Health Tips | జీవక్రియలు సజావుగా సాగినప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ, కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతిపదిమందిలో ఏడుగురు అయితే అజీర్ణ సమస్యతో లేదంటే అధిక బరువుతో బాధపడుతున్నారట. వీళ్లలో చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నవాళ్లే! అయితే, కొన్నిరకాల ఆహార పానీయాలతో బరువుకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. వీటివల్ల జీర్ణక్రియ సమస్యలను నియంత్రించొచ్చు అని చెబుతున్నారు. అవేంటంటే..
సోంపు పానీయం: మృష్టాన్న భోజనం తర్వాత సోంపు తింటే.. జీవక్రియ వేగం హెచ్చుతుందని మనకు తెలిసిందే! గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి మరగనివ్వాలి. తర్వాత వడగట్టుకొని, చల్లారాక తాగాలి. దీనివల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పొట్ట ఉబ్బరం తగ్గి, జీవక్రియలు వేగవంతమై బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
కొకుం జ్యూస్: కొకుం పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గించడంతోపాటు తక్షణ శక్తిని ఇస్తుంది. దీన్ని సమ్మర్ సూపర్ ఫ్రూట్గా అభివర్ణిస్తారు కూడా! కొకుం జ్యూస్తో ఎసిడిటీ తగ్గుతుంది. అజీర్తితో బాధపడుతున్న వాళ్లు కొకుం జ్యూస్ తాగితే ఉపశమనం పొందొచ్చు. శరీరంలోని చెడు కొవ్వు నిల్వల్ని ఇది నివారిస్తుంది.