కేవలం తల్లిపాలు మాత్రమే తాగే 6 నెలల వయసు పిల్లలకు అతిసార వ్యాధి రావడం చాలా అరుదు. తల్లిపాలలోని వివిధ పదార్థాలు ఈ వ్యాధి నుంచి రక్షిస్తాయి.
పెద్దలు చెప్పినట్టు అమ్మపాలు అమృతమే. చనుబాలలో లాక్టోజ్ ఎక్కువ, మాంసకృత్తులు తక్కువ. దీనివల్ల విరేచనాలు అరుదు. తల్లిపాలలోని ‘బైఫిడస్ ఫ్యాక్టర్’ వల్ల రోగ నిరోధక బ్యాక్టీరియా అన్న వాహికలో ఉత్పత్తి చేసే ఎసిటిక్ ఆసిడ్, లాక్టికాసిడ్ మొదలైన రసాయనాలు వ్యాధికారక ఇ-కోలై బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్ పెరుగుదలను నివారిస్తాయి. తల్లిపాలలోని మరో పదార్థం ‘లాక్టోఫెరిస్’. ఇది కూడా ఇ-కోలై పెరుగుదలను అడ్డుకుంటుంది.
ఆహారం ఇవ్వాల్సిందే
అతిసార వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆహారం ఇవ్వకూడదనేది అపోహ మాత్రమే. ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్న దశలో కూడా ఆహారం కొనసాగించాలి. ఆ సమయంలో ఆకలి తక్కువ కాబట్టి వారికి ఇష్టమైనది, సులువుగా జీర్ణమయ్యేది కొద్దికొద్దిగానే అయినా ఎక్కువసార్లు ఇవ్వాలి. ఆహారాన్ని దూరం చేస్తే, పోషక విలువల లోపం ఏర్పడుతుంది. ఆ బలహీనత అనేక వ్యాధులకు కారణం అవుతుంది. ఓఆర్ఎస్కు తోడు ఆహారం కూడా అందిస్తే.. భోజనంలోని అమైనో యాసిడ్స్ కారణంగా ఓఆర్ఎస్ ఒంటికి బాగా పడుతుంది. ఆకలి తక్కువగా ఉండటం వల్ల పిల్లలు ఒకేసారి ఎక్కువగా తినలేరు కాబట్టి, రెండుమూడు గంటలకు ఒకసారి ఓపికతో తినిపించాలి. పైపాలు తాగే పిల్లలకు అయితే.. ఆ పాలే నీరు కలపకుండా కప్పు చెంచాతో లేదా గ్లాసుతో తాగించాలి. సీసాతో తాగించరాదు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత రెండు వారాలు ఇంతకు ముందు కన్నా కాస్త ఎక్కువ ఆహారం ఇవ్వడం వల్ల కోల్పోయిన బరువు తిరిగి వస్తుంది. అతిసార వ్యాధి నివారణలో విటమిన్-ఎ, జింక్, ఇనుము లోపాలు నివారించడం చాలా ముఖ్యం. విటమిన్-ఎ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలైన పచ్చని ఆకు కూరలు, నారింజ, పసుపు పచ్చ రంగు ఫలాలు ఏదో ఓ రూపంలో అందేలా చూడాలి.
– డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు