Anoop rubens | పదహారేండ్ల క్రితం తెలుగు సినీ యవనికపై దూసుకొచ్చిన స్వరకెరటం.. అనూప్ రూబెన్స్. హృదయాన్ని స్పృశించే మెలోడీలు, హుషారెత్తించే మాస్ బీట్ సాంగ్స్, వలపు భావాలకు అద్దంపట్టే డ్యూయట్స్.. ఏ పాటైనా అనూప్ స్వర రచనలో కొత్తరూపు దిద్దుకుంటుంది. ఎన్నో బ్లాక్బస్టర్ మ్యూజికల్ హిట్స్తో తెలుగుతెరపై తనదైన సంతకాన్ని లిఖించుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి అనూప్ రూబెన్స్ ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత నాగార్జునగారితో, అన్నపూర్ణ సంస్థలో నేను పనిచేసిన మూడో చిత్రం ‘బంగార్రాజు’. తొలి రెండు సినిమాలు మ్యూజికల్ బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. వాటికి మించి సంగీతాన్ని అందించాలనే తపనతో ‘బంగార్రాజు’ కోసం పని చేశాను. పాటలు అద్భుతంగా కుదిరాయి. ఈ మధ్యే విడుదలైన ‘లడ్డుండా…’ పాట శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్నది. ఆ స్పందన నాకు పాజిటివ్ ఎనర్జీని అందించింది. నాగార్జునగారూ మెచ్చుకున్నారు.
‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో ‘డిక్క డిక్క డుం డుం..’ పాటను నాగార్జునగారితోనే పాడించాను. కథలోంచి పుట్టే పాట అది. ‘బంగార్రాజు’లోని ‘లడ్డుండా..’ కూడా కథలో భాగమే. ఎందుకో, ఈ పాట కూడా నాగార్జునగారే పాడితే బాగుంటుందని అనిపించింది. దర్శకుడు కల్యాణ్కృష్ణ కూడా అదే మాటన్నారు. ఇద్దరం కలిసి అడగటంతో నాగార్జునగారు ఓకే చెప్పారు. మొదట్లో, ఆరంభంలో వచ్చే చిన్న బిట్ను పాడిద్దామనుకున్నాం. పాట నచ్చడంతో ‘పర్లేదు. మొత్తం నేనే ప్రయత్నిస్తా. బాగా
లేదనిపిస్తే తీసేయండి’ అని నాగార్జునగారు నిర్మొహమాటంగా చెప్పారు. మా ఊహలకు మించి పాడారాయన. అలా ‘లడ్డుండా..’ మనందరి ముందుకొచ్చింది. ‘బంగార్రాజు’ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కూ చాలా ప్రాధాన్యం ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తరహాలో కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీంతో, నేపథ్య సంగీతాన్ని సవాలుగా తీసుకున్నా.
‘దృశ్యం-2’ చిత్రానికి సంగీతాన్ని అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇలాంటి థ్రిల్లర్స్కు బ్యాక్గ్రౌండ్ సమకూర్చడం మ్యూజిక్ డైరెక్టర్కు ఓ సవాలు. కథలోని ఫీల్ను, సన్నివేశాల్లోని ఉద్వేగాల్ని అర్థం చేసుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందివ్వాలి. స్వరకర్తగా నేను సినిమాల విషయంలో చిన్నాపెద్దా భేదాల్ని పాటించను. ప్రతి చిత్రానికి అంతే అంకితభావంతో పనిచేస్తా. గత ఏడాది వచ్చిన ‘ముప్పైరోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా…’ పాట ప్రభంజనం సృష్టించింది. యూట్యూబ్లో 400 మిలియన్స్కుపైగా వ్యూస్ లభించాయి. తెలుగు సంగీత ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన గీతాల్లో ఇదొకటి. చిన్న సినిమా అయినా కమిట్మెంట్తో మ్యూజిక్ ఇచ్చా. అయితే పెద్ద స్టార్స్ ఉన్న సినిమాకు మ్యూజికల్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. తారల ఇమేజ్ వల్ల పాట ఎక్కువ మందికి చేరువ అవుతుంది. ‘బంగార్రాజు’ చిత్రంలో
‘లడ్డుండా..’ పాటను నాగార్జునగారు పాడటం చాలా అడ్వాంటేజ్ అయ్యింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మ్యూజిక్ చార్ట్స్లో దూసుకుపోయింది. అదే సమయంలో పెద్ద హీరోల సినిమాల విషయంలో స్వరకర్తలపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది.
