Mother’s Day 2022 | అమ్మకు ఎంత ధైర్యం… విధికి తలొగ్గదు. అమ్మకు ఎంత ఓపిక… పరిస్థితులు చక్కదిద్దే వరకు విశ్రమించదు. అమ్మకు ఎంత ప్రేమ… బిడ్డల కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది. అందుకే.. అమ్మ ఆదిదైవం అయింది. తొలి వందనం అమ్మకే దక్కింది. ఓడలు బండ్లయినా.. అమ్మ అమ్మే! విధి వక్రించినా అమ్మ కనికరంలో తేడా ఉండదు. తనకోసం ఏం కోరుకోదు తల్లి. తన ప్రేమ అంతా కన్నబిడ్డల మీదే. మానవ సంబంధాల్లో తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసేది అమ్మ ఒక్కరే. కట్టుకున్నవాడు దూరమైనా, ఆస్తిపాస్తులు లేకున్నా.. అమ్మ ఆగిపోదు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి, బిడ్డల సంతోషం కోసం కష్టాలతో యుద్ధానికి దిగుతుంది. చెక్కుచెదరని గుండె ధైర్యంతో సవాళ్లతో సావాసం చేస్తున్న ఎందరో ఒంటరి తల్లులు కుటుంబాలకు నిట్టాడుగా నిలుస్తున్నారు. బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని కన్నీటి వ్యథలను దిగమింగి తమ బిడ్డల జీవితాల్లో పన్నీటి జల్లు కురిపించిన మాతృమూర్తుల విజయగాథలపై ‘జిందగీ’ ప్రత్యేక కథనం..
విధి పగబట్టినా తన విధులను నిర్వర్తించడంలో అమ్మను మించిన సమర్థులు కనిపించరు. సిద్దిపేట జిల్లా సింగాటం గ్రామానికి చెందిన లక్ష్మి కథ ఇలాంటిదే. భర్త చనిపోయి, కొడుకు దూరమై పుట్టెడు దుఃఖంలో మునిగిపోయినా.. బిడ్డ బాగు కోసం ఒంటరిగా జీవనపోరాటం చేసి విజేతగా నిలిచిందామె. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన మాధవరెడ్డితో లక్ష్మి వివాహం జరిగింది. మాధవరెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామ పంచాయతీలో (ప్రస్తుతం మున్సిపాలిటీ) కారోబార్గా పనిచేసేవాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు.. నవీన్, కూతురు.. హారిక. ఐదేండ్ల వయసులో నవీన్ ప్రమాదవశాత్తు నీటిలోపడి మరణించాడు. కన్నపేగు కడతేరిన బాధ నుంచి తేరుకోకముందే, భర్త మాధవ
రెడ్డిని రోడ్డు ప్రమాదం మింగేసింది. ఆమె బతుకు రోడ్డున పడినట్లయింది. బిడ్డ భవిష్యత్తు కోసం బాధలన్నీ భరించింది. గ్రామస్తులు అండగా నిలిచి మాధవరెడ్డి ఉద్యోగం ఆమెకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భర్త చేసిన కారోబార్ ఉద్యోగం ఆమెకు లభించింది. ఉద్యోగం కోసం మొదటిసారిగా గడప దాటింది లక్ష్మి. అయితే, కారోబార్గా కొనసాగాలంటే కనీసం పదో తరగతి పాస్ కావాలని అధికారులు నిబంధన పెట్టారు. ఉద్యోగం ఉంటేనే కూతురిని పోషించగలదు, చదివించగలదు. ఆ ఒక్క కారణంతోనే ఎప్పుడో ఆగిపోయిన చదువును మళ్లీ కొనసాగించింది. పదో తరగతి పాసైంది. తల్లి కష్టం కండ్లారా చూసిన హారిక కష్టపడి చదివింది. ఎంబీయే చేసింది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ‘కొలువు’ దీరింది. హారికకు ఇటీవలే మంచి సంబంధం కుదిరింది. బిడ్డ పెండ్లి చేసి అమ్మగా తన బాధ్యతను నెరవేర్చుకుంటానని చెబుతున్నది అనిరెడ్డి లక్ష్మి
వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన జినికిరి కోమలది కన్నీటి గాథ. ఆమె భర్త మల్లయ్య అర్ధంతరంగా కాలం చేశాడు. వారికి ముగ్గురు ఆడ పిల్లలు.. సుధారాణి, ఉషశ్రీ, తేజశ్రీ. భర్త చనిపోయేనాటికి చిన్నకూతురు వయసు రెండున్నరేండ్లు. పుట్టెడు దుఃఖంలో పుట్టింటికి పోదామనుకుంటే, వారి పరిస్థితీ అంతంత మాత్రమే. తండ్రి మరణంతో చెల్లి పెండ్లి బాధ్యత కూడా కోమలదే అయింది. మంచానపడ్డ తల్లికి తనే తల్లయింది. అత్తింటి అండదండ ఉన్నాయా అంటే అదీ లేదు. అత్త అకాల మరణం చెందింది. వృద్ధాప్యంతో ఏ పనీ చేయలేక మామ ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఆ తల్లి జీవితాన్ని సవాలుగా స్వీకరించింది. నాలుగెకరాల భూమి తప్ప చేతిలో చిల్లిగవ్వ లేదు. చెల్లి పెండ్లికి చేసిన అప్పు కండ్ల ముందే పెరిగిపోసాగింది. ముగ్గురు బిడ్డల చదువులు. ఇన్ని కష్టాలూ ఆమె సంకల్ప బలం ముందు అల్పంగా కనిపించాయి. ఒక్కతే నాగలి పట్టింది, దుక్కి దున్నింది, నారు పోసింది, కలుపు తీసింది రెక్కల కష్టంతో సాగు కొనసాగించింది. అమ్మను, మామను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే, పిల్లలను ఉన్నతంగా చదివించింది. అప్పులు తీర్చింది. ఇంటిని బాగు చేయించుకుంది. పెద్దబిడ్డ సుధారాణిని బీటెక్ చదివించింది. తండ్రిలేని లోటు తెలియకుండా, ఘనంగా పెండ్లి చేసింది. రెండో కూతురు ఉషశ్రీని సైతం బీటెక్ చదివించింది. ఇప్పుడు ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్. రెండేండ్ల కిందట రెండో కూతురు పెండ్లి చేసింది. ఇంటర్ చదువుతున్న చిన్న కూతురును కూడా ఉన్నతంగా చదివిస్తానని చెబుతున్నది కోమల. ఇన్ని కష్టాలు ఎలా తట్టుకున్నావని ఎవరైనా అడిగితే ‘పిల్లల కోసం.. వాళ్లే నా ప్రపంచం, వాళ్ల కోసం ఎంత కష్టమైనా భరిస్తా’ అంటుంది ఆ తల్లి.
పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామానికి చెందిన సాయిన శంకరమ్మ తన జీవితాన్ని బిడ్డలకే అంకితం చేసింది. ఆమె భర్త శంకర్ జీప్ డ్రైవర్గా పనిచేసేవాడు. అనారోగ్యంతో ఆయన కన్నుమూసేనాటికి వారికి ఇద్దరు కొడుకులు.. మనోహర్, మధుకర్. ఊహ తెలియని ఇద్దరు బిడ్డలనూ ప్రయోజకులను చేయాలని నిశ్చయించుకున్నది శంకరమ్మ. అంత దుఃఖంలోనూ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి కలలు కనేది. పిల్లలకు ఏ కష్టమూ రాకుండా పెంచడానికి, తను అష్టకష్టాలు పడింది. రోజూ కూలి పనికి వెళ్లేది. పైసాపైసా కూడబెట్టి కొడుకులను చదివించింది. పెద్ద కొడుకు మనోహర్ ఎంసీఏ, బీఈడీ చదివాడు. రెండేండ్ల కిందట రైల్వేలో ఉద్యోగం సాధించాడు. చిన్న కొడుకు మధుకర్ ఎంబీఏ చదివాడు. గతేడాది ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేరాడు. చితికిన కుటుంబాన్ని ఒక దరికి చేర్చి, బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన శంకరమ్మ జీవితం ఓ గెలుపు పుస్తకం.
… మ్యాకం రవికుమార్
“మాతృదినోత్సవానికి ఆర్టీసీ కానుక.. అమ్మలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం”
“Mother’s Day : అమ్మ కోసం నెదర్లాండ్లో ఇద్దరు భారతీయ యువతుల పోరాటం”
Mother’s Day Special : అమ్మ కడుపు చల్లగా
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు (ntnews.com)