చాలామంది మహిళలు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లనే సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. ఆ మాట కొంతమేర నిజం కూడా. కానీ, మహిళల కోసమే అంతకంటే మెరుగైన ఓ పథకం ఉంది. దానిపేరు..‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’. దీనికి మరింత ప్రచారం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులనూ భాగస్వాములను చేసింది. గతంలో పోస్టాఫీసులోనే అందుబాటులో ఉండేది.
ఈ పథకం గరిష్ఠ కాలపరిమితి రెండేండ్లు. వడ్డీరేటు 7.5 శాతం. మూడునెలలకు ఒకసారి లెక్కిస్తారు కాబట్టి, 7.7. శాతం దాకా మన ఖాతాలో పడుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఎక్కువే. మార్చి 31, 2025 వరకూ ఈ పథకం అమలులో ఉంటుంది. సాక్షాత్తు కేంద్ర సర్కారే అమలు చేస్తున్నది కాబట్టి, నూటికి నూరుశాతం సురక్షితం కూడా. మైనర్ బాలికల తరఫున గార్డియన్ కూడా ఖాతాను ప్రారంభించవచ్చు. కాకపోతే, దీనికి ఆదాయపన్ను చట్టం కింద మినహాయింపు ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాక్షికంగా వెనక్కి తీసుకునే వెసులుబాటూ ఉంది. పొదుపు ఖాతాలో వృథాగా పడున్న నిధులను మళ్లిస్తే.. బాగానే గిట్టుబాటు అవుతుంది.