ఎముకలు-గుండె.. ఈ రెండిటి ఆరోగ్యం వేర్వేరు అంశాలుగానే చూస్తారు. కానీ, మెనోపాజ్ దాటిన మహిళల్లో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటే.. ఎముకలు విరిగే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ట్యూలేన్ విశ్వవిద్యాలయం జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయాన్ని తేల్చారు. ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ – అమెరికాస్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం.. ‘విమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్’ నుంచి 21,000 మందికి పైగా మహిళల హెల్త్ డేటాను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను కనుగొన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. గుండె జబ్బులు-ఎముకల సాంద్రత మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని బయటపెట్టారు. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల.. మహిళల్లో గుండె సమస్యలు, ఎముకల బలహీనత రెండూ పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
ధమనుల గోడలు గట్టిపడటం వంటి సమస్యలు ఉన్నవారిలో ఎముకల సాంద్రత త్వరగా తగ్గుతుందని వెల్లడించారు. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు తమ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ వివరించారు. ఎముకల పటుత్వం కోసం క్యాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. నడక, వెయిట్ బేరింగ్ లాంటి వ్యాయామాలు గుండెతోపాటు ఎముకల ఆరోగ్యానికీ భరోసా ఇస్తాయి. కాబట్టి, వీటిని క్రమం తప్పకుండా చేస్తుండాలి. గుండె సంబంధిత పరీక్షలతో పాటు, ఎముకల సాంద్రతను కొలిచే పరీక్షలను రెగ్యులర్గా చేయించుకోవడం మంచిది. ఆహారంలో సోడియం తగ్గించి, పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంపై దృష్టి పెడితే.. పరోక్షంగా ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.