తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిగలపై ప్రేమను ఒలకబోసిన ఆ పార్టీ.. మాదిగ నాయకత్వాన్ని సంపూర్ణంగా వాడుకున్నది. రాష్ట్రంలో 80 లక్షలకు పైగా జనాభాతో అతిపెద్ద సామాజికవర్గమైన మాదిగలను కాంగ్రెస్ సర్కార్ అణగదొక్కాలని చూస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఆ తరహాలోనే వ్యవహరిస్తుండటం గమనార్హం.
కాంగ్రెస్ అంటేనే అగ్ర కులాలకు ప్రాతినిధ్యం ఎక్కువగా ఇచ్చే పార్టీ అనే విషయం అందరికీ తెలిసిందే. వారి కనుసన్నల్లో ఆ పార్టీ, కాంగ్రెస్ సర్కార్ నడుస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలే అందుకు నిదర్శనం. 37 కార్పొరేషన్లలో ఒకే ఒక్క కార్పొరేషన్కు మాదిగను చైర్మన్ను చేశారు. అది కూడా ఎస్సీ కార్పొరేషన్ కావడం గమనార్హం. సీఎం సొంత సామాజికవర్గానికి దాదాపుగా 14 కార్పొరేషన్లను కట్టబెట్టారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకొని పని చేసిన వారిని కాదని.. కొత్తగా పార్టీలో చేరినవారిని అందలం ఎక్కిస్తున్నారు. అందులోనూ మాల ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉండటం మాదిగలను తీవ్ర నైరాశ్యానికి గురి చేస్తున్నది. మాదిగల రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలన్న ఉద్దేశమే దీని వెనుక ఉన్నట్టు అనిపిస్తున్నది. బలమైన మాదిగ గొంతుకలను నొక్కడం ద్వారా కాంగ్రెస్ అంటేనే రెడ్లు, మాలలు అన్న పేరును సార్థకం చేయాలనే కుట్ర దీని వెనుక దాగి ఉన్నదనే అనుమానాలు కలుగుతున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా మాల సామాజికవర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన సోదరుడు మల్లు రవికి నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ను కాంగ్రెస్ కేటాయించింది. వివేక్ వెంకటస్వామి, అతని సోదరుడు వినోద్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అది సరిపోదన్నట్టు.. వివేక్ తనయుడు గడ్డం వంశీకి ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన పెద్దపల్లి టికెట్ ఖరారు చేశారు. ఇలా ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురికి రాజకీయ అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణచివేస్తున్నది. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో కాంగ్రెస్ కనీసం ఒక్కటైనా మాదిగలకు కేటాయించలేదు. దీన్నిబట్టే ఆ పార్టీ మాదిగలపై ఎంతలా కక్ష పెంచుకున్నదో అర్థమవుతున్నది. మాదిగల అండతోనే తాము గెలిచామని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరం. వర్గీకరణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చి చివరికి అసలు మాదిగల ప్రాతినిధ్యమే లేకుండా చేయాలనుకోవడం సరికాదు.
సామాజిక చైతన్యం కలిగిన మాదిగలు చట్టసభలకు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారనే అనుమానాలున్నాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సామాజిక కూర్పును పాటించింది. 12 జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టింది. పార్లమెంటులో బీసీల గొంతు వినిపించేందుకు కేసీఆర్ మార్గం సుగమం చేశారు. అదీకాకుండా మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండగా.. వాటిలో రెండింటిని మాదిగలకు కేటాయించారు.
వాస్తవానికి ఢిల్లీ అధిష్ఠానం వద్ద మాదిగల ఆవేదనను వెలిబుచ్చేవారు కాంగ్రెస్లో లేకపోవడమూ దీనికి ఓ కారణమై ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల ఇదే వైఖరిని అవలంబిస్తే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో మాదిగలకు సరైన అవకాశాలు దక్కలేదని ఆరోపణలు చేసే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు స్పందించాలి. కాంగ్రెస్ పార్టీ అగ్రకులాల వారికి అధిక ప్రాధాన్యం ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కార్పొరేషన్ పదవులతో పాటు పార్లమెంట్ స్థానాలు ఇవ్వకపోయినా కనీసం కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో మాదిగ అభ్యర్థిని ఉంచుతారని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. సీట్ల సంగతి దేవుడెరుగు. మాదిగలను కనీసం పార్టీలో కూడా ఉండనివ్వడం లేదు. మాదిగలను అణగదొక్కే చర్యలకు తెరలేపిన ఆ పార్టీ 34 ఏండ్ల పాటు కాంగ్రెస్ కోసం పనిచేసిన బక్క జడ్సన్ను కుట్రలో భాగంగానే బహిష్కరించింది.
రెండు జాతీయ పార్టీల లక్ష్యం ఒక్కటే. ఎన్నికల్లో గెలవడం. దానికోసం ఆ పార్టీల నాయకులు ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. నీతిమాటలు మాట్లాడుతూనే అనైతిక రా జకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఢిల్లీలోని అధిష్ఠానం ఆడించినట్టు ఆటాడేవారి వల్ల తెలంగాణకు ప్రయోజనం శూన్యం. తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్సే. ఇప్పటికే ఒకసారి నష్టపోయాం. మరోసారి మోసపోతే గోసపడతాం. జాతీయ పార్టీల కుట్రలను తిప్పికొట్టి.. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దాం.
– సంపత్ గడ్డం
78933 03516