Pala Pitta | విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. దసరా నాడు సీమోల్లంఘనం చేసి (గ్రామశివారు దాటి) ఈశాన్య భాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శమీవృక్షాన్ని పూజించి దసరా వేడుకను ఉత్సాహంగా చేసుకుంటారు. తర్వాత పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితి. నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. రావణుడితో యుద్ధానికి బయల్దేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెబుతారు. అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమి నాడు జమ్మిచెట్టును పూజించి, దానిపై ఉంచిన ఆయుధాలు తీసుకున్న తరుణంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందన్న కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపరంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని విశ్వసిస్తారు. ఈ మేరకు దసరా నాడు విజయోత్సాహానికి సూచకంగా శమీ వృక్షాన్ని పూజించడం, సీమోల్లంఘనంతోపాటు పాలపిట్టను చూడాలనే సంప్రదాయం ఏర్పడింది.