Shankara Vijayendra Saraswathi | కంచిలో కామాక్షి ప్రధాన దైవం. కంచిలో కామకోటి పీఠం దైవ సంకల్పం. ఆ పీఠాన్ని అధిరోహించిన 68వ పీఠాధిపతి… పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచే దైవం. కంచి పీఠాన్ని సేవాపథంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనమూర్తి 69వ పీఠాధిపతి… జయేంద్ర సరస్వతి మహాస్వామి మరో దైవం. ఈ గురుదేవుల అనుగ్రహంతో పీఠ పరంపరను ధర్మదండమంత పవిత్రంగా మోస్తూ, భారతీయ ఆధ్యాత్మికతను పరిరక్షించే బాధ్యతను సదా నిర్వర్తిస్తున్నారు 70వ పీఠాధిపతి… శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి. పరమాచార్య ఉపదేశాలను, జయేంద్ర సరస్వతి స్వామి ఆదేశాలను అనుష్ఠిస్తూ.. భక్తులను అనుగ్రహిస్తున్నారు.
ఆధ్యాత్మిక సంపదను పరిపుష్టం చేస్తూనే, పీఠం తరఫున సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రెండేండ్లుగా యావత్ భారతం విజయ యాత్ర కొనసాగిస్తున్న వారు ఇటీవల హైదరాబాద్కు విచ్చేశారు. సోమవారం జరగనున్న పరమాచార్య 30వ ఆరాధనోత్సవాన్ని నగరంలోనే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక సంభాషణ..
విజయ యాత్రలో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు కదా! ఈ క్రమంలో మీరు గమనించిన భారతీయ ఆధ్యాత్మిక వైభవం గురించి ప్రస్తావించగలరు..
మన దేశ సంస్కృతి అంతా ఒక్కటే! అదే మన జాతీయత. సనాతన ధర్మానికి మనదేశం ఆలవాలం. ఇక్కడ కుటుంబ సంస్కృతి బలంగా ఉన్నది. వేదం పరిఢవిల్లుతున్నది. దక్షిణాదిలో వేద విద్య మరింత విస్తృతం అవుతున్నది. గడిచిన ఇరవై ఏండ్లలో తెలంగాణలో వేద ప్రచారం గొప్పగా జరుగుతున్నది. వేద పాఠశాలలు, స్మార్త పాఠశాలలు బాగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆధ్యాత్మికతకు చేయూతనివ్వడం గొప్ప విషయం. ఉత్తర భారతానికి వస్తే.. అక్కడ భక్తి ఉంది. ఆసక్తి ఉంది. ధార్మిక విద్యా సంస్థలు తక్కువనే చెప్పాలి. గోసేవ విశేషంగా కనిపిస్తుంది. ఉత్తరాదిలో వేద విద్యకు మరింత ఊతమివ్వాలి. దక్షిణాదిలో గోశాలలు విరివిగా నెలకొల్పాలి. ఎక్కడ ఏది అవసరమో, అక్కడ దానిని మనం కల్పించాలి.
కంచి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంప్రదాయ’ పాఠశాలల ఉద్దేశం ఏమిటి?
మన సంప్రదాయాలను భావితరాలకు అందించే సత్సంకల్పంతో కంచి కామకోటి పీఠం బాలికల కోసం ‘సంప్రదాయ’ పాఠశాలలు నెలకొల్పుతున్నది. ఇప్పటికే తెలుగు రాష్ర్టాల్లో తిరుపతి, కొవ్వూరు, హైదరాబాద్, మహబూబ్నగర్ తదితర నగరాల్లో ఐదు పాఠశాలలు నిర్వహిస్తున్నాం. దేశాభివృద్ధికి, సమాజ వికాసానికి నైపుణ్యం కావాలి. అదే సమయంలో పుణ్యమూ కావాలి. నైపుణ్యం కోసం ఆధునిక చదువులు చెప్పే విద్యా వ్యవస్థ ఉంది. పుణ్యం కోసం మఠాలు, మందిరాలు ఉన్నాయి. ఈ రెండిటి కలయికతో రూపకల్పన చేసినవే ‘సంప్రదాయ’ పాఠశాలలు. ఇక్కడ ఆధునిక విద్యతోపాటు మన ఆచార వ్యవహారాలు నేర్చుకోవచ్చు. కట్టు, బొట్టు, సదాచారం, ఆహారం, వ్యవహారం, అలంకారం, లలిత కళలు ఇలా మన కళలపై పట్టు సాధించేలా పాఠ్యప్రణాళిక ఉంటుంది. ఉన్నతమైన సమాజ నిర్మాణానికి ఇవి దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొదిలి సమీపంలో సనాతన ధర్మసేవా గ్రామం నిర్మిస్తున్నారు కదా! దీని ప్రత్యేకతలు ఏమిటి?
