ఆమె డెంటిస్ట్. దంతక్షయం ఉన్న పిల్లలే తన దగ్గరకు ఎక్కువగా వస్తుంటారు. సమస్యకు మూల కారణమేమిటని ఆరా తీసింది. చాక్లెట్లు, బిస్కెట్ల వల్లే దంతాలు పుచ్చిపోతున్నాయని తేలింది. చిరుతిళ్లలో చక్కెరే ప్రధాన శత్రువు. కాబట్టి, చక్కెర లేని కుకీస్ ద్వారా చిన్నారులకు ఓ పరిష్కారం చూపింది డాక్టర్ మినాల్ కబ్రా.
దంతక్షయం నుంచి పిల్లల్ని రక్షించాలనే ఉద్దేశంతో చక్కెరలేని కుకీస్ను తయారుచేస్తూ ఆంత్రప్రెన్యూర్ అవతారం ఎత్తింది డెంటిస్ట్ డాక్టర్ మినాల్ కబ్రా. మహారాష్ట్రలోని జాల్నాకు చెందిన మినాల్ లక్ష్యం.. దంతక్షయాన్ని నిర్మూలించడం ఒక్కటే కాదు, స్థానిక మహిళలకు ఉపాధి కల్పించడం కూడా. అందులో భాగంగానే చక్కెర ప్రస్తావన లేకుండానే, కుకీస్ తయారుచేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే, చక్కెర దంతాలకు ప్రధాన శత్రువు. చక్కెరను దూరం పెడితే దంతక్షయాన్నీ అధిగమించవచ్చు. అధ్యయనాల్లో మంచి ఫలితాలు రావడంతో, వాటిని పిల్లలకు
అందించాలని నిర్ణయించుకున్నది. ఆ ప్రయత్నంలో 2019లో ‘కివు’ అనే స్టార్టప్ను ప్రారంభించింది.
మునగాకు, అవిసె గింజలతో పాటు జొన్న, రాగి, రాజ్గిరా, ఓట్స్తో ఈ కుకీస్ను తయారు చేయిస్తున్నది. అంతేకాదు, తన సంస్థ ద్వారా సమీప గ్రామానికి చెందిన మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది. తానే ముడి పదార్థాలు కొనుగోలు చేసి గ్రామీణ మహిళలకు ఇస్తుంది. వాళ్లు తయారుచేసిన వాటిని తిరిగి కొనుగోలు చేసి, మార్కెట్లో తన బ్రాండ్తో విక్రయిస్తుంది. వీటిలో చక్కెరకు బదులు నాణ్యమైన బెల్లం కలుపుతారు. తయారీకి సౌరశక్తిని వినియోగిస్తారు. కివు కుకీస్ వార్షిక లాభం రూ.33 లక్షలు. ప్రస్తుతం 17 నగరాల్లో స్టోర్స్ ఉన్నాయి. త్వరలోనే బడిబడికీ వెళ్లి, పిల్లలకు దంత సమస్యలపై అవగాహన పెంచుతానని చెబుతున్నది మినాల్.