దర్శకుడి విజన్, సినిమా కథలోని ఎమోషన్స్ మంచి సంగీతానికి ప్రేరణనిస్తాయి. రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు.. ఈ ముగ్గురి భావాల మధ్య సమన్వయం కుదిరితే మంచి పాట పుడుతుంది. అయితే ఓ పాట ఎక్కువ మందికి చేరాలంటే ట్యూన్ క్యాచీగా ఉండాలి. సంక్లిష్టమైన ప్రయోగాల్ని ఎవరూ ఇష్టపడరు. మ్యూజిక్ కంపోజింగ్ విషయంలో నేను ప్రత్యేకమైన టైమ్ ఏదీ పెట్టుకోను. దర్శకుడు పాట సందర్భం చెప్పిన వెంటనే ట్యూన్ సిద్ధం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ‘మనం’ కథను దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పినప్పుడు ఐదు నిమిషాల బ్రేక్ మధ్యలోనే ‘చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే..’ పాటకు ట్యూన్ సిద్ధం చేశా. కథ బాగా ఇన్స్పైర్ చేస్తే బాణీలు వెంటనే తయారవుతాయి. అయితే చాలా సినిమాలకు రెండుమూడురోజులు సిట్టింగ్స్ వేసుకొని ట్యూన్స్ కంపోజ్ చేస్తుంటాం.
మ్యూజిక్లో కాపీ కల్చర్ గురించి వివాదాలు నడుస్తుంటాయి. నా మట్టుకు నేను కాపీ ట్యూన్స్కు దూరంగా ఉంటాను. వాస్తవానికి ఏ సంగీత దర్శకుడైనా కావాలని మ్యూజిక్ను కాపీ చేయరు. ఒక్కోసారి స్ఫూర్తిగా తీసుకొని చేసిన పాటలు కూడా ‘కాపీ’ భావన కలిగిస్తాయి. అదీగాక కొన్ని లక్షల పాటల్లో సారూప్యత ఉన్న స్వరాలు కనిపించడం సహజమైన విషయం. గతంతో పోలిస్తే, సంగీత ప్రపంచంలో ఇప్పుడు పోటీ ఎక్కువే. ప్రతిభ కలిగిన ఔత్సాహికులు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఆరోగ్యకరమైన పోటీ మంచిదే. మనలోని నైపుణ్యాన్ని పదునుపెట్టుకోవడానికి, ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. ఒక్కరమే పరిగెత్తడం కంటే నలుగురితో రేసులో ఉంటేనే మరింత శ్రమిస్తాం. అయితే, ఎలాంటి పోటీని అయినా స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎవరైనా మంచి మ్యూజిక్ చేస్తుంటే, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. అందులో తప్పులేదనుకుంటా.
సంగీత దర్శకుడిగా పదహారేండ్ల కెరీర్లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. నా ప్రయాణంలో ‘ప్రేమకావాలి’ తొలి మ్యూజికల్ బ్లాక్బస్టర్. ఆ సినిమా వందరోజులు ఆడటం గర్వంగా అనిపించింది. ‘గోపాల గోపాల’ సినిమా టైమ్లో పవన్ కల్యాణ్గారు బొకే పంపి అభినందనలు తెలిపారు. అలాగే ‘ఇష్క్’ చేస్తున్నప్పుడు నితిన్ చాలా ఎంకరేజ్ చేశారు. అమితాబ్ బచ్చన్గారు నటించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించా. అమితాబ్గారిని కలవడం మరచిపోలేని అనుభూతి. ‘పైసా వసూల్’లో బాలకృష్ణగారితో పాట పాడించడం కూడా గొప్ప జ్ఞాపకం. నితిన్, నిత్యామీనన్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్స్తో పాటలు పాడించడాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఇలా కెరీర్ను విశ్లేషించుకుంటే మరపురాని అనుభవాలెన్నో
సంగీత దర్శకులు ప్రతి ట్యూన్నూ సవాలుగానే తీసుకుంటారు. ప్రస్తుతం, డైరెక్టర్స్ మొదలు సామాన్య ప్రేక్షకుల వరకూ సంగీతంలో కొత్త దనాన్ని కోరుకుంటున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా మన ప్రతిభనూ మెరుగుపరచుకోవాలి. మ్యూజిక్ కంపోజింగ్లో కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని అవగతం చేసుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలి. నేను కంపోజ్ చేసే పాటలతో పాటు నిత్యం శ్రోతల ముందుకొస్తున్న సంగీతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. నా సినిమాల్లో సంగీతం కొత్తగా ఉండేలా చూసుకుంటాను.
…? కళాధర్ రావు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళన చేశారు.. కానీ..