ఆధునిక విద్య కొత్తపుంతలు తొక్కుతున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ… పదేండ్లకో కొత్త విద్య వస్తున్నది. ఇవన్నీ అవసరమే! అదే సమయంలో మనదైన సంప్రదాయ విద్యను మర్చిపోవద్దు. ఆలయ జీర్ణోద్ధరణలా ధర్మవిద్యా ఉద్ధరణ జరగాలి. ఈ సదుద్దేశంతోనే కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో సనాతన ధర్మసేవా గ్రామాలు నిర్మించాలని సంకల్పించాం. ఇందులో భాగంగా ఒంగోలు జిల్లా పొదిలి సమీపంలో 31 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సేవాగ్రామం నిర్మాణం కొనసాగుతున్నది. త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఆధునిక, ఆధ్యాత్మిక, వైదిక విద్యకు ఇది ఆలవాలంగా ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్తో ఆధునిక చదువు అందిస్తూనే.. విద్యార్థులకు అధ్యాత్మ విద్యను ఇక్కడ బోధిస్తారు. శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, సాహిత్యం, శతకాలు ఇలా ప్రత్యేక పాఠ్య ప్రణాళికతో దీనిని తీర్చిదిద్దుతున్నాం. వేద పాఠశాల, సంస్కృత పాఠశాల కూడా ఇక్కడ ఉంటాయి.
భారతీయ ఆధ్యాత్మిక విద్యకు ఆధార పీఠంగా నిలవాలనే సంకల్పంతో ధర్మసేవా గ్రామం నెలకొల్పుతున్నాం. కాశీలో గంగా తీరాన కూడా ధర్మసేవా గ్రామం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తలు, భక్తులు, దాతలు ముందుకు వస్తే అన్ని రాష్ర్టాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలనే భావన ఉన్నది. ఈ స్ఫూర్తి కేంద్రం నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. వెయ్యినూట పదహారు రూపాయలతో సభ్యత్వం కూడా తీసుకోవచ్చు. భారతీయ ఆధ్యాత్మికతకు పట్టుగొమ్మల్లా కంచి పీఠం వీటిని రూపొందిస్తున్నది.
నడిచే దేవుడిగా పేరొందిన కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి 30వ ఆరాధన హైదరాబాద్లో నిర్వహించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?
మహాస్వామి వారికీ, భాగ్యనగరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. 1933లో వారు కాశీయాత్రకు వెళ్తూ ఇక్కడ 40 రోజులపాటు ఉన్నారు. కాచిగూడ దగ్గరున్న సత్రంలో బస చేశారు. 1967, 68, 69 సంవత్సరాల్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇక్కడికీ వచ్చారు. పద్మారావునగర్లోని స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వారి చేతుల మీదుగా ప్రారంభమైంది. దీనికి సమీపంలో వేంకటేశ్వర ఆలయం కూడా వారి హయాంలోనే నిర్మితమైంది. ఇలా భాగ్యనగరంతో వారికి ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఈ క్రమంలో 30వ ఆరాధనోత్సవం ఇక్కడ నిర్వహించడం ముదావహంగా భావిస్తున్నాం. స్వామివారి ఆరాధన సందర్భంగా సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. వేద పండితులకు సన్మానం నిర్వహించనున్నాం.
