మొన్నటి వరకూ ముంబై బీచ్ పక్కన ఓ గుడిసెలో ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ మాడళ్లతో కలిసి ఫ్యాషన్ మ్యాగజైన్ల కవర్ పేజీలు పంచుకుంటున్నది. తనే కవర్స్టోరీగా మారుతున్నది. ఎవరా అదృష్టవంతురాలు అంటే.. మలీషా ఖర్వా. అంతా ‘ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్’ అంటున్నారు.
కరోనా కాలంలో.. అర్ధంతరంగా విదేశీ ప్రయాణాలు ఆగిపోయాయి. హాలీవుడ్ స్టార్ రాబర్ట్ హోప్మన్ ముంబై బీచ్లో వాకింగ్ చేస్తుండగా.. ఓ చామనఛాయ అమ్మాయి పల్లీలు అమ్ముకుంటూ కనిపించింది. పేరు మలీషా ఖర్వా. వయసు పద్నాలుగు. బడికి వెళ్లకపోయినా.. గడగడా ఇంగ్లిష్ మాట్లాడగలదు. ఇంటికెళ్లి ఆమె వివరాలు తెలుసుకున్నాడు. ఆ నల్ల కలువను ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు రాబర్ట్ హోప్మన్.
‘ది ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్’ పేరుతో మలీషా కోసం ఫండింగ్ ప్రారంభించాడు. ఫ్యాషన్ ఫొటోలు తీయించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే.. హాలీవుడ్ అగ్రతారలు మొదలు.. టాలీవుడ్ హీరోయిన్ల వరకూ ఎంతో మంది ఆర్థికసాయం చేశారు. మలీషా ఇప్పుడు అంతర్జాతీయ సెలెబ్రిటీ.