ఆధునిక జీవితంలో మలబద్ధకం తీవ్ర సమస్యగా మారింది. పీచు పదార్థాలు లేని ఆహారమే దీనికి ప్రధాన కారణం. శారీరక శ్రమ తగ్గిపోవడం, కొన్ని రకాల ఔషధాల ప్రభావాన్నీ కాదనలేం. మలబద్ధకాన్ని దూరం చేసుకోవడానికి ఈ ఐదూ ఉపకరిస్తాయి..
అరటిపువ్వు
ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో కరిగిపోయే, కరిగిపోని ఫైబర్.. రెండూ ఉంటాయి. కరిగిపోయే ఫైబర్ ఒక జెల్లా రూపొంది జీఐ ట్రాక్ట్ (నోటి నుంచి మలద్వారం వరకు ఉండే నాళం లాంటి నిర్మాణం) గుండా.. ఆహారంలోని వ్యర్థాలు సులువుగా వెళ్లిపోయేలా చేస్తుంది. ఇక కరిగిపోని ఫైబర్ వ్యర్థ పదార్థాలకు మరింత మొత్తాన్ని చేరుస్తుంది. అందువల్ల అరటిపూలు అజీర్ణ సమస్య, దీర్ఘకాలిక మలబద్ధకం, పెద్దపేగు సమస్యకు కారణమయ్యే వ్యాధి- ఇరిటెబుల్ బోవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉన్నవారికి ఎంతో మేలుచేస్తాయి. అరటిపూలను కూర/ సలాడ్/ పచ్చడి/ సాంబారు రూపంలో తీసుకోవచ్చు. అరటిపూలు దొరక్కపోతే, కనీసం అరటిపండు తిన్నా మంచిదే.
నానబెట్టిన నల్ల ఎండుద్రాక్షలు
ఇవి సహజ విరేచనకారులు. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపి.. మలబద్ధకాన్ని నివారిస్తాయి. వీటిలో విటమిన్- బి, సి సమృద్ధిగా ఉంటుంది. ఎండుద్రాక్షలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి కూడా.
ఆకుకూరలు
బ్రకోలి, తోటకూర, చేమకూర, పాలకూర లాంటి పచ్చటి ఆకుకూరలు ఫైబర్తో సమృద్ధమై ఉంటాయి. అంతేకాదు.. ఇవి ఫోలేట్, విటమిన్-సి, కెలను శరీరానికి అందిస్తాయి. ఒక కప్పు ఉడికించిన పాలకూరలో 4.7 గ్రాములు, ఒక కప్పు వండిన బ్రకోలీలో 2.4 గ్రాములు.. ఫైబర్ ఉంటుంది. ఇవి పేగుల నుంచి వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లిపోయేలా చేస్తాయి. కాబట్టి, కనీసం రెండు రోజులకు ఓసారైనా ఆకుకూరలను తీసుకోవాల్సిందే.
ముల్లంగి
దీనిలో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. కాబట్టి, పేగుల ఆరోగ్యానికి ఇవి ఎంతో మంచి చేస్తాయి. సలాడ్లు, సాంబారు, పప్పులో ముల్లంగిని వీలైనంత తరచుగా వాడుకోవాలి.
కదలిక ముఖ్యం
ఓ అరగంట పాటు కూర్చునే ఉంటే.. ఆ తర్వాత, కనీసం రెండు నిమిషాలైనా నిల్చోవాలి. రోజుకు ఒక పూటైనా పద్మాసనంలో భోజనం చేయాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, తగిన మోతాదులో నీళ్లు తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వీటివల్ల పేగులు క్రమబద్ధం అవుతాయి. కదలికలు మెరుగుపడతాయి.