ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వ్యవస్థకు రక్షణ కవచం. ప్రజల అవస్థకు పరిష్కార మార్గం. ఇక, పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు.. చిటారు కొమ్మన మిఠాయి స్వప్నం. అప్పటికి గురితప్పినా.. నిర్ణీత సర్వీసు పూర్తిచేసిన సమర్థులైన గ్రూప్ వన్ అధికారులనూ ఆ హోదా వరిస్తుంది. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం పదిమంది అధికారులకు ఆ అవకాశం ఇచ్చింది. అందులో అర్ధభాగం మహిళలే. పేరు పక్కన మూడక్షరాల గౌరవాన్ని జోడించుకున్న ఐదుగురు మహిళల అంతరంగం..
ఒక సాధారణ పౌరుడు న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడాలి. అదే సమర్థుడైన అధికారి చిటికెలో ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అలాంటి కష్టమే ఓ నాన్నను ఇబ్బంది పెట్టింది. ఆయన తన బిడ్డను ఆఫీసరుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాడు. ఇదంతా ఆ కూతురు కాత్యాయని మాటల్లోనే..
“నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న లెక్చరర్. అమ్మ గృహిణి. మేం ఇద్దరు పిల్లలం. మిడిల్క్లాస్ కష్టనష్టాల మధ్యే పెరిగాను. చిన్నప్పుడు మా భూమికి సంబంధించి ఒక వివాదం ఉండేది. న్యాయం కోసం నాన్న దాదాపు పదమూడేండ్లు ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగారు. ఆ తర్వాత మా ప్రాంతానికి వచ్చిన జె.పి.సింగ్ అనే కలెక్టర్ ఆ వివాదాన్ని సర్దుబాటు చేశారు. దీనివల్ల ఏడెనిమిది కుటుంబాలకు మేలు జరిగింది. అప్పుడే, ‘మనలాంటి సామాన్య జనానికి సేవచేయడానికైనా నువ్వు ప్రభుత్వంలో పెద్ద ఆఫీసరు కావాలి తల్లీ…’ అన్నారు నాన్న. ఆ సంఘటన నాలో ఉత్సాహాన్ని నింపింది. సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నా. గ్రూప్స్ కూడా రాశాను. అలా 1999లో గ్రూప్ 1 ఆఫీసరుగా ఎంపికయ్యాను. రామాయంపేటలో ఎంపీడీఓగా కెరీర్ ప్రారంభించాను. ఏ స్థాయిలో ఉన్నా సాధారణ జనంవైపే నిలబడ్డాను. ఇప్పుడు ఐఏఎస్ హోదా అందుకోవడం అంటే నాన్న కల నెరవేర్చినట్టే. అందుకే సంతోషంగా ఉంది.”
పుట్టింది బీడీ కార్మికుల కుటుంబంలో. చదివింది ప్రభుత్వ విద్యాసంస్థల్లో. పెరిగింది ముగ్గురు ఆడపిల్లల మధ్య. అయితేనేం, ఆకాశమే హద్దుగా భావించింది. ఆ ఆత్మవిశ్వాసం ముందు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు తలవంచాయి. తాజాగా ఐఏఎస్ హోదా అందివచ్చింది. జల్ద అరుణశ్రీ కథ చాలా మంది విజేతల్లాగే ఓ సాధారణ గ్రామం నుంచి మొదలైంది. ఆ మలుపులన్నీ ఆమె మాటల్లోనే…
“మాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల. అమ్మ బీడీ కార్మికురాలు. నాన్న బీడీ టేకేదార్. మేం ముగ్గురు ఆడపిల్లలం. నాన్న పనిలో నేను సహకరించేదాన్ని. దిగువ మధ్యతరగతి కుటుంబమే అయినా, ఆడపిల్లకు చదువు ఎంతో ముఖ్యమని భావించేది అమ్మ. మమ్మల్ని చాలా ప్రోత్సహించేది కూడా. మేమూ కష్టపడి చదివాం. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకున్నా. తొలి నుంచీ మెరిట్ స్టూడెంట్నే. డిగ్రీ తర్వాత ఎంకాం, బీఎడ్ చేశాను. ‘నీకు ఏం చదవాలని పిస్తే అది చదువు బిడ్డా’ అని ప్రోత్సహించేది అమ్మ. నాన్న కూడా ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదు. బీఎడ్ పూర్తి కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. తుది ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టింది. ఆలోపు గ్రూప్-2కు ప్రిపేర్ అవుదామని హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్నాను. పరీక్షలోపే టీచర్ ఉద్యోగం వచ్చింది. వెళ్లి చేరాను. అయితే, గ్రూప్స్ ద్వారా అయితే మంచి హోదాలో పనిచేయవచ్చనే ఆశతో టీచర్ ఉద్యోగానికి సెలవు పెట్టి గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను. తొలి ప్రయత్నంలోనే ఎంపికయ్యాను. దీంతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. గ్రూప్-1 కూడా సాధించగలననే ధీమా వచ్చింది. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగానికి సెలవుపెట్టి గ్రూప్-1 మీద ఫోకస్ చేశాను. కొలువు సాధించాను. వరంగల్లో డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్ తీసుకుని.. నిర్మల్ ఆర్డీవోగా పనిచేశాను. డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించాను. అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) హోదాలోనూ వ్యవహరించాను. ఏ పనినైనా నూటికి నూరుశాతం అంకితభావంతో, పూర్తి నిబద్ధతతో చేయడం నా స్వభావం. మన సేవలు జనానికి ఉపయోగపడాలన్నదే నా తపన. ఐఏఎస్ హోదా నా బాధ్యతను మరింత పెంచింది.”
ఓ హెలికాప్టర్ ప్రమాదం ఆమె ప్రపంచాన్ని తలకిందులు చేసింది. పోలీసు అధికారిగా పనిచేస్తున్న భర్త.. ఆ దుర్ఘటనలో మరణించారు. దీంతో తానే తల్లిగా, తండ్రిగా పిల్లల్ని పెంచారు. కారుణ్య నియామకం కింద లభించిన ప్రభుత్వ ఉద్యోగాన్నీ సమర్థంగా నిర్వర్తించానని అంటున్నారు నిర్మల.
“దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు.. ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న మావారు (ఏఎస్సీ వెస్లీ) కూడా ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి మాకు ఇద్దరు పిల్లలు. ఒకరి వయసు ఆరు, ఒకరి వయసు ఎనిమిది. ఆ ప్రమాదం నా జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. కారుణ్య నియామకం కింద లా అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ చీఫ్ కమిషనర్గా ఉద్యోగం ఇచ్చారు. నిబద్ధత విషయంలో మా ఆయనే నాకు స్ఫూర్తి. ప్రస్తుతం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నా. క్రిస్టియన్ భవన్ నిర్మాణం, శ్మశాన వాటిక కోసం హైదరాబాద్లో 42 ఎకరాల భూమి కేటాయింపు.. నాకు సంతృప్తినిచ్చిన విషయాలు. తపన ఉంటే.. మహిళలు ఏ రంగంలో అయినా తప్పక విజయం సాధిస్తారని నా నమ్మకం.”