పరమాచార్య గొప్పదనం గురించి పుస్తకాలు, ప్రవచనాల ద్వారా తెలుసుకున్నాం. అయితే, వారి శిష్యులుగా.. ఆయన సహృదయతను చాటిచెప్పే ఏదైనా సంఘటన మాతో పంచుకోగలరు..
సనాతన ధర్మాన్ని రక్షించడానికి మహాస్వామి వారు తమ నూరేండ్ల జీవితాన్ని ధారపోశారు. శతాబ్దిలో వారు ఉండటం కాదు, ఒక శతాబ్దమే వారిలో ఉన్నది. నీతి, నిజాయతీ, నిర్వహణకు ఆయన పెట్టింది పేరు. ఆడంబరం లేని మహనీయుడు. ఆయన సమదర్శి, వాత్సల్య మూర్తి. వారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఒక సంఘటన జరిగి దశాబ్దాలు జరిగినా దానిని గుర్తుపెట్టుకునేవారు. ఒకసారి కలిసిన వ్యక్తి మళ్లీ ఎప్పుడు కలిసినా గుర్తించేవారు. స్వామి కార్యంలో భారీ సేవ చేసినవారినీ, ఉడతాభక్తిగా సేవించిన వారినీ అందరినీ ఒకేతీరున గుర్తుపెట్టుకునేవారు. అందుకే ఆయన సమదర్శి అనిపించుకున్నారు. సాధారణ భక్తులు వచ్చి వారికొచ్చే చిన్నచిన్న సందేహాలు అడిగినా, పండితులు తర్కమీమాంస శాస్ర్తాలకు సంబంధించిన ప్రశ్నలు వేసినా.. అన్నిటికీ సావకాశంగా బదులిచ్చి, సందేహ నివృత్తి చేసేవారు. ఆయన ఆచారం ప్రధానంగా పెట్టుకున్నారే కానీ, ప్రచారం గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఆయన కారుణ్యమూర్తి. వారి వ్యక్తిత్వం దోష రహితం, దైవ సహితం. ఒకసారి మాకు ఆరోగ్యం బాగోకపోతే… మేడపై ఉన్న మమ్మల్ని పరామర్శించడానికి స్వామివారు స్వయంగా వచ్చారు. ఆయన చూపుల్లో దివ్య తేజస్సుతోపాటు అంతులేని వాత్సల్యం ప్రతిఫలించేది.
దేశానికి ప్రాణం వంటి ధర్మానికి ప్రాచుర్యం కల్పించాలి. అది సమాజానికి చాలా అవసరం. ఆలయాలు ధర్మ ప్రచారానికి వేదికలు కావాలి. ప్రజల ధార్మిక అవసరాలు పూర్తి చేయడానికి కంచి పీఠం కృషి చేస్తున్నది. గుడి లేని చోట గుడి, ఆలయం ఉన్నచోట అర్చకస్వామి, మంచి సిద్ధాంతి, ప్రవచన కర్తలు ఇలా భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా పీఠం తరఫున నిరంతర కార్యాచరణ నిర్వహిస్తున్నాం. ‘హర్ పంచాయత్మే పండిత్ జీ హోనా… హర్ మందిర్ తిరుపతి హోనా’ ఇది కంచి పీఠం విధానం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా వైఫై కనెక్టివిటీ అందుబాటులో ఉంటున్నది. విద్య, వైద్యం, వ్యవస్థ, వేదం, వేదాంతం… వీఫైవ్ (వీ5) భారతావని విజయానికి ముఖ్యమైన ఈ ఐదు రంగాల్లోనూ అభివృద్ధికి కంచి పీఠం నిరంతరం పరిశ్రమిస్తున్నది.
