దాదాపు నాలుగేండ్ల క్రితం.. సందీప్ బక్షి ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీయీవో)గా బాధ్యతలు స్వీకరించే సమయానికి పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. అతని కోసం సవాళ్లు, సమస్యలు ఎదురుచూస్తున్నాయి. వాటి నుంచి బయటపడ టానికి బక్షి మేనేజ్మెంట్ గురువుల సలహాలనో, ఐఐఎమ్ పట్టభద్రుల సహకారాన్నో తీసుకోలేదు. చిన్నప్పుడు నానమ్మ బోధించిన విలువల సూత్రాలను యథాతథంగా అమలు చేశారు. ఆ వ్యూహం ఫలించింది. ఇప్పుడు ఐసీఐసీఐ దేశంలోనే రెండో అత్యంత విలువైన బ్యాంక్. అంతర్జాతీయ మార్కెట్ దిగ్గజాలు సైతం ఆ బ్యాంకు షేర్లను కొనమనే సూచిస్తారు.
‘మనం ఏ పని చేసినా నలుగురూ మెచ్చుకోవాలి. సంక్లిష్టమైన వ్యవహారాలు వద్దు. కుప్పకూలిపోయేంత రిస్క్ తీసుకోవద్దు. ఏం చేయాలి అన్నదే కాదు.. ఏం చేయకూడదు అనేదీ ముఖ్యమే. నా దగ్గరికి వచ్చేవాళ్లకు ఎలా సాయపడగలను అనే కోణంలోనే ఆలోచించు. వాళ్లను ఎలా వాడుకోవాలనే దురాలోచన వద్దు. భేద్ భావ్ మత్ కరో.. ఆడ, మగ తేడాలొద్దు. సంపన్న, పేద వివక్ష చూపొద్దు. అందర్నీ దగ్గరికి తీసుకో..’ ఇవే బక్షీసాబ్కు వాళ్ల నానమ్మ బోధించిన సూత్రాలు. వాటినే బ్యాంకులోనూ అమలు చేశారు. మన పెద్దలు ముఖ్యంగా .. అమ్మమ్మలు, నానమ్మలు క్యాంపస్లో చదువుకోక పోవచ్చు. కానీ వాళ్లలో వ్యవహార జ్ఞానం పుష్కలం. ముందుచూపు అపారం. లౌక్యం అంతర్లీనం. ఇవన్నీ కుటుంబాన్ని మంచివైపు తీసుకెళ్లడమే కాదు, వ్యాపార సంస్థలను విజయాలవైపు నడిపిస్తాయి. పెద్దలు నిలువెత్తు విశ్వవిద్యాలయాలు.