పిల్లలు ఉన్న ఇండ్లలో బొమ్మలూ ఉంటాయి. కొవిడ్ లాక్డౌన్ సమయంలో బొమ్మల అమ్మకాలు 21.4 శాతం పెరిగాయి. కానీ, ఇక్కడో సమస్య ఉంది. పాత ప్లాస్టిక్ బొమ్మల వల్ల పర్యావరణ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ మూలన పేరుకుపోవడం వల్ల పిల్లలకు శ్వాసకోశ సమస్యలు, చర్మ రుగ్మతలూ రావచ్చు. దీనికో పరిష్కారం ఉంది. పిల్లల బొమ్మల బుట్టలో కొత్త బొమ్మ చేరిన ప్రతిసారీ.. అందులోంచి ఓ పాతబొమ్మను బయటికి తీయడం మంచి పద్ధతి. ఒక సమయంలో ఒకే బొమ్మతో ఆడుకోవడం వల్ల ఏకాగ్రత మెరుగవుతుంది. ఆ బొమ్మ పట్ల బాధ్యతగా ఉంటారు. మరీ ఎక్కువ బొమ్మలు ఉన్నప్పుడు దేనికీ సమయం కేటాయించలేరు. బొమ్మలను మూడు రకాలుగా వర్గీకరించుకోవచ్చు.. పిల్లలు ఆడుకోవాల్సినవి, షోకేస్లో భద్రపరచుకోవాల్సినవి, ఎవరికైనా ఇవ్వాల్సినవి. దానంగా ఇచ్చేయాలనుకుంటే ‘డొనేట్ యువర్ టాయ్స్’ వంటి సంస్థల ప్రతినిధులు ఇంటికొచ్చి మరీ మన బొమ్మలను తీసుకెళ్తారు. ఏ బొమ్మ అయినా పిల్లలకు ఆనందాన్ని ఇవ్వాలి, ఎంతోకొంత ఆలోచనను ఇవ్వాలి, జీవన నైపుణ్యాన్నీ బోధించాలి. రసాయనాల జాడలు, హానికారక పదార్థాలు లేని బొమ్మలే సురక్షితం.