ప్రతి గ్రామ పొలిమేరలోనూ ఊరికి రక్షణగా ఎల్లమ్మ ఉంటుంది. ఈ దేశానికి ఎల్లలు ఉన్నాయి. దేశ సరిహద్దుల్లో భద్రత కోసం, భారతావని సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఎల్లల్లో ఆలయాల నిర్మాణానికి కంచి పీఠం సంకల్పించింది. దేశ సరిహద్దు రాష్ర్టాలైన అసోం, సిక్కిం, మేఘాలయ, గోవా, పంజాబ్ ఇలా సీమ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించబోతున్నాం. అండమాన్ నికోబార్లోనూ ప్రయత్నం జరుగుతున్నది. దేశ రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
పరమాచార్య ప్రసంగాలతో ‘దేవుని స్వరం’ పుస్తకాల సంపుటి ముద్రించారు కదా! అందులో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం ఏమిటి?
మహాస్వామివారి ప్రసంగం గంగానది ప్రవాహంలా ప్రశాంతంగా సాగిపోయేది. వారు స్థల పురాణాలను మిళితం చేస్తూ ఉపదేశించేవారు. ఆయన ప్రయాణంలో అన్నిటినీ గమనించేవారు. ఆయా అంశాలకు విలువ ఇచ్చేవారు. అదేదో లోక వ్యవహారం అని చూడకుండా.. అవసరమైన చోట తాను పరిశీలించిన విషయాలను ఉటంకిస్తూ అనుగ్రహ భాషణం చేసేవారు. అందరినీ చూసేవారు. అందరిలో భగవంతుడిని దర్శించేవారు. వారి భావన పవిత్రమైనది. ‘దేవుని స్వరం’లో పురాణాంతర్గత విషయాలు ఉన్నాయి. తత్వ సంబంధిత విజ్ఞానం ఉంది. వైజ్ఞానిక శాస్త్ర విషయాలూ ఉన్నాయి. వారు ప్రస్తావించిన విషయాలను యథాతథంగా భక్తులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ‘దేవుని స్వరం’ అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటి ద్వారా మన దేశ ఉన్నతి, స్వాభిమానం రెండూ తెలుస్తాయి.
మహాస్వామి పీఠాధిపతిగా ఉన్న రోజుల్లో అటు అరుణగిరిలో రమణులు, ఇటు శృంగేరిలో చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారు ఉన్నారు కదా! ఆ మహనీయుల గురించి పరమాచార్య ఏ సందర్భంలోనైనా ప్రత్యేకంగా ప్రస్తావించేవారా?
పరమాచార్య గారు, రమణ మహర్షి గారు, చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారు భారతావని ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లారు. ఈ ముగ్గురి చైతన్యం ఒకటే. ఆధ్యాత్మిక అన్వేషణ కోసం మనదేశానికి వచ్చిన పాల్ బ్రంటన్కు అరుణాచల రమణ మహర్షి పేరును మహాస్వామివారే సూచించారు. ఇదే సమయంలో మరోపేరు కూడా ప్రస్తావించారు. ఆయన ఎవరని తర్వాతి కాలంలో మహాస్వామివారిని అడిగినప్పుడు ‘వారణాసిలోని నారాయణ శర్మ గార’ని చెప్పారు. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారు, పరమాచార్య గారు ఓసారి పక్కపక్క గ్రామాల్లో చాతుర్మాస్య దీక్ష నిర్వహించారు. వారి మధ్య పరస్పర ఆధ్యాత్మిక సంబంధం ఉండేది. భావనా ఐక్యత వారిలో ఉండేది. కంచికి వచ్చిన భక్తులు ఎవరైనా అరుణాచలానికి, శృంగేరికి వెళ్లామని చెబితే.. స్వామివార్లు ఎలా ఉన్నారని అడిగి వారి కుశలం తెలుసుకునేవారు పరమాచార్య!
అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయింది. త్వరలోనే బాలరాముడు అక్కడ కొలువుదీరనున్నాడు. అయోధ్య వివాదం సద్దుమణగడానికి అప్పట్లో జయేంద్ర సరస్వతి స్వామివారు చర్చలు జరిపారు కదా! ఆ సందర్భంలో ఈ సమస్యపై మీతో చర్చించిన విషయాన్ని తెలియజేయగలరు?
