అతిసార వ్యాధి బాల్యాన్ని వణికిస్తుంది. తల్లిదండ్రులను నిద్రపోనివ్వదు. పరిస్థితి చేయిదాటిపోయాక దవాఖానకు వెళ్లినా ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి, ప్రాథమిక దశలోనే తగిన జాగ్రత్తలు తప్పనిసరి. వీటిలో అనేక రకాలు..
1. నీటి విరేచనాలు (డయేరియా)
2. రక్త విరేచనాలు (డిసెంట్రీ)
3. దీర్ఘకాలిక విరేచనాలు (క్రానిక్)
నీటి విరేచనాలు: అకస్మాత్తుగా ప్రారంభం అవుతాయి. విరేచనాలలో నీరు సాధారణంగా 3-9 రోజులలో తగ్గిపోతుంది. 75% విరేచనాలు ఈ రకానికి చెందినవే. 65% విరేచన సంబంధ మరణాలు కూడా వీటి వల్లనే. పిల్లల్లో అప్పుడప్పుడూ జ్వరం, కడుపునొప్పి, వాంతులు కూడా రావచ్చు.
నీటి విరేచనాలకు ప్రధాన కారణాలు రోటా వైరస్, ఇ.కొలై బ్యాక్టీరియా.
రక్త విరేచనాలు: విరేచనాలలో నీరు తక్కువగా ఉంటుంది. రక్తం పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఆకలి బాగా తగ్గిపోయి
కడుపునొప్పి, జ్వరం వస్తాయి. ఫిట్స్ కూడా రావచ్చు. అతిసార సంబంధ మరణాలలో 15% వీటి వల్లనే.
ప్రధాన కారణం: షిగెల్లా అనే బ్యాక్టీరియా ముఖ్య కారణం. పెద్ద పిల్లల్లో
‘అమీబియాసిస్’ వల్ల కూడా రక్త విరేచనాలు అవుతాయి. వైద్యంతో మొదట రక్తం, జ్వరం తగ్గిపోయినా.. విరేచనాలు తగ్గడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది.
దీర్ఘకాలిక విరేచనాలు: ఇందులో విరేచనాలు 15 రోజులకన్నా ఎక్కువ కాలం కొనసాగుతాయి. బరువు తగ్గి ఆహార లోపాలకు దారి
తీస్తుంది. అతిసార సంబంధ మరణాలలో 20% దీనివల్లనే.
కారణాలు
1. సీసాతో పాలు, నీరు తాగించడం.
2. చక్కెర పదార్థాలు, ముఖ్యంగా లాక్టోజ్ అస్సలు జీర్ణం కాకపోవడం.
3. మాంసకృత్తులు జీర్ణం కాకపోవడం.
..ఇలాంటి సమయాల్లో ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, డాక్టర్ను సంప్రదించాలి. బిడ్డ డీ హైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవాలి.
-డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి , పిల్లల వైద్య నిపుణులు