కొవిడ్ సమయంలో న్యుమోనియా వంటి తీవ్ర సమస్య వచ్చినా, మూడు నెలల వ్యవధిలోనే ఊపిరితిత్తులు మామూలు స్థితికి వస్తాయని తాజా అధ్యయనం చెబుతున్నది. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్యులు న్యుమోనియా బారినపడ్డ 42 మంది కొవిడ్ పాజిటివ్ పేషెంట్లపై లోతైన అధ్యయనం చేశారు. వాళ్లంతా అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్తో బాధ పడుతున్నవారే. మొత్తం ఐదు నెలలపాటు వాళ్లను ఫాలో అప్ చేసింది అధ్యయన బృందం. వారిలో 11మందికి న్యుమోనియా తక్కువస్థాయిలో ఉండగా, 31 మందికి తీవ్రంగా ఉంది. వీరికి దాదాపు రెండు వారాలపాటు వైద్యం అందించారు. మూడు నెలల వ్యవధిలోనే ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వచ్చినట్టు సీటీ స్కాన్వంటి పరీక్షలద్వారా నిర్ధారణ అయ్యింది. కాబట్టి, కొవిడ్ కారణంగా వచ్చే ఊపిరితిత్తుల సమస్య జీవితాంతం ఉంటుందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు.