివ్వకూడదనే ఉద్దేశంతో.. వెదురుతో చెత్తబుట్టలు, సబ్బు పెట్టెలు, పూల కుండీలు రూపొందిస్తున్నది. వాటిని విక్రయించేందుకు రాధాకృష్ణ హ్యాండీ క్రాఫ్ట్ గిఫ్ట్సెంటర్ పేరుతో ఓ దుకాణాన్ని ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ‘టాయ్స్ ఫెయిర్’లో లావణ్య తయారు చేసిన బొమ్మలనూ ప్రదర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ వాటిని ప్రశంసించారు. లావణ్య ఇప్పటి వరకు 20 మందికి శిక్షణ ఇచ్చింది. వాళ్లంతా ఆ నైపుణ్యంతో జీవనోపాధి పొందుతున్నారు, మరికొందరికి తర్ఫీదు ఇస్తున్నారు. ‘ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింతమందికి శిక్షణ ఇవ్వడానికి
నేను సిద్ధం’ అంటున్నది లావణ్య.
లావణ్య.. సార్థక నామధేయురాలు. ఆమె చేయి పడితే ఏ సోకూ తెలియని వెదురు కూడా నాజూకుగా మారుతుంది. ఎక్కడలేని లావణ్యం సొంతమైపోతుంది. వెదురు పుల్లలు, కలప ముక్కలు, గవ్వలు, పూసలు ఆమె ముడి సరుకు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని లావణ్య దుకాణంలో నిత్యం బొమ్మల కొలువే.
…? అంకరి ప్రకాశ్