నమస్తే శరణ్యే శివేసానుకమ్పే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే
నమస్తే జగద్వంద్య పాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే॥
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. ఈ రూపంలో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయ కలిగిన మోముతో దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించిన అమ్మ శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది. ఈ తల్లి సకల శత్రుబాధలనూ నివారిస్తుంది. ఆకర్షణ శక్తి, ఆరోగ్య ప్రదాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన దుర్గను ఆరాధిస్తే సకల విజయాలూ లభిస్తాయి. స్వర్ణ కవచం మంత్ర బీజాక్షర సమన్వితమై ఉంటుంది. అందుకే, స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఆరాధన వల్ల మంత్రశక్తి సిద్ధిస్తుంది. ఈ రోజు అమ్మవారిని పసుపు అక్షతలు, పసుపు పచ్చని పూలతో పూజించాలి. దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచం పారాయణం చేయాలి.