ఎంతటి సమర్థుడైన ఉద్యోగైనా పని భారం పెరిగితే అలసటకు గురవుతాడు. హాయిగా నిద్రించి విశ్రాంతి పొందుతాడు. కానీ, ఆందోళన జీవులు కలత నిద్ర కారణంగా మరింత అలసట కొనితెచ్చుకుంటారు. చిన్నపాటి ఉద్యోగ బాధ్యతలకే ఇలా తలమునకలైతే.. ఈ సృష్టి స్థితికార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్న భగవంతుడి పరిస్థితి ఏమిటి? ఆయన నిద్రపోతాడా? భగవానుడు రెప్పవాలిస్తే మరి ఈ సృష్టి సాగేదెలా?
దైవానికి నిద్రలేదు అనుకుంటే.. ఆలయాల్లో కొలువుదీరిన వేల్పులకు పవళింపు సేవలు ఎందుకు? సుప్రభాత గీతాలు ఎందుకు? భగవంతుడు నిద్రిస్తాడో, లేదోనన్న విషయాలు ఆయన్ను దర్శించినప్పుడే భక్తుడికి అవగతం అవుతాయి. దేవుడి తత్త్వం బోధపడితే ఆయన నిద్రించినా, మెలకువతో ఉన్నా, నిద్ర నటించినా తన కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూనే ఉంటాడన్న విషయం బోధపడుతుంది.
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడి మద్దతు కోరుతూ దుర్యోధనుడు స్వయంగా ద్వారకకు వెళ్తాడు. అతను మందిరంలోకి అడుగుపెట్టేసరికి శ్రీకృష్ణుడు ఆదమరచి నిద్రపోతున్నాడు. వేచి చూసే ధోరణిలో కృష్ణుడి తలగడ వైపు ఉన్న సింహాసనంలో కూర్చున్నాడు దుర్యోధనుడు. ఇంతలో యుద్ధంలో కృష్ణుడి మద్దతు కోరుతూ అర్జునుడూ అక్కడికి వచ్చాడు. పంకజనాభుడి పాదాల చెంత ఉన్న ఆసనంలో కూర్చున్నాడు. కాసేపటికి కృష్ణుడు నిద్ర లేచాడు. లేవడంతోనే పాదాల దగ్గరున్న అర్జునుణ్ని చూశాడు. కుశల ప్రశ్నలు వేశాడు. అటు తిరిగి దుర్యోధనుణ్ని కూడా చూశాడు. ఆప్యాయంగా పలకరించాడు.
ఆ ఇద్దరూ వచ్చిన కారణం కృష్ణుడికి తెలియనిది కాదు. యుద్ధంలో తన మద్దతు ఎవరికి ఇచ్చేది చెప్పకుండా.. ‘పదివేల మంది నారాయణాఖ్యులైన గోపాలురు ఒకవైపు, నేను ఒకవైపు. నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను. ఇప్పుడు ఏం కావాలో కోరుకోండి’ అన్నాడు కృష్ణుడు. తొలుత వచ్చింది తానే కాబట్టి ముందుగా తనకే అవకాశం ఇవ్వాలన్నాడు దుర్యోధనుడు. అయితే తాను ముందుగా చూసింది అర్జునుడిని కాబట్టి, అతను అడగటమే సముచితం అన్నాడు కృష్ణుడు. అర్జునుడు ‘కృష్ణా! ఆయుధం పట్టకున్నా, నువ్వు ఒక్కడివీ మా పక్షం ఉంటే అదే పదివేలు’ అన్నాడు. వచ్చిన అవకాశాన్ని అర్జునుడు చేజార్చుకున్నాడని దుర్యోధనుడు లోలోపల సంతోషిస్తూ యాదవ సేనలను తీసుకోవడానికి అంగీకరించాడు. ఈ ఇద్దరూ మద్దతు కోరి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు నిద్ర నటించాడు. ఎవరికి ఏం అనుగ్రహించాలో అవే ఇచ్చాడు. భగవానుడు నిద్ర నటించినా అది లోక రక్షణ కోసమే!