ఓ భారతీయ పోలీస్ అధికారి.. దక్షిణాఫ్రికాకు వెళ్తాడు. డ్రగ్ మాఫియాను మట్టి కరిపిస్తాడు. కనిపించని నాలుగో సింహం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతాడు. ‘సింగం-2’ సినిమా కథ ఇది. ఓ మహిళా పోలీస్ అధికారి.. దక్షిణ సూడాన్ వెళ్లింది. విపత్కర పరిస్థితులను తట్టుకొనిసమర్థంగా విధులు నిర్వర్తించింది. భారతీయ మహిళల శక్తిని చాటింది. తెలంగాణ సివంగి, ఇన్స్పెక్టర్ పల్లె పద్మ నిజమైన కథ ఇది.
ఐక్య రాజ్య సమితి, శాంతి దళం (యూఎన్-పీస్ మిషన్) తరఫున దక్షిణ సూడాన్లో ఏడాదిపాటు సేవలందించారు హైదరాబాద్ బేగంపేట మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ పల్లె పద్మ. విధి నిర్వహణ పూర్తిచేసుకొని హైదరాబాద్కు తిరిగొచ్చిన సందర్భంగా ‘జిందగీ’ ఆమెను పలుకరించింది. ఆ విశేషాలు పద్మ మాటల్లోనే…
‘చక్కగా బీఎడ్ చేసింది. మా కూతురు పంతులమ్మ అవుతుంది’.. అని కలలుగన్నారు మా అమ్మానాన్న. ఓ రోజు వాళ్లతో ‘నాకు పోలీస్ కావాలని ఉంది’ అని మనసులోని మాట చెప్పాను. తొలుత ఇద్దరూ ఆశ్చర్యపోయారు. కానీ, నా ఇష్టాన్ని కాదనలేకపోయారు. నీకు నచ్చిందే చేయమన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మా ఊరు. వ్యవసాయ కుటుంబం. ఇంట్లో నేనే పెద్ద కూతురిని. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదువుకొన్నా. డిగ్రీ తర్వాత బీఎడ్ చేశాను. ఉపాధ్యాయురాలిగా స్థిరపడతానేమో అనుకున్నా. కానీ, పోలీస్ కావాలన్నది నా బలమైన ఆకాంక్ష. అమ్మానాన్న అంగీకరించడంతో ఎస్సై పోటీ పరీక్షలు రాసి ఎంపికయ్యాను. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రొబెషనరీ ఎస్సైగా విధుల్లో చేరిన రోజు ఎంతో గర్వంగా అనిపించింది. పోస్టింగ్ కూడా అక్కడే వచ్చింది. కొంతకాలానికి, ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించింది. కొన్నాళ్లు ఏసీబీలో చేశాను. తర్వాత ఖమ్మం, సిద్దిపేట ఠాణాలలో విధులు నిర్వర్తించాను. 2018లో తిరిగి హైదరాబాద్కు బదిలీ అయ్యింది. మారేడ్పల్లి పీఎస్ డీఐగా చేశాను. ప్రస్తుతం బేగంపేట ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. తోటి పోలీస్ ఆఫీసర్తోనే నా వివాహమైంది. ఇద్దరు పిల్లలు.
ఊహించని అవకాశం
గత ఏడాది ఓ అనూహ్యమైన అవకాశం నా తలుపు తట్టింది. ఐక్య రాజ్య సమితి శాంతిదళంలో (యూఎన్ పీస్ మిషన్) పనిచేసే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? సాధారణంగా ఐరాస తన సభ్య దేశాల పోలీసులను వివిధ దేశాల్లో సేవలు అందించడానికి ఆహ్వానిస్తుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండేండ్లకు ఒకసారి, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తుంది. నేనూ దరఖాస్తు చేశాను. ఎంపికైన వారిని ఢిల్లీకి పంపుతారు. అక్కడ మరో పరీక్ష ఉంటుంది. ప్రతిభ కనబరిచిన వారిని, రెండు విడతలుగా యూఎన్ మిషన్కు పంపుతారు. తుది వడపోతలో అర్హత సాధించిన వాళ్లంతా తమకు కేటాయించిన దేశంలో ఏడాదిపాటు పనిచేయాలి. అలా, గత ఫిబ్రవరిలో దక్షిణ సూడాన్లో విధులు నిర్వర్తించాను.
విపత్కర పరిస్థితుల్లో
దశాబ్దం క్రితం దక్షిణ సూడాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా అక్కడి పరిస్థితులు కుదుట పడలేదు. దొంగతనాలు, అరాచకాలు, దొమ్మీలు, అత్యాచారాలు.. ఎటు చూసినా భీతావహ వాతావరణమే. ఆ విపత్కర పరిస్థితులను చక్కదిద్దడానికి యూఎన్ తన వంతు ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మమ్మల్ని పంపింది. స్థానిక పోలీసులతో కలిసి మేం పనిచేసేవాళ్లం. అక్కడి పరిస్థితులు ఊహించిన దానికన్నా ఘోరంగా ఉన్నాయి. దక్షిణ సూడాన్ పోలీసు వ్యవస్థ అయితే, మరీ అధ్వానం. ఎంతోకొంత మార్పు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేశాం. పోలీసులు ఎలా వ్యవహరించాలి, ప్రజలతో ఎలా మెలగాలి, శాంతి భద్రతల పరిరక్షణకు ఎలా కృషిచేయాలి.. తదితర అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చాం. కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రయోజనాలను తెలియజేశాం. ఏడాదిలో ఎన్నో గ్రామాలు సందర్శించాం. ఆ ప్రయత్నంలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, తిరిగొస్తున్న సమయానికి అక్కడి పరిస్థితిలో సాను కూలమైన మార్పు కనిపించింది. ప్రజల కండ్లలో ఓ కొత్త వెలుగు. బరువెక్కిన గుండెలతో మాకు వీడ్కోలు పలికారు. ఓ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానన్న సంతృప్తితో స్వదేశానికి తిరిగొచ్చాను. సూడాన్ డ్యూటీ నా కెరీర్లో ఓ గొప్ప అనుభవం.
… గోవిందు రవికుమార్
పిల్లల గురించే భయమంతా
“మన దేశం నుంచి వెళ్లిన బృందంలో ఐదుగురు మహిళా పోలీసులు ఉన్నారు. మేమంతా అక్కడి భద్రతా బలగాలతో పనిచేయడంతోపాటు పోలీసు సంస్కరణలకు చేయూతనిచ్చాం. మా బృందం అక్కడికి వెళ్లిన తర్వాతే, కరోనా విలయం మొదలైంది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించాం. పిల్లలిద్దరినీ మా ఆయనే చూసుకున్నారు. ఆయనకూ కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఆ సమయంలో చాలా ఒత్తిడికి, ఆవేదనకు గురయ్యా. పిల్లల పరిస్థితిని తలచుకొని కంగారు పడ్డాను. పిల్లలను మా అత్తామామలు, నాన్న కంటికి రెప్పలా చూసుకున్నారు. అంతా క్షేమమని తెలిశాక మనసు కుదుట పడింది”
-పల్లె పద్మ