పన్నుల వసూళ్లు.. ప్రభుత్వానికి ఆదాయం, సంక్షేమానికి ఆధారం. ఆ వ్యవస్థ మీద పూర్తి పట్టు సాధించి నిబద్ధత కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన హరిత కల్లెపు. ఆ ప్రస్థానమంతా ఆమె మాటల్లోనే…
“మాది నిజామాబాద్ జిల్లా బాద్గుణ. నిజామాబాద్లోని నిర్మల హృదయాలయ స్కూల్లో చదువుకున్నా. నాన్న డాక్టర్ కావడంతో తొలుత అటువైపు వెళ్లాలనుకున్నా. కుదరలేదు. బీఎస్సీ చదివాను. నన్ను పెద్ద ఆఫీసరుగా చూడాలని నాన్న కోరిక. ఆ వైపుగా ప్రోత్సహించేవారు. సివిల్స్తో పాటు వివిధ పోటీ పరీక్షలు రాశాను. మొదట ఎల్ఐసీలో ఉద్యోగం వచ్చింది. కానీ చేరలేదు. తర్వాత ఇన్కమ్టాక్స్ ఇన్స్పెక్టర్గా అవకాశం వచ్చింది. వెంటనే చేరిపోయాను. తర్వాత గ్రూప్-1 పాసయ్యాను. పరీక్ష రాసేటప్పటికి నేను గర్భిణిని. నాన్నలాగే మావారూ నన్ను ప్రోత్సహించేవారు. కాబట్టే, విజయం సాధించగలిగాను. తొలుత జడ్చర్ల కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సీటీఓ)గా పోస్టింగ్ వచ్చింది. తర్వాత హైదరాబాద్లో పలు చోట్ల పనిచేశాను. రాణిగంజ్ ప్రాంతంలో చేసేప్పుడు.. నా పరిధిలో స్టీల్ డీలర్షిప్లు నడిచేవి. అక్కడ నాదైన శైలిలో పన్నులు వసూలు చేశాను. ముందుగా, యజమానులను చర్చకు పిలిచేదాన్ని. పన్ను కట్టాల్సిన బాధ్యతను గుర్తుచేసేదాన్ని. నొప్పించకుండా ఒప్పించేదాన్ని. అంతేకాదు,వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) విధివిధానాల రూపకల్పన బృందంలో నేను సభ్యురాలిని. నాలుగు దేశాల చట్టాలను బేరీజు వేసి మరీ రూపొందించాం. ప్రస్తుతం హైదరాబాద్లో స్టేట్ ట్యాక్స్ డిపార్టుమెంటులో అదనపు కమిషనర్గా పనిచేస్తున్నాను. ఇటీవలే లా పూర్తిచేశాను. మనం చేస్తున్న పని మీద పూర్తి అవగాహన సాధించినప్పుడే, విజయం వరిస్తుంది.”
చదువు ఇంజినీరింగ్. కొలువు సాఫ్ట్వేర్. కానీ మనసు ప్రజాసేవ వైపు మొగ్గింది. పట్టుబట్టి ప్రభుత్వోద్యోగిగా మారారు. తన ఐఏఎస్ కల ఇలా నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందంటారు ప్రియాంక..
“చిన్నప్పటి నుంచీ ప్రజాసేవకు అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉండేది. నాన్న స్టేట్ బ్యాంక్లో మేనేజర్. మాది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు. అక్కడే ఇంటర్ చదివాను. ఎన్ఐటీ వరంగల్లో సివిల్ ఇంజినీరింగ్ చేశాను. అమెరికా వెళ్లి గోల్డ్మాన్ శాక్స్ సంస్థలో కొన్నాళ్లు పనిచేశాను. ఏం చేస్తున్నా నా మనసు సివిల్స్ వైపే ఉండేది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి కోచింగ్ తీసుకున్నా. అప్పుడే, గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. పట్టుదలతో రాశాను. విజయం సాధించాను. తొలి పోస్టింగ్ అమలాపురం ఆర్డీవోగా. పెద్దపెద్ద తుఫాన్లు, గ్యాస్పైప్ లీకేజీలు వంటి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నాను. ప్రజలకు పునరావాసం కల్పించేందుకు పగలూరాత్రీ శ్రమించాను. ఉట్నూరులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. ఇవన్నీ వృత్తి జీవితంలో సంతృప్తినిచ్చిన విషయాలు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా పరిషత్ సీయీవోగా పనిచేస్తున్నా. అప్పట్లో పోటీ పరీక్షలకు పుస్తకాలే ఆధారం. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు, ఎంత శ్రమించామన్నదే ముఖ్యం. తొలుత అనుకున్న ఐఏఎస్ క్యాడర్ను ఈ రకంగా అందుకున్నందుకు సంతోషంగా ఉంది.”
-లక్ష్మీహరిత ఇంద్రగంటి