శక్తి పుత్రుడైన గణపతి రూపం అత్యంత శక్తిమంతమైంది. ఆయన రూపాన్ని చూస్తున్నంత సేపూ.. మనలో ధనాత్మక శక్తి ఆవహిస్తుంది. ఓంకారం విన్నప్పుడు పొందే అనుభూతి, గణపతి స్వరూపాన్ని చూసినప్పుడు కలుగుతుంది. దీనికి నిదర్శనంగా విఘ్నేశ్వరుడి రూపం ప్రణవాక్షరంలో ఇమిడిపోతుంది. విఘ్నరాజు మృత్తికలో ముద్దుగా కనిపిస్తాడు. రాతిశిల్పంగా రమణీయంగా సాక్షాత్కరిస్తాడు. మరకతంలో (ఎమరాల్డ్లో) మనోహరంగా దర్శనమిస్తాడు. ఇలాంటి మరకత వినాయకుడి ఆలయం సికింద్రాబాద్ సమీపంలోని కానాజీగూడలో కొలువై ఉంది. శ్రీలక్ష్మీ గణపతిగా పూజలు అందుకుంటున్న వినాయకుడు భక్తులపాలిట కొంగుబంగారంగా అలరారుతున్నాడు.
ప్రముఖ వాస్తు, ఆగమశాస్త్ర పండితుడు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి నిర్మింపజేసిన ఈ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్నది. 2016 సంవత్సరంలో చైత్ర కృష్ణ పంచమి నాడు మరకత లక్ష్మీగణపతి ఆలయ ప్రతిష్ఠోత్సవం జరిగింది. పది హస్తాలతో కొలువుదీరిన వినాయకుడు ఖడ్గం, చక్రం, అంకుశం, పాశం, గద, జామపండు, పద్మం, ఔషధ పాత్ర, చెరకుగడ ధరించి దర్శనమిస్తాడు. దంతం కొమ్ము ధరించి వరద హస్తాన్ని చూపుతూ, కుడివైపు తిరిగిన తొండంలో రత్నకలశాన్ని కలిగి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. స్వామి ఎడమ తొడపై కలువ పుష్పం ధరించిన లక్ష్మీదేవి కనిపిస్తుంది. మహాశక్తులన్నిటినీ తనలో ఇముడ్చుకున్న మరకత మూర్తి దర్శనంతో సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఆలయ షష్ఠమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 18 నుంచి 21 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మొదటిరోజైన సోమవారం అంకురార్పణ, ధ్వజారోహణం, మంగళవారం కలశస్థాపన, గోపూజ, చతురావృత తర్పణాలు, యాగశాల ప్రవేశం తదితర క్రతువులు నిర్వహించనున్నారు. బుధవారం స్వామివారికి విశేష అభిషేకం, ప్రత్యేక హోమాలు చేయనున్నారు. చివరిరోజైన గురువారం మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, శిఖరాభిషేకం, శాంతి కల్యాణం జరుగుతాయి. వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తారు.
నిత్యాన్నదానం
‘మానవ సేవే మాధవ సేవ’ అన్న పెద్దల మాటను అనుసరించి ఆలయం తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండేండ్ల కిందట కరోనా లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు నిత్యాన్నదానం ప్రారంభించారు. గాంధీ దవాఖాన, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ప్రతిరోజూ సుమారు 300 మందికి అన్నదానం చేశారు. నాటి నుంచి నేటి వరకు సికింద్రాబాద్ చిలకలగూడా చౌరస్తా దగ్గర నిత్యం సుమారు 500 మంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు.