Gajendra Singh Shekhawat | హైదరాబాద్, ఏప్రిల్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రాజ్యాంగం భగవద్గీతేమీ కాదని, జాతి ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటని కేంద్ర జల్శక్తి మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్ ‘ది ప్రింట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘భారత రాజ్యాంగం భగవద్గీత ఏమీ కాదు. గీతలో శ్లోకాలను మార్చలేం. అయితే, రాజ్యాంగంలో శ్లోకాలు లేవు కదా. జాతి ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే తప్పేంటి? రాజ్యాంగానికి సవరణలను గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు కూడా రాజ్యాంగ సవరణతోనే సాధ్యమైంది. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే ఆ సవరణలు చేశాం’ అని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 400కు పైగా సీట్లను ఇచ్చి గెలిపిస్తే, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ నేతలు అనంత్కుమార్ హెగ్డే, లల్లూ సింగ్, జ్యోతి మిర్దా, అరుణ్ గోవిల్ వ్యాఖ్యానించడం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరగానే, వారిపై కేసులు మాయమవుతున్నాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ‘ది ప్రింట్’ ప్రతినిధి ప్రశ్నించగా దానిపై కూడా షెకావత్ స్పందించారు. ‘బీజేపీ గంగానది లాంటిది. గంగ పిల్లకాలువలను తనలో కలుపుకొన్నట్టే, మా పార్టీలో చేరాలనుకొనే అందర్నీ మేం తీసుకొంటాం. గంగలో చేరని పిల్ల కాలువ సూర్యతాపాన్ని భరించలేక చివరకు ఎండిపోవాల్సిందే’ అని పేర్కొన్నారు.