‘పలుకే బంగారమాయెనా..’ అని గోపయ్య కీర్తిస్తే రామయ్య కరిగిపోయాడు. అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీనివాసుడు ఓలలాడాడు. భగవంతుడికి పాటంటే ప్రాణం. ఆ పాటలు పాడేవారంటే ఇష్టం. అందుకే, తనను రాగాలపల్లకీలో మోసే భక్తులను విశేషంగా అనుగ్రహించాడు. భగవంతుడిని చేరుకునే దగ్గరి మార్గం సంకీర్తనం. నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన ఈ సాధనలో పులకించిన తిగుళ్ల బాలమ్మ తాను నమ్మిన దేవదేవుడిని స్మరిస్తూ అల్లుకున్న జావళీలు రసజ్ఞాన గుళికలే!
రాధమ్మ ఆరాధనే నల్లనయ్య వేణుగానామృతమై పల్లవించిందని భాగవతులు చెబుతారు. గోపాల బాలుడి బాల్యమంతా పాటల పూదోటలో అందమైన ఆటలా సాగింది. నల్లనివాడు ఎంత మారాం చేసినా.. చల్లని తల్లి యశోదమ్మ పల్లెత్తు మాట అనేదికాదట. ఆ మాతృ హృదయాన్ని ఆవిష్కరిస్తూ..
రేపల్లె వాడల్లో గోపాలుడు..
ఆ పల్లె వాసులకు ఆత్మీయుడు..
నవనీత చోరుడు శ్రీకృష్ణుడుఎంతో అల్లరి చేసినగానిపల్లెత్తు మాటనదు పరమాత్మను పల్లెత్తు మాటనదు పసిబాలుని..
తన పొత్తిళ్లలో ఉన్నవాడు పసిబాలుడు కాదు..
పరమాత్మ! ఆ సంగతి తెలియకున్నా… కన్నయ్య అల్లరిని తనివితీరా భరించేది యశోద. మరీ శ్రుతి మించినప్పుడు కాస్త కన్నెర్ర చేసేది. ఓసారి ఇలాగే తన చిట్టితండ్రి చెవి నులిమి నోరు తెరవమనగా.. పద్నాలుగు భువనాలను చూపి అచ్చెరువొందేలా చేశాడు. అందుకే, ఆ మాతృమూర్తి.. ఈ కృష్ణమూర్తిని పైపైన పసివాడిగా చూసినా, అంతరంగంలో మాత్రం ఆ రంగనాథుడిగానే భావించిందేమో! అందుకే, ఆ నందలాల లీలల్ని ఆనందంగానే ఆస్వాదించింది.
అందములకందము నీరూపముబంధముల కందని నీ రూపము..
అంటూ ఆ నందనందనుని రూపాన్ని..
నయనానందంగా వర్ణించే ఆశుగీతంలో..
మల్లెపొదలలో దాగిన రూపం మగువుల కోసం వెదికిన రూపంపిల్లనగ్రోవితో పిలిచిన రూపం నల్లనయ్య నీ రూపం..
ఈ పంక్తులు పోతన్న కైత పోతపోసుకున్నట్టుగా లేదూ! ‘ఆ నల్లనివాడు.. మీ పొదల మాటున లేడు గదమ్మా!’ అంటూ గోపికలు మల్లియలను అడిగిన దృశ్యాన్ని గుర్తుకు తెచ్చింది కదూ!
పసితనంలో వెన్నలు మూటగట్టిన టక్కరివాడు.. శౌరిగా ఎదిగిన తర్వాత మధురానగరిలో చూపిన లీలలు.. మందార మకరందాలు! క్షేత్రయ్య పదాల్లో అందంగా ఇమిడిపోయిన కృష్ణలీలలను ఈ పాటలో స్మరిస్తూ..
మధురానగరిలో చల్లనమ్మెడు మగువల చేరి మనసును దోచిచల్లకుండలకు చిల్లులు చేసినపల్లె దొరా నీ దరి చేర్చుమురాఅంటూ కృష్ణుడి తత్వాన్ని ఆర్తిగా అవగతం చేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది.
ఈ నల్లనిదేవుడు ఏ తీరుగా చూసినా అందంగానే కనిపిస్తాడు. అయితే ఆ నందనందనుడు అలిగినప్పుడు అత్యంత సుందరంగా కనువిందు చేస్తాడని గోపికలకు మాత్రమే తెలుసు! అందుకే, ఎప్పుడూ ఆ చిన్నికృష్ణుణ్ని ఆటపట్టిస్తూ, అలకబూనేలా చేసేవారట. ఆయనేం తక్కువ వాడా! తాను అలిగితే గానీ.. తనవారు సంతసించరని అలా బుంగమూతి పెట్టేవాడట. ఈ దృశ్యాన్ని ఎందరో కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. ఈ భావానందలహరి అదే లాహిరిలో సాగుతుంది..
అలిగిన వేళనే చూడాలి
అల్లరి కృష్ణుని అందాలు..
కన్నుల కాటుక నలుముకొనుచును
కస్తూరి తిలకము మోమున మెరయగ
కంకణములతో కౌస్తుభమణితో
కళకళలాడే చిన్ని కృష్ణుని… అలిగిన వేళనే…
ఇలా తన ఆశుకవితాధారతో పదుల సంఖ్యలో కీర్తనలు రాసి, పరంధాముడికి అంకితం చేశారు తిగుళ్ల బాలమ్మ. సాహితీ విలువలు, భక్తి పరిమళాలు ఇముడ్చుకున్న ఈ అక్షర జ్యోతులు బృందావన విహారికి అసలు సిసలు జోతలు.
…? అద్వైతా