అయోధ్య రామాలయం విషయమై జయేంద్ర సరస్వతి స్వామివారు ఎంతో కృషి చేశారు. కిటికీ తెరవడం నుంచి సమస్య పరిష్కారానికి కిటుకు చెప్పడం వరకు ఎన్నో విషయాల్లో ఆయనకు ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నది. 1986 ఫిబ్రవరి 10న అయోధ్యలో రాములవారి దర్శనం కల్పించడంలో వారు కీలకపాత్ర పోషించారు. దానికోసం వ్యూహం రచించారు. పూజలూ చేశారు. సంవాదం చేశారు. వివాదం లేకుండా ఈ సమస్యకు పరిష్కారం రావాలని అహరహం కృషి చేశారు. పరమాచార్య వారి ఆదేశానుసారం జయేంద్ర సరస్వతి స్వామివారు కార్యాచరణ కొనసాగించారు. రాములవారి కోసం పరమాచార్య అయోధ్యకు ఛత్రచామరం పంపించారు. జయేంద్ర సరస్వతి స్వామివారు ప్రయాగ నుంచి అయోధ్యకు వెళ్లి వాటిని రామచంద్రుడికి కంచి పీఠం తరఫున సమర్పించారు. అలా అయోధ్య రాముడికి మొట్ట
మొదటి సన్మానం పరమాచార్య గారు… జయేంద్ర సరస్వతి స్వామివారి ద్వారా చేయించారు.
మీకు కంచిపీఠం ఉత్తరాధిపతిగా అవకాశం వచ్చిన సందర్భంలో మీ అంతరంగం ఎలాంటి అనుభూతికి లోనైంది?
పరమాచార్య, జయేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరూ నన్ను ఆకర్షించారు. మేం బాల్యంలో ఉండగా నవరాత్రుల సమయంలో జయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్లేవాణ్ని. వైశాఖ మాసంలో పెద్దస్వామివారిని దర్శించుకునేవాణ్ని. ఒకసారి పరమాచార్య మహారాష్ట్రలో ఉన్నారని తెలిసి వెళ్లాను. ఆ సమయంలో వారేం మాట్లాడలేదు. మరోసారి కర్ణాటకలోని గుల్బర్గాకు వేంచేశారని తెలిసి.. దర్శనం కోసం ఉదయాన్నే వెళ్లాను. స్వామివారు ఆప్యాయంగా పలకరించారు. తెలుగు నేర్చుకోమని చెప్పారు. అంతేకాదు వారితో తెలుగులోనే మాట్లాడవలసిందిగా ఆదేశించారు. జయేంద్ర సరస్వతి స్వామివారు తెలంగాణ ప్రాంతం పర్యటనలో ఉన్న సమయంలోనే పరమాచార్య గారి నుంచి మా గురించిన వర్తమానం పంపారు. అలా తెలంగాణ ప్రాంతం నుంచే కీలక నిర్ణయం వెలువడింది.
దశాబ్దాలుగా మసకబారిన కశ్మీర ప్రాభవానికి పునర్వైభవం తెచ్చేలా కంచి పీఠం ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నది. కశ్మీర్ సంస్కృతిని కాపాడుకోవడమే ధ్యేయంగా అక్కడి మహర్షుల సాహిత్యాన్ని ఈ లోకానికి పరిచయం చేస్తున్నది. తెలుగువారికి ఆపస్తంబ మహర్షి ఎంత ప్రత్యేకమో.. కశ్మీర పండితులకు లౌగాక్షి మహర్షి అంతే ముఖ్యం. వారి పుస్తకాలు అచ్చువేయిస్తున్నాం. కశ్మీర ప్రాంతానికి చెందిన పురాణాలు, స్థల పురాణాలు వీటన్నిటినీ పుస్తకాల రూపంలో తీసుకొస్తున్నాం. వారి సంస్కృతిని భావితరాలకు అందజేయాలనే ప్రయత్నంలో భాగంగా శారద లిపికి ప్రాచుర్యం కల్పిస్తున్నాం.
ఆధ్యాత్మిక బాటలో పయనించాలని అనుకునేవాళ్లు ఎటువంటి వ్యక్తిని గురువుగా ఎంచుకోవాలి?
‘అధిగత తత్వః శిష్య హితయ ఉచ్యతః సతతం’ అని గురువు ఎలా ఉండాలో శంకర భగవత్పాదులు తెలియజేశారు. గురువు అనేవాడు శాస్ర్తాలు తెలిసినవాడై ఉండాలి. వాటిని ఆచరించాలి. శిష్యుడి హితం కోరుకునే వాడై ఉండాలి. దానికోసం ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉండాలి. అలాంటి మహోన్నత వ్యక్తిని గురువుగా స్వీకరించాలి. గురు ముఖంగా వచ్చిన మంత్రాన్ని ఉపాసన చేయడం వల్ల తేజస్సు కలుగుతుంది. మంత్ర సిద్ధి కలుగుతుంది.
స్వతంత్ర సంగ్రామ సమయంలో స్వామివారిని ఎందరో దేశభక్తులు కలిసేవారు. 1927లో మహాత్మా గాంధీగారు కూడా స్వామివారిని కలుసుకున్నారు. 1937-38 ప్రాంతంలో ఒకసారి మహాస్వామి వారు నెల్లూరుకు వెళ్లారు. కొందరు స్వతంత్ర సమరయోధులు జైలులో ఖైదీలుగా ఉన్నారు. వాళ్లంతా స్వామివారి దర్శనాన్ని ఆకాంక్షించారు. స్వామివారు వారికి దర్శనం ఇచ్చి… ‘మీ త్యాగం గొప్పది. మీ సంకల్పం నెరవేరుతుంద’ని ఆశీర్వదించారు. స్వామివారు దీర్ఘదర్శి. భాష ప్రాతిపదికన, ఇతర విభేదాల కారణంగా దేశం విడిపోవొద్దని ఆకాంక్షించారు. ‘మన విభేదాలు పెద్దవి కాకూడదు. వైషమ్యాలు విస్తృతం అయితే మూడోదేశానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంద’ని వారు భావించారు. మన దేశం ప్రపంచానికి సాంస్కృతిక రాయబారిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని 1947 ఫిబ్రవరిలోనే ఆయన ప్రస్తావించడం విశేషం.
గురు ముఖతః మంత్రోపదేశం పొందే అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. అలాంటి వాళ్లు ఎలాంటి సాధన చేయాలి?
ఈ విషయమై పరమాచార్య గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీముఖం పంపారు. గురు ముఖంగా మంత్రోపదేశం లేనివాళ్లు సంకీర్తన మార్గాన్ని ఎంచుకోవచ్చు. శివ, కేశవ నామాలు చెప్పుకోవచ్చు అని పరమాచార్య గారు తెలియజేశారు. ఉదయం కేశవ నామాలు, సాయంత్రం శివనామాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నామ సంకీర్తనం, భజనలు ఇవన్నీ ఉపదేశం లేకుండానే చేసుకునే వెసులుబాటు ఉంది.
నేటి సమాజంలో భక్తి అంటే దేవుణ్ని కోర్కెలు కోరుకోవడం, తీరితే మొక్కులు చెల్లించడం ఇలా తయారైంది. దీనిపై మీ స్పందన ఏమిటి?
కోరిక ఉండటం తప్పు కాదు. కామాక్షి అమ్మవారు తన కటాక్షంతో భక్తుల కామన (కోరికలు) నెరవేరుస్తుంది. అమ్మ అనుగ్రహంగా భావించాలి. అయితే కోరుకునేది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలి. భక్తి అనేది భుక్తి, ముక్తి ప్రధానంగా ఉండాలి. భుక్తికే పరిమితం కావొద్దు. ముక్తినీ ఆకాక్షించాలి. ఒక గృహస్థు కోరికలతో ఉండటం ప్రమాదం కాదు. అది తనకే పరిమితం కాకుండా, తన చుట్టూ ఉన్నవారికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోగలగాలి.
– కణ్వస
-ఫొటోలు : జి. భాస్కర్