ఆరోగ్యానికి, ఆహారానికి విడదీయరాని అనుబంధం ఉంది. రోజుకు ఎన్నిసార్లు, ఏఏ సమయాల్లో ఎంత తింటున్నాం అన్నదాన్ని బట్టి మనిషిని యోగిగా, భోగిగా, రోగిగా వర్గీకరిస్తున్నది ఆయుర్వేదం. ఇంతకీ మీరు ఏ విభాగం కిందికి వస్తారు?
నాలుగు భోజనాలు
బక్కపల్చని మనుషులు దృఢంగా ఉన్నవారు.. తమ ఆహారాన్ని నాలుగు భాగాలుగా విభజించుకోవచ్చు. అంటే, నిక్షేపంగా రోజులో నాలుగుసార్లు ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే బాగా ఆకలివేసినప్పుడు మాత్రమే తినాలి. 80 శాతం మాత్రమే పొట్ట నిండేలా చూసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత ఏమీ తీసుకోకూడదు. నిద్రకు 2-3 గంటల ముందే భోజనం పూర్తి కావాలి. రాత్రిపూట మరీ ఆకలిగా అనిపిస్తే పాలు తాగొచ్చు. పాలలో కాస్త పసుపు కలిపితే రోగ నిరోధకత పెరుగుతుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారు ఈ డైట్
ఫాలో కావచ్చు.
రెండుసార్లు
రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేయడం అన్నది మంచి పద్ధతి. దీనివల్ల రెండు భోజనాల మధ్య కనీసం 6 గంటల విరామం ఉంటుంది కాబట్టి, ప్రతి ముద్దా పూర్తిగా ఒంటబడుతుంది. అందుకే ఇలాంటి వాళ్లను ‘భోగి’ అని పిలుస్తుంది వైద్య శాస్త్రం.
ఒక్కసారి..
మనిషి జీవక్రియ అత్యున్నత స్థాయిలో ఉంటే, అతను అత్యంత ఆరోగ్యవంతుడిగా ఉన్నట్టు. రోజుకు ఒక్కసారి భోజనం చేసినా సరిపోతుంది. అంటే వీళ్లు రోజుకు దాదాపు 23 గంటలు ఉపవాసం ఉంటారన్నమాట. ఇలాంటి స్థితిని పొందిన వ్యక్తిని ‘యోగి’గా పిలుస్తారు. ఈ తరహా ఆహార నియమాన్ని పాటించేవారు ఆధ్మాత్మిక సాధనలో ఉన్నత స్థితిలో ఉంటారనీ, శరీరం తేజోమంతంగా ఉంటుందనీ ఆయర్వేదం చెబుతుంది.
మూడో ‘సారీ’
సాధారణ శరీర స్వభావం ఉన్నవారు రోజుకు మూడుసార్లు ఆహారం తీసుకోవచ్చు. ఓ మోస్తరుగా అల్పాహారం, కడుపునిండా మధ్యాహ్న భోజనం, తేలికపాటి రాత్రి భోజనం.. ఇంతవరకూ ఫర్వాలేదు. అయితే రాత్రి ఆహారం సూర్యాస్తమయానికి ముందే పూర్తి కావాలి. అంటే, రాత్రి-ఉదయం ఆహారాల మధ్య 14-16 గంటల వ్యవధి ఉండాలి. ఒకసారి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమై, పోషకాల శోషణ జరగకముందే మళ్లీ తినడం వల్ల ఒంట్లో వ్యర్థాలు పేరుకుపోయి వ్యాధుల బారిన పడే ఆస్కారం ఎక